Monday, December 31, 2012

రాళ్ళు

"లక్ష్మీ నేను ఆఫీసుకు వెళ్తున్నాను తలుపేసుకో" చెప్పులు వేసుకుంటూ చెప్పాడు సుబ్బారావ్. "అలాగే" పెరట్లోనుండే చెప్పింది లక్ష్మి. కాసేపటికి వాకిట్లో 'అమ్మా'అంటూ కార్తీక్ ఏడవడం వినిపించింది. "ఏమైంది నాన్నా" అంటూ హడావిడిగా వచ్చిన లక్ష్మికి కార్తీక్ కింద కూర్చుని కాలు పట్టుకుని ఏడుస్తూ కనిపించాడు. దగ్గరకు వచ్చి లేపబోతే కాలు పట్టుకుని బాధతో విలవిలలాడిపోయాడు కార్తీక్.
"అయ్యో కాలు బాగా నొప్పి చేసినట్లుందే?" అనుకుని గబగబా పిల్లాణ్ణి చేతుల్లో ఎత్తుకుని అటో కోసం వీధిలోకి వచ్చింది. ఇంతలో గోడ అవతల నుండి "లక్ష్మీ ఎందుకమ్మా బుజ్జిగాడు ఏడుస్తున్నాడు?" అని అడిగారు పిన్నిగారు.
"కింద పడ్డాడు పిన్నీ కాలు బాగా వాచింది. హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాను." చెప్పింది లక్ష్మి.
"అయ్యో మీ ఇంటి ముందున్న రాయే తట్టుకుని ఉంటాడు. అయినా అమ్మాయ్ నేను చెప్పానని కాదుగాని ఇంటిముందు మట్టి వాకిలి వున్నట్టయితే దెబ్బ తగిలేది కాదుగా ఏదో ఫాషనని మీరంతా రాళ్ళేయిస్తున్నారు కాని...." గోడ మీద నుండి చూస్తూ అన్నారావిడ. 
వీధిలో కూరలు కొనడానికి వచ్చిన విమలకు లక్ష్మి హడావిడిగా ఆటోలో వెళ్ళడం కనిపించింది. 
"ఏంటి పిన్నిగారు లక్ష్మీ అలా వెళుతుంది? ఏమయింది?" అని అడిగింది.
"బుజ్జిగాడు పడ్డాడు విమలా కాలు బాగా వాచింది. లక్ష్మి హాస్పిటల్ కు తీసుకుని వెళ్తుంది." చెప్పారు పిన్నిగారు. 

"ఓ అలాగా పిల్లలు పడ్డం మామూలేగా మా వాడయితే రోజుకు పదిసార్లన్నా పడుతుంటాడు. ఆ మాత్రం దానికి హాస్పిటల్ కి పరిగెత్తాలా" నిర్లక్ష్యంగా అంటూ లేత బెండకాయలు ఏరుకోవడం మొదలెట్టిది విమల.  

పిన్నిగారు లోపలకు వెళ్ళడంతోటే విమల హడావిడిగా బయలుదేరి సరళ ఇంటిముందు ఆగి "సరళా కార్తీక్ పడ్డాడట వాడికి కాలు విరిగిందట. బహుశ కాలు కూడా తీసేయాలంటారేమో" అప్పటి వరకు బలవంతంగా దాచుకున్న వార్తకు కొంత రంగులు కలిపి చేరవేసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.
"విరగదూ మరి. అయినా పెద్దవాళ్ళ తప్పులు ఊరికే పోతాయా! చిన్నపిల్లలకు ఇలాగే చుట్టుకుంటాయ్" నిన్న తనను పిలవకుండా లక్ష్మి సినిమాకు వెళ్ళిన అక్కసు తీర్చుకుంది సరళ. 
"బాగా చెప్పావ్, అయినా ఎంత డబ్బుంటే మాత్రం మిడిసిపాటు కాకపోతే ఇంటి ముందు అలా రాళ్ళేయించుకుంటారా" బాగా అయ్యింది అని పైకి అనలేక మనసులో అనుకుంటూ వాళ్ళ పోర్షన్ లోకి వెళ్ళిపోయింది విమల.
సరళ వెళ్లి ఈ విషయం వాళ్ళాయనతో చెప్పగానే అయన "వాడికి దూకుడెక్కువ ఏదో ఒక రోజు ఇలా అవుతుందనే నేను అనుకుంటూనే ఉన్నాను" అన్నాడు. 
ఆయన ఆఫీసుకు వెళ్ళడంతోటే అప్పారావు పిలిచి ఈ విషయం గురించి చెప్పాడు. 
అప్పారావు "మన దేశంలోనే ఈ దరిద్రం అంతా. అదే అమెరికాలో అయితే పిల్లలున్న ఇంట్లో అసలే రాళ్ళే వెయ్యకూడని చట్టముందట. ఎప్పటికి బాగు పడతామో మనం" నిట్టూర్చాడు.
అంతా వింటున్న పక్క సీట్లోని మహేష్ "అసలు తప్పంతా మన ప్రభుత్వానిదేనండి కంపెనీల దగ్గర లంచాలు తీసుకుని నాసిరకం రాళ్ళ తయారికి ఆమోద ముద్ర వేస్తే అవి పైకి లేచి ఇలాంటి ఘోరాలే జరుగుతాయి." ఆవేశం వెళ్ళగక్కాడు. 

"పిలకాయలు అంతేనండి ఎంత చెప్పు పరిగెత్తకుండా ఉండరు, ఏం చెప్పినా అనవసరం... వాళ్ళని మార్చడం దేముడి తరం కూడా కాదు, ఇక మన వల్ల ఏమౌతుందండి" నిరాశ
చుట్టూరా చల్లేశాడు జనార్ధన్.
"ఒక్కళ్ళనని ఏం లాభం. అసలు సమాజమే ఇలా తయారయ్యింది. దీన్ని మార్చాలనుకోవడం మన బుద్ది తక్కువ." వంత పాడాడు రామ్మూర్తి .
"మీరెప్పటికీ మారరా జరిగిన ఘోరం చూస్తే కడుపు తరుక్కుపోతుంది. 
"ముక్కుపచ్చలారని పిల్లాడు వాడు 
పరిగెత్తి పరిగెత్తి పడ్డాడు చూడు 
ఓ భూదేవి నీకు కరుణ లేదా 
ఓ సుడిగాలి నీకు దయ రాదా" అంటూ వెంటనే ఓ కవిత అల్లేశాడు
హరి.
బుజ్జిగాడి తండ్రి సుబ్బారావు కూడా అదే ఆఫీసులో పనిచేస్తున్నాడు. విషయం ఆయన దగ్గరకు వచ్చే సరికి పిల్లాడి వివరాలు మారిపోయాయి. "అసలు వాడి తల్లిదండ్రులను అనాలి పిల్లల్ని పట్టించుకోకుండా వీధిలో వదిలేయడం ఈ మధ్య ఫాషన్ అయిపోయింది." నాలుగు పడికట్టు పదాలు వాడేశాడు.

       ఆ రాయి అక్కడ ఎప్పటినుండో వుంది, ఆ మాటకొస్తే  ఆ వీధి వీధంతా రాళ్ళే పెద్దవాళ్ళు కూడా తట్టుకున్న సందర్భాలు వున్నాయి. ఎవరికీ వాళ్ళు తప్పుకుని పక్కన పోతూ వున్నారు. ఏదో ఒకరోజు ఇలాంటివి ఎదుర్కుంటారని తెలియందేమి కాదు అయినా కొత్తగా ఆశ్చర్యపోతున్నాం?(నటిస్తున్నామా?). 

      ఒక్కరంటే ఒక్కరైనా ఆ పిల్లాడికా దెబ్బ తగలడానికి  కారణమేంటి? వెళ్లి చూద్దామని కాని....ఏ రాయి తగిలి పడ్డాడు? ఒకవేళ రాయి తగిలి పడితే ఆ రాయి ఎక్కడుంది? దాన్ని పక్కకు తీద్దామన్నఆలోచన చేయలేదు. జరిగిన విషయం తెలుసుకోవాలి, పక్కవాళ్ళకు చెప్పాలన్నకుతూహలం మాత్రం మెండుగా వుంది అందరికీ. మన బాధో, ఆక్రోశమో అందరితో పంచుకోవాలి. అలా కాక ఏ ఒక్కరు నడుం కట్టినా నలుగురు కలసి ఆ రాయిని పెకిలించి మరో పదిమంది పిల్లలు పడకుండా చేయగలిగి ఉండేవారు. అది ఒక్కింటి సమస్య కాదు కాబట్టి వీధి వీధే కాదు ఆ ప్రక్షాళణ దేశంమంతా జరిగుండేది.

      ఎవరి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు వెళ్లబోసుకున్నారు. అక్కసు తీర్చుకున్నారు. ఆ వార్త కాలక్షేపం బఠాని అయ్యింది. సాయంత్రానికల్లా ఆ విషయమే మరచిపోయారు. నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోయారు. 
మరి మనమో...