Tuesday, July 8, 2014

పన్నీటి తలపులు నిండగా...

     పూర్వం ఐదు రోజుల పెళ్ళిళ్ళు చేసేవార్ట. ఆత్మీయులతో ముచ్చట్లు, బాజా భజంత్రీలు, సన్నాయి మేళాలు, పట్టు చీరల గరగరలు, కొత్త చుట్టరికాలు, హడావిడి పరుగులు....అలంటి పెళ్ళికి వెళ్ళొచ్చాక ఎలా ఉంటుందో అలా ఉందిప్పుడు. ఇంతకూ ఏమిటీ హడావిడి? ఎక్కడకు వెళ్ళామనే కదూ సందేహం. నాటా సంబరాలకు వెళ్ళాం. 

    శుక్రవారం అట్లాంటా చేరి మేరియట్ ముందు కారు దిగగానే ఆత్మీయ పలకరింపులు, ముప్పైయిదో అంతస్తులో ఓ అందమైన గది. అక్కడినుండి కిందకు చూస్తే ఆశ్చర్యం! సంబరాలు చూడడానికేమో ఆకాశాన్ని ఖాళీ చేసేసి చుక్కలన్నీ నేలకు దిగివచ్చాయి. 

   చీరలమీద చెమ్కీలయ్యాయి. చంద్రబోస్ గారి పాటలో అక్షరాలయ్యాయి, బాలుగారి స్వరంలో రాగాలయ్యాయి, నిర్మల గారి పదానికి అందెలయ్యాయి, రామారెడ్డి గారి పద్యాలలో ఛందస్సయ్యాయి, సాహితీ సభలలో చెణుకులయ్యాయి...అక్కడా ఇక్కడా అనేమిటి అంతటా తామై చుక్కలు మెరిసిపోయాయి....మురిసిపోయాయి.

   మృష్టాన్న భోజనం, చీనీ చినాంబరాలు, పద్యాలు, పాటలు, పుస్తకాలు, అవధానాలు...ఒకటా. రెండు రోజులూ మరో ప్రపంచంలోవున్నట్లే. ఇల్లూ, వాకిలి, మొక్కలు, పిల్లలు, బ్లాగులూ ఇలా ఏవీ గుర్తే రాలేదు. నాకు నచ్చినవి కొన్ని మీతో పంచుకుందామని...పదిలంగా దాచుకుందామని.

సంగీత నవావధానం  


సంగీత నవావధానం 
ఈ అవధానానికి శ్రీనివాస్ కిషోర్ భరద్వాజ గారు అధ్యక్షత వహించారు. మీగడ రామలింగస్వామి గారు అవధాని. రసరాజు గారు, వెన్నెలకంటి గారు, సింహాచల శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, వడ్డే కృష్ణ గారు, బాలాంత్రపు శారద గారు, దుర్వాసుల శిరీష గారు, దువ్వూరి రమేష్ గారు, ప్రాశ్నికులు. 

ఇదే మొదటిసారి సంగీతావధానం చూడడం. ప్రశ్నికులు అవధానిగారికి ఓ పద్యం ఇచ్చి ఫలానా రాగంలో పాడమని చెప్పగానే అవధాని గారు రాగాలు తెలియని వారికి కూడా అర్ధమయ్యే రీతిలో రెండు మూడు పాటల పల్లవులు పాడి ఆ రాగంలో పద్యం పాడారు. కొన్ని రాగాల విశిష్టతలను కూడా చెప్పారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 

పాటలు, పాట్లు, హిట్లు 


పేరు గమ్మత్తుగా ఉంది కదూ! చంద్రబోస్ గారే పెట్టారట. ఈ కార్యక్రమంలో రసరాజు గారు, వెన్నెలకంటి గారు, సుద్దాల అశోక్ తేజ గారు, చంద్రబోస్ గారు, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు పాల్గొన్నారు. 

పాట నచ్చితే మన మొబైల్ లోనో, ఐపాడ్ లోనో ఓ వెయ్యిసార్లన్నా వినేస్తూ ఉంటాం. ఆ పాట ఎవరు రాసారన్నది కూడా చాలా సార్లు పట్టించుకోము. అలాంటి పాటలు రాయడానికి పడే పాట్లు గురించే వివరించారు. అది కూడా పొట్ట చెక్కలయ్యేట్లు నవ్విస్తూ. రెండు గంటల కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. అందరూ పెద్ద పెద్ద రచయితలు ఎలా ఉంటారో అనుకున్నాను. వారికెవ్వరికీ కొంచం కూడా గర్వం లేదు. అందరితో ఎంతో చక్కగా మాట్లాడారు.

సాహితీ సదస్సు 

అశోక్ తేజ గారు 'నేలమ్మా... నేలమ్మా' అని పాడుతుంటే గుండె చెమ్మ కంటిలో మెరిసింది. వెన్నెలకంటి గారు 
 శ్రోతల ప్రశ్నలకు సమాధానంగా ఘంటసాల గారి పాటల గురించి, పాటల వెనుక కథల గురంచి ఎన్నో విషయాలు చెప్పారు. రమణి గారు మాటలు ఆ సభలో నవ్వుల పువ్వులు పూయించాయి. గెద్దాల రాధిక గారు కథ చదివారు. 
సింహాచల శాస్త్రి గారు వాగ్గేయకారుల గురించి వివరిస్తూ పద్యాలు పాడారు. భవిష్యత్తులో వారి హరికథ వినే భాగ్యం దక్కాలని కోరుకుంటున్నాను. 













ఈ సభకు అధ్యక్షత వహించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అరుదైన, అందమైన జ్జ్ఞాపకాన్ని పదిలపరుచుకునే అవకాశాన్నిచ్చిన మాధవ్ దుర్భ గారికి, సాహితీ విభాగం సభ్యులకు అనేకానేక ధన్యవాదాలు.  


అష్టావధానం 

శతావధాని నరాల రామారెడ్డిగారి అష్టావధానం చూసే భాగ్యం ఇన్నాళ్ళకు కలిగింది. సంచాలకులు: రసరాజు గారు, పృఛ్ఛకులు: ఆచార్య ఫణీంద్ర గారు, ఓలేటి నరసింహారావుగారు, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు, కొత్త రఘునాథ్ గారు, డాక్టర్ బి,కే మోహన్, బాలాంత్రపు వెంకట రమణ గారు,  కొలిచాల సురేష్ గారు డొక్కా ఫణీంద్ర గారు. 
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు అవధాని గారిని, సంచాలకుల వారిని, పృఛ్ఛకులను సన్మానించారు. 
నరాల రామారెడ్డి గారు, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు
రసరాజు గారు 
ఓలేటి నరసింహరావు గారు
డాక్టర్ బి కె మోహన్ గారు  
బాలాంత్రపు రమణ గారు 
ఈమాట సంపాదకులు కొలిచాల సురేష్ గారు
ఆచార్య ఫణీంద్ర గారు ప్రపంచాభాషలందు వెలుగు తెలుగు అన్నారు. గుర్తుంచుకోవలసిన మాట కదూ! వారు గుణింతాలలో దైవత్వాన్ని చూపించారు.
డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు 
నాటా జ్ఞాపిక 'స్రవంతి' సంపాదకులు కొత్త రఘునాథ్ గారు
'సాహిత్య రత్న' అవార్డ్ గ్రహీత డొక్కా ఫణి కుమార్ గారు  
రసరాజు గారు, జోన్నవిత్తులు గారు
ఘంటసాల రత్నకుమార్ గారు
ఈ సాహితీ వేదిక నిర్వాహకులు డాక్టర్ మాధవ్ దుర్భాగారు, ఎడవల్లి రామ్ గారు, చెన్నుభొట్ల రాధ గారు.