Wednesday, December 23, 2015

తుది మజిలీ

"ఏమైనా అయన అలా చేసి ఉండకూడదు."
"ఎవరూ?"
"రంగనాథ్ గారు...ఆత్మహత్య పాపం కదా?"
"ఆత్మహత్య-పిరికితనం, ప్రాణ త్యాగం-పౌరుషం, సజీవ సమాధి-పరిపూర్ణత్వం అంటూ మరణం పట్ల ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం విన్నావుగా"
"వింటే..."
"అంతా అనుభవించేశాను ఇంకేమిటీ జీవితం అని రాధాకృష్ణ గారితో ఇంటర్యూలో కూడా  చెప్పారు."
"అదంతా ఏం కాదులే... పిల్లలు చూడలేదట, అస్సలు ఆయన దగ్గరకు రానే రారట, ఒంటరిగా ఉండడంతో ఆయనకు డిప్రషన్ అట. వృద్దాప్యంలో తండ్రిని పట్టించుకోక పోవడం ఎంత దారుణం!"
"అట, అట, అట... ఆ మాటలలో నిజమేమిటో మనకు తెలుసా? అసలు తెలుసుకోవలసిన అవసరం ఏమిటి?"
"ఏమిటంటే కళాకారుల జీవితం నలుగురికీ సంబంధించిందీనూ! అయనంటే నాకు గొప్ప అభిమానం"
"అవునా!"
"నమ్మవా? "
"నమ్మాన్లే ...నువ్వు మాట్లాడుతున్నవన్నీ వింటున్నాగా! అభిమానం చూపించే పద్ధతి ఇదే కాబోలు."
"అంత నిష్టూరమేం! తెలుసుకోవాలనుకోవడం తప్పా?"
"మీ ఇంటి విషయాలు నువ్వు ప్రపంచమంతా చాటుకోవాలనుకుంటావా?"
"అదీ ఇదీ ఒకటేనా?"
"కానే కాదు. ముఖ్యంగా తండ్రి చనిపోయిన కొన్ని గంటలలో జరిగిందేమిటో కూడా పూర్తిగా జీర్ణించుకోలేని అయోమయంలో ఇష్టం లేకపోయినా నలుగురి ఎదుట మాట్లాడవలసిన పరిస్థితి ఉంది చూశావూ... అది మనలాంటి వాళ్ళకెలా తెలుస్తుంది..."

"......"
"......."

"అయన ఎంత మంచి కవితలు రాశారు..."
"నిజమే"
"అలాంటి తండ్రి కడుపున బుట్టి అలా ప్రవర్తించడం తప్పు కదూ!"
"అవును... నేనూ నమ్మలేక పోతున్నాను."
"చూశావా, చివరకు ఒప్పుకున్నావ్"
"ఓ వ్యక్తిని అభిమానిస్తూ ఆ పెంపకంలో పెరిగిన వారి గురించి నువ్విలా ఆలోచించగలుగుతున్నావంటే, ఆయన మాటల మీద, వ్యక్తిత్వం మీద నీకు విశ్వాసం లేదన్న మాటేగా!"

"...."

"ఒక్క విషయం ఆలోచించు. తల్లిలేని లోటు వయసుతో సంబంధం లేనిది. తండ్రి కూడా అర్ధాంతరంగా దూరమయిన క్షణాలలో వారి మానసిక స్థితి ఎలా ఉంటుందోనన్న విషయం మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా అర్ధం అవుతుంది. సానుభూతి చూపించి సహానుభూతిని అందించాల్సిన సమయంలో అపోహలు, అనుమానాలను వ్యక్తం చేయడం భావ్యమా? ఒక కళాకారుడిగా ఆ అక్షరశిల్పి సమాజానికి అందించిన సేవలకు ప్రతిఫలంగా ఆయన పోయిన తరువాత ఆ కుటుంబాన్ని ఒక ముద్దాయిగా నిలబెడుతున్న మన సంస్కారాన్ని ఏమనాలి? "




"అన్నీ తెలిసిన మనిషి కూడా బలహీన క్షణాలకు లొంగిపోవడం..."
"బలహీనక్షణాలో... బలమైన వైరాగ్యమో నిర్ణయించడానికి మనమెవరం?"

"ఎవరు  ఏ దారి వెంబడి వచ్చారో, పూల బాసలే విన్నారో,  ముళ్ళ కంపలు తొలగించడానికి  వారికి యుద్దాలే చేయవలసి వచ్చిందో ఎవరికి తెలుసు? తుది మజిలీ ఏమిటో ఎవరం ఊహించగలం?"


రంగనాథ్ గారికి అశ్రునయనాలతో నివాళి.