Showing posts with label పాఠశాల. Show all posts
Showing posts with label పాఠశాల. Show all posts

Thursday, April 25, 2019

పాటషాల

ఈ రోజు ఉదయం కాఫీ లేదు. ఎలా ఉంటుంది? ఫ్రిడ్జ్ లో పాలు లేని విషయం నిన్న సాయంత్రం  అంత ముఖ్యమైన విషయంగా తోచలేదు మరి. సరే ఉద్యోగం ఒకటి ఉందిగా ఉదయం ఆరున్నరకల్లా ఇంటి దగ్గర బయలుదేరితేగాని ఏడుగంటల ట్రైన్  దొరకదు. ఇవాళ హడావిడిగా లేచి పరుగులు పెడుతూ వచ్చి ట్రైన్ లో కూర్చున్నాను. రాత్రి కిక్ ఇంకా దిగలేదు, ఫుల్  హాంగ్ ఓవర్. 

"ఏమిటీ ఈ కోణం కూడా ఉందేమిటి" అని అపనమ్మకమూ, ఆశ్చర్యమూ కలిపేసి అలా కోపంగా చూడకండి. సంవత్సరంలో ఈ ఏప్రిల్ నెలలో ఎలాంటి మత్తులో ఉంటానో మా వాళ్ళందరకూ తెలుసు. అర్ధరాత్రుళ్ళు మెయిల్స్, వాట్స్ ఆప్ మెసేజెస్ వెళ్తుంటాయ్ కదా! సిలబస్ మీద పనిచేస్తుంటే నిద్రెలా పడుతుంది? సరే ఇదంతా మాకెందుకు చెప్తున్నట్లు అనుకుంటున్నారా?

నేపథ్యం తెలియకపోతే విషయం పూర్తిగా అర్ధం కాదుగా అందుకని.

ఇంతలో ఒకావిడ ట్రైన్  ఎక్కి ఖాళీగా ఉన్న సీట్లన్నీ వదిలేసి నా పక్కన వచ్చి కూర్చున్నారు.

"ఆర్ యు జ్యోతి? ”
"యా, సారీ ఐ డోంట్ రిమెంబర్ యు, డిడ్ వుయ్ మీట్ సంవేర్? " అడిగాను. 
"పాటషాల" అన్నారు. 

మత్తు కొంచెం దిగింది. పాఠషాల అయితే. చి, ఛీ పాఠశాల అయితే నన్ను గుర్తుపట్టాలిగా, నేనేనా అని  ఎందుకడుగుతున్నట్లు. సందేహం వచ్చింది. అవున్లే పట్టుదో, కాటన్ దో ఏదో ఒక చీర కట్టుకుని ఎప్పుడూ ఇంత బొట్టూ, కాటుకతో కనిపించే నేను ఇలా తెల్ల చొక్కా, నల్ల పేంట్ వేసుకుని, మొహాన బొట్టూ అదీ లేకుండా బరువు కళ్ళతో ట్రైన్ లో ఓ మూల కూర్చునుంటే ఎవరు మాత్రం గుర్తు పట్టగలరు? ఎందుకైనా మంచిదని

"డు యు స్పీక్ తెలుగు?" అని అడిగాను.
"పాటషాల అంటుంటే" అన్నారావిడ. 

మత్తుపూర్తిగా దిగింది.  
"ఓ మీ పిల్లలు పాఠశాలలో ఉన్నారా? ఒకటవ తరగతా?" అడిగాను. 
"లేదండీ నాలుగవ తరగతి" చెప్పారు. 
😭

సిలబస్ రివ్యూ చేస్తున్నప్పుడు ప్రతివారం డిక్టేషన్ లో పాఠశాల, భారతదేశము ఉండాలని లక్ష్మి గారు  ఎందుకన్నారో అప్పుడర్ధం అయ్యింది.

ఈ సారి సమ్మర్ వర్క్ లో శలు, ళలు, ణాలు.. ఇంకా ఫలు, ఠలు, ఢలు...... 😡😡😡

Tuesday, April 16, 2019

పాఠశాల పదవ వార్షికోత్సవం

పాఠశాల పదవ వార్షికోత్సవం జరుపుకున్నాం. అవునండీ పదవ వార్షికోత్సవమే. షార్లెట్ లో పుట్టి పెరిగిన పాఠశాల. ఎట్లా జరుపుకున్నామో తెలుసా! ధూమ్ ధామ్ గా జరుపుకున్నాం. 200 మంది విద్యార్ధులు, 37 మంది ఉపాధ్యాయులు, 700 మందికి పైగా సభ్యులు కలసి చేసుకున్నామంటే మరి చూడండి. మా ఉపాధ్యాయులు మంచి మంచి పాటలు, పద్యాలు, నాటికలు వేయించారు. చిన్న పిల్లలైనా మా విద్యార్ధులు బహు చక్కగా ప్రదర్శించారు. వార్షికోత్సవం నాటి భోజనల్లోకి వెయ్యికి పైగా లడ్లు స్వయంగా చేసుకున్నాం. బకెట్లు అవీ అంత తేలిగ్గా దొరకని అమెరికాలో కూడా బకెట్లతో సాంబారు వడ్డించుకున్నాం. భోజనానంతరం వేసుకున్న కిళ్ళీలు కూడా మేమే తయరుచేసుకున్నాం.

ఎప్పట్లాగే ఈ వార్షికోత్సవం కోసం కూడా మా పాఠశాల తల్లిదండ్రులతో సహా ఎవరినీ చందాలు అడగలేదు. మా విద్యార్ధులు తలకో నలభై డాలర్లు వేసుకున్న డబ్బుల్లో వాళ్ళకి తెలుగులో వ్రాసిన ట్రోఫీలు, ఉపాధ్యాయులకు ప్రముఖ రచయితలు స్వయంగా సంతకం చేసిన పుస్తకంతో పాటు చిన్న బహుమానం, పూర్వ ఉపాధ్యాయులకు ట్రోఫీలు, స్వచ్చంద కార్యకర్తలకు బుల్లి బహుమానాలు కూడా ఇవ్వగాలిగాం.

పాఠశాల గుర్తింపు చిహ్నంలో ఏం ఉన్నాయో తెలుసా? భాష, భావం, భవిత. వాటి అర్ధం భాషను నేర్పిస్తూ, మంచి భావాలు పెంపొందించి భవిత సన్మార్గంలో ఉండేట్టు చూడడం అన్నమాట. ఈ భావాలు పెంపొందించడం అంటే పాఠ్యాంశాలలో మంచి మాట, సుభాషితాలు పెట్టడమే కాక వాటిని ముందు ఆచరించి చూపిస్తున్నాం. ఎలా అంటారా?

ఉదాహరణకి ఫీజు లేకపోతే కమిట్ మెంట్ ఉండదనే భావనను తోసిరాజన్నాం, ఒక సంస్థ అభివృద్దికి ధనమో, ప్రచారమో అవసరం లేదని ఢ౦కా భజాయించి చెప్పాం. ఇప్పటివరకు మా కార్యక్రమాలకు స్పాన్సర్స్ లేరు. ఎవరైనా విరాళం ఇస్తామన్నా మేము తిరస్కరిస్తుంటాం.

మామూలుగా ఇవన్నీ చెప్పుకుంటే బాకా ఊదుకున్నట్లు ఉంటుందేమో అని మొహమాట పడేవాళ్ళం అయితే ఈసారి మా కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిధిలే ఆ మాట చెప్పాక మేము కూడా మహా గర్వంగా చెప్పుకుంటున్నాం. శ్రమ అనుకోకుండా ఎంతో దూరం నుండి మా కార్యక్రమానికి విచ్చేసి మా కుటుంబసభ్యుల్లా కలసిపోయిన కిరణ్ ప్రభ గారికి, కాంతి గారికి, ఫణి గారికి, శ్రీనివాస్ భరద్వాజ కిషోర్ గారికి, రవి శంకర్ గారికి అనేకానేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

పాఠశాాల ఉపాధ్యాయులకు ఒక పుస్తకం బహుమతిగా ఇవ్వడం పోయినేడాది నుండి మొదలుపెట్టాం. ఈ ఏడాది కొంతమంది రచయితలు పాఠశాల బృందానికి తమ సంతకంతో పుస్తకాలు పంపించారు. మధురాంతకం నరేంద్రగారికి, వారణాసి నాగలక్ష్మి గారికి, డొక్కా ఫణి కుమార్ గారికి, దగ్గుమాటి పద్మాకర్ గారికి, మునుకుంట్ల గునుపూడి అపర్ణ గారికి, రాధ మండువ గారికి, సోమరాజు సుశీల గారికి, పీ. సత్యవతి, అత్తలూరి విజయలక్ష్మి గారికి, పొత్తూరి విజయలక్ష్మి గారికి వేంపల్లి రెడ్డి నాగరాజు గారికి అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వీరిలో చాలా మంది రచయితలు ఉచితంగా తమ పుస్తకాలు పంపించారు.

అతిధుల మాటల్లో
https://www.paatasalausa.org/videos




























































Monday, April 16, 2018

వార్షికోత్సవం

        రంగులు మార్చుకున్న ఆకులు రాలి శీతాకాలం ప్రవేశించాక అంతటా నిశ్చలం. ఆకుల వియోగంతో మూగవోయిన కొమ్మలు... బూడిద రంగు ఆకాశంలో బద్దకంగా రెక్కలు విదుల్చుకుంటున్న పక్షులు. లోపల, బయటా అలుముకున్న స్తబ్ధత.

       చలి తాకిడికి కుంచించుకుపోయిన ఓ రోజుకి వార్షికోత్సవం పనులు మొదలెట్టలేదనే ఆలోచన తడుతుంది. పక్షి రెక్క విదిల్చి ముడుచుకున్నట్లు మెయిల్ ఒకటి వెళ్ళాక ఇక తప్పదన్నట్లు ఎవరో తంబూరా శ్రుతి చేస్తారు. కొత్త రాగాలు నేర్చుకుంటున్న వారు గొంతు విప్పే సమయానికి మేఘం చివరి నుండి చొచ్చుకుని వచ్చిన కిరణం భూమిని తాకుతుంది.

      విత్తనం నాటడం పూర్తయ్యాక వాలంటీర్ కోఆర్డినేటర్ అప్పుడప్పుడూ నీళ్ళు చిలకరిస్తూ ఉంటారు. నెల తిరిగేసరికి తెల్లని మంచుపైన వార్షికోత్సవం చివుర్లు తొడగడం కనిపిస్తుంది. ఈవెంట్ కోఆర్డినేటర్ కుంపట్లో మొక్కజొన్న కండెలు దోరగా కాలిస్తే, ట్రోఫీస్ కోఆర్డినేటర్ ఉప్పు, నిమ్మకాయ అద్దుతూ ఉంటారు. అందరూ కలసి చిరుచలిలో కబుర్లు చెప్పుకుంటూ ఒక్క గింజ కూడా మిగల్చకుండా మొత్తం వలిచేస్తారు. రాబోయే తీగలకు డెకరేషన్స్ టీం పందిరి సిద్దం చేస్తూ ఉంటారు.

     మూడు రాళ్ళు చేర్చి ఒక్క అగ్గిపుల్లతో నీళ్ళు వేడిచేయడం మొదలెడతారు ఫుడ్ టీం. టీ మరిగే సమయానికి చుట్టూ పళ్ళాలు, గిన్నెలు, బియ్యం, రైస్ కుక్కర్లూ అన్నీ ఎక్కడెక్కడి నుండో వచ్చి సర్దుకు కూర్చుంటాయి. బూడిద రంగు ఆకాశానికి సాయంత్రాలు జేగురు రంగు పులమడం మొదలౌతుంది. రాబోయే రంగులను అందంగా బంధించడానికి కెమెరాలకు కబుర్లు వెళతాయి.

       లోపలున్న వెచ్చదనం బయటకు పాకి కొమ్మలు పచ్చబారుతూ ఉంటాయి. చిలకలు అటూ ఇటూ ఎగురుతూ పలుకులు నేర్చుకుంటాయి. మంచు కరిగి మెల్లగా ప్రవాహం మొదలౌతుంది. నీళ్ళలో కొట్టుకొస్తున్న రంగు రాళ్ళనన్నింటినీ ఏరి ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఓ పక్కగా పోగు పెడుతూ ఉంటారు. అక్కడెవరో రాళ్ళలో రాగాలు వింటూ పరవశించి పోతుంటారు.

          నలుగురు నడిచే బాటలో అటువైపుగా కూర్చున్న అతను కాగితమొకటి తీసుకుని దీక్షగా సున్నాలేని అంకెలు గీస్తుంటాడు.

         మధ్యాహ్నాలు నీలంగా మారే సమయానికి తీగలన్నీ పైకి పాకి పచ్చని పందిరి తయారవుతుంది. నీలం వంకాయలు, లేలేత చింతకాయలు నలుగురితో కూర్చుని నవ్వుకుంటూ ఉంటాయి. స్ట్రాబెర్రీస్, కీర దోస నీళ్ళపైకి చేరి నిక్కినిక్కి చూస్తుంటాయి.

        పకోడీలు, టీలు ప్రయాణానికి సన్నాహాలు మొదలెడతాయి. అందరూ ఆడిటోరియం కు చేరుకుంటారు. నెగడు చుట్టూ ఆట మొదలౌతుంది. సాంబార్లు, దద్దోజనాలు బకెట్లలొ కూర్చుని వాడవాడలా షికార్లు చేస్తాయి.

         వార్షికోత్సవం పూలన్నీ పందిరి నిండా విరగబూస్తాయి. వసంతోత్సవం జరుపుకున్న చిన్న పెద్దా  గుండెనంతా వాసన నింపుకుని ఇంటి దారి పడతారు.



Wednesday, August 24, 2016

అర్థం అయినట్లా? కానట్లా?

మొన్న మొన్నేగా పరీక్షలు పెట్టి మార్కులిచ్చి, ఏడాది విజయవంతంగా పూర్తి చేసినందుకు  పిల్లలకు ఓ రెండు పిజ్జా ముక్కలు పెట్టాం. అదే రోజు "అమ్మయ్య ఇంక రెండు నెల్ల పాటు తెలుగు బాధ లేద"ని మురిసిపోతున్న అమ్మల చేతికి వేసవి అభ్యాసాలు ఇచ్చి ఇక నుండి ఈ పిల్లలకు తల్లైనా టీచరైనా మీరే. ఇవి పూర్తిచేయించి, ఇప్పటి వరకు నేర్చుకున్నవి మర్చిపోకుండా చూడండి."  అని మా టీచర్లు కన్నీళ్ళతో జాగ్రత్తలు చెప్పారు కూడానూ! అదేమిటో గట్టిగా రెండు వారాలు గడిచినట్టు లేదు అప్పుడే మళ్ళీ పాఠశాల తెరిచే రోజులొచ్చేశాయి.

ఇంతకూ టీచర్లందరూ ఏం చేస్తున్నారా అని ఈ వారం ఒక్కోళ్ళకీ ఫోన్ లు చేయడం మొదలెట్టాను. వాళ్ళ అంతరంగమేమిటో మీరు కూడా వినండి.

కదిలించినవి'ట'

అమ్మా మీ వలన నా మనవడు నేను మాట్లాడుకోగలుగుతున్నాం. మంచి పని చేస్తున్నారు తల్లీ అంటూ వచ్చిన ఫోన్ కాల్.

మీరు క్లాసులో ఎలా చెప్తున్నారో ఏమో కాని మా వాడితో నేను రెండేళ్ళ నుండీ చేయించలేని పనులు మీ మాట విని చక్కగా చేస్తున్నాడు థాంక్స్ టీచర్ అన్న ప్రశంస.

ఆరేళ్ళ నుండి షార్లెట్ లో ఉంటున్నాను. నేను ఇంట్లో ఉన్నానో లేనో ఎవ్వరికీ తెలీదు. రెండు వారాలు ఇండియా వెళ్ళి వచ్చేసరికీ "ఏమండీ ఎలా ఉన్నారు? జెట్ లాగ్ ఉందా? వంటా అదీ అని హడావిడి పడక రెస్ట్ తీసుకొండ్. మేము సాయంత్రం కూరలు తెస్తున్నాం" అన్న పేరెంట్స్ వాట్స్ ఆప్ మెసేజెస్.

తెలుగు నేర్పించాలని తపన పడుతున్న మీరు సరస్వతీ దేవితో సమానం. మీ దీవెనలు కావాలంటూ ఇంటికి పిలిచి భోజనం పెట్టి పండు తాంబూలం ఇచ్చి పిల్లాడితో కాళ్ళకు దండం పెట్టించి చేసిన సత్కారం.

ఇప్పటికి రెండు సార్లు అమెరికా వచ్చానమ్మా, ఎప్పుడెప్పుడు తిరిగి వెళ్ళిపోదామా అని ఉండేది. ఈ సారలా కాదు  మా పిల్లలిద్దరూ చక్కగా కబుర్లు చెప్తున్నారు థాంక్స్ మ్మా అన్న ఓ ఆంటీ మాటలు.
రగిలించినవి'ట'

ఏదో పార్టీ లో ఒక టీచర్ ని కలసిన పేరెంట్ , "సంవత్సరం నుండి క్లాస్ కు వెళ్తున్నా మా  పిల్లలు అస్సలు తెలుగులో మాట్లాడడం లేదండీ" అన్నారట. దానికి ఆ టీచర్ "తెలుగులో మాట్లాడం దాని తీరు తెన్నులు" గురించి ఓపిగ్గా ఓ పావుగంట పాటు వివరించారట. వెళ్ళేప్పుడు ఆ తండ్రి గారు, say good night to uncle. అంటూ పిల్లలకు చెప్పి See you on Sunday అని టీచర్ తో అంటూ వెళ్ళిపోయారట.

"ఫలానా రోజున పరీక్ష ఉంటుందని  పంపించిన మెయిల్ కి సమాధానం లేదు. తీరా పరీక్షకు పంపలేదని ఫోన్ చేస్తే నేను ఉద్యోగం చేస్తున్నానండి. నాకు కుదరక తీసుకురాలేదు. మరో  రోజు పెట్టండి." అన్న సమాధానం. 

"ఈ ఏడాది పాఠాలు చెప్పాం. వచ్చే ఏడాది మా ఇద్దరికీ  కుదరడం లేదు, మీరెవరైనా క్లాస్ తీసుకుంటారా అని టీచర్స్ ఓ  తరగతి పేరెంట్ ని అడిగితే దానికి  "అబ్బే మాకు కుదరండి. ఏదో మీ దగ్గర దింపిన గంటలో గ్రాసరీస్ అవీ తెచ్చుకోవడమో ఇంట్లో పనులేవో చేసుకుంటాం. మాకేలా కుదురుతుందీ అంటూ వచ్చిన  సమాధానం.    

అదండీ సంగతి. ఎండా వానా రెండూ ఉంటాయ మరి. అయినా ఇవన్నీ తెలిసినవేగా! అప్పట్లోనే ఆవిడెవరో బోలెడు బాధ పడిపోయారు కూడానూ. ఏమిటంటారా?  ఇక్కడ నొక్కితే మరొక్కమారు చదువుకోవచ్చు.

ఇక ప్రస్తుతానికి వస్తే ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మరో పది మంది కొత్త టీచర్లు మేం పాఠాలు చెప్తామంటూ ముందుకు వచ్చారు. అందులో తొమ్మిది మంది పాఠశాలకు పూర్తిగా పరిచయం లేని వాళ్ళు. మరో ముగ్గురు వాలంటీర్స్ "పాఠాలు చెప్పమన్నా చెప్తాం లేదా ఎప్పుడు ఏ పని కి సహాయం కావాలన్నా మేం రెడీ" అంటూ ఈ మధ్యే జరిగిన ఓ పిక్నిక్ లో కలిసి చెప్పారు.

పరీక్షలు, పాఠాలు, ఉపాధ్యాయులు, తరగతులు ఓ రెండు నెల్ల పాటు సందడే సందడి. మళ్ళీ కలుద్దాం. అంతవరకూ సెలవ్.

అన్నట్టు ఈ మధ్యే ఓపెన్ హౌస్ లో చెప్పిన మాట మీకు చెప్పడం మరిచేపోయాను.

"ఆవకాయ పెట్టడం పూర్తయ్యింది. ఆగస్ట్ నెలాఖరకు ఉపాధ్యాయులకు అందజేయబడుతుంది. ఉపాధ్యాయులు, "ఆవకాయ అమోఘంగా ఉంది. వారానికి నాలుగు రోజులపాటు తినండ"ని ఒక గిన్నెలోనో డబ్బాలోనే కొంచెం కొంచెంగా  ప్రతి వారమూ విద్యార్ధులకు ఇస్తారు.

ఇంటి దగ్గర వారానికో నాలుగు రోజులు అమ్మో, నాన్నో వేడిగా అన్నం వండి, కమ్మని నెయ్యి, కాస్తంత పప్పు కలిపి, పిల్లలకు ప్రేమగా గోరు ముద్దలు తినిపిస్తే దాని రుచి వాళ్ళు ఆస్వాదించ గలుగుతారు. అలా కాదు, ఆ తీరిక మాకు లేదు, ఆదివారం మధ్యాహ్నం రాత్రి మిగిలిన అన్నంలోనో, బిర్యానీ లోనో వారం మొత్తం తినాల్సిన ఆవకాయంతా కలిపేసి, బలవంతంగా పిల్లలకు తినిపించేస్తామంటే ... ఆ కారం తినలేక పిల్లలకు ఆవకాయ మీదే అయిష్టం కలుగుతుంది."


ఇదండీ సంగతి. విన్న వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇంతకూ వారికి విషయం అర్థం అయినట్లా? కానట్లా?


Thursday, May 5, 2016

అనుబంధం - ఆత్మీయత

       అప్పుడే ఏడాది పూర్తయ్యింది చిత్రంగా లేదూ! ప్రతి ఏడాది అనుకునే మాటే అయినా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. మా చిన్న కుటుంబం పెరిగి పెద్దదవుతోంది. ఇప్పుడు సరిపడా ఇల్లు కావాలంటే ఆ ఇంట్లో కనీసం ఓ నూట యాభై గదులన్నా ఉండాలి. ఏమిటీ ఆశ్చర్యపోతున్నారా పాఠశాల గురించి చెప్తున్నానండీ.

       తొంభై ఏడు మంది విద్యర్దులున్న పాఠశాలలో పోయినేడాది హఠాత్తుగా మరో నూట ఇరవై మంది విద్యార్ధులు రిజిస్టర్ చేసుకున్నారు. ఏం చెయ్యాలా అని ఆలోచించే లోపలే ఓ ఇరవై రెండు మంది ఉపాధ్యాయులు మేం పాఠాలు చెప్తాం అంటూ ముందుకు రావడం తలచుకుంటే మాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. పాఠశాలలో గత ఆరేళ్లుగా పాఠాలు చెప్తున్నవారున్నారు. మార్గ మధ్యలో కలసిన వారున్నారు, పోయినేడాది ఓపెన్ హౌస్ కి వచ్చి అప్పటికప్పుడు మేము కూడా పాఠాలు చెప్తాం అంటూ ముందుకు వచ్చిన వారున్నారు. అందరు టీచర్లు కూడా విజయవంతంగా ఈ ఏడాది పాఠాలు చెప్పడం పూర్తిచేశారు.

ఈ ఏడాది మురిపించిన అనుభవాలు కొన్ని....

"మేము మీ పిల్లలకు తెలుగు చెప్పడం మొదలు పెడుతున్నాం, ఈ ఏడాదే కాదు మన ఈ సంబంధం మరో నాలుగేళ్ళు పాటు కొనసాగుతుంది అంటూ ఒక టీచర్ పేరెంట్స్ కి పంపిన మెయిల్ తొలి మెయిల్ చూసినప్పుడు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. 

నిన్న ఒక టీచర్ మాట్లాడుతూ విద్యార్ధులకు నేర్పించిన దానికన్నాతాను నేర్చుకున్నదే ఎక్కువన్నారు. అది నూటికి నూరు పాళ్ళు నిజం. పిల్లలకు సుభాషితాలు, శతకాలు నేర్పిస్తున్నప్పుడు జీవితాన్ని తరచి చూసుకున్నది నాకూ అనుభవమే.

"ఇంతకు ముందు ఊర్లో ఉన్నామో లేదో, అసలు నేననేదాన్ని ఒకదాన్ని ఉన్నాననే ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు. ఓ రెండు వారాలు ఇండియా వెళ్ళిరాగానే ఎలా ఉన్నారు? జెట్ లాగ్ ఉందా? ఏమైనా వంట చేశారా? లేదా మ క్లాస్ పేరెంట్స్ అంటూ పలకరిస్తుంటే కళ్ళు చెమర్చాయంటే నమ్మండి". అంటూ మరో టీచర్.

"పిల్లలూ వారి పేరెంట్స్ తో పిక్నిక్ భలే సరదాగా గడిచింది. ఆ రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేశాం. మన టీచర్స్ అందరం కూడా వచ్చే ఏడాది తప్పక పిక్నిక్ వెళ్దాం" అంటూ మరో టీచర్.

"ఈ చిన్న పిల్లలకు ఇన్ని యాక్టివిటీస్  ఏమిటండీ. ఎప్పుడు క్లాస్ రీస్కెడ్యూల్ చెయ్యలన్నా కుదరదు. మాకు పిల్లల యాక్టివిటీస్  మీద పూర్తి అవగాహన వచ్చింది. మా అమ్మాయి పెద్దయ్యాక ఏ క్లాస్ ముఖ్యమో ఏది కాదో ఇప్పుడే తెలిసి పోయింది" అంటూ ఓ రెండేళ్ళ పాప ఉన్న టీచర్ ఆనందంగా చెప్పారు.

"మా పిల్లలు అ అంటే అట్టు, ఆ అంటే ఆవడ, ఇ అంటే ఇడ్లీ అంటూ చెప్తున్నరండీ" అని ఓ టీచర్ మురిపెం.

మొన్న ఒక ఈవెంట్ కి వెళితే  ఓ నాలుగురు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి హాగ్ లు ఇచ్చేశారు. ఎవరా అని చూస్తే పోయిన సంవత్సరం నా క్లాస్ విద్యార్ధులు అని తృప్తిగా మరో టీచర్...

మేము మా క్లాస్ పిల్లలతో క్రిస్ మస్ సెలవలలో జింజర్ బ్రెడ్ హౌస్ చేశామని ఒకరు, మా క్లాస్ వారందరం కలసి సంక్రాంతి జరుపుకున్నామని మరొకరు ఇలా ప్రతి తరగతిలో టీచర్ కు విద్యార్ధుల కుటుంబాలకు పెరుగుతున్న అనుబంధం చూస్తుంటే ఆనందంగానూ ఆశ్చర్యంగా ఉంది.

      ఇంతమందిని అలరించిన పాఠశాల వేసవి విశ్రాంతి తీసుకోబోతోంది. మా పిల్లలకు ఇక మీరే ఉపాధ్యాయులంటూ విద్యార్ధులను తల్లిదండ్రులకు అప్పగించిన టీచర్లు, పిల్లలకు అక్షరాలు చక్కగా వచ్చేశాయి. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న వాక్యాలు స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు. మేము ఎలా పంపిస్తున్నామో వేసవి అనంతరం మాకు ఈ పిల్లలను అలాగే తిరిగి ఇవ్వాలని పేరెంట్స్ కు జాగ్రత్తలు చెప్తున్న టీచర్లతో ఈ వారం హడావిడిగా ఉంది.

    తెలుగు నేర్పించడమే ప్రధానంగా మొదలుపెట్టిన పాఠశాల అనుబంధాల అల్లికతో కొత్త పుంతలు తొక్కడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది.



Monday, February 29, 2016

ఏమిటీ పాఠశాల??

         "ఎక్కడా అడ్వర్ టైజ్ మెంట్ లేదు. ఏ టివిలోనూ చూడలేదు, వార్తా పత్రికలోనూ చదివిన గుర్తులేదు. ఈ 250 మంది విద్యార్ధులేమిటీ! 45 మంది టీచర్లేమిటీ! మూడు ఊర్లలో ఈ తరగతులేమిటీ! ఏడాదికి ఏడాదికీ రెట్టింపు సంఖ్యలో విద్యార్ధులు పెరుగడమేమిటీ? ఏడువందల మందితో వార్షికోత్సవమా! పైగా ఇంతమంది కార్యకర్తలు ఏదో తమ కుటుంబంలో పనిలా చకచకా చేసేస్తున్నారు, అచ్చ తెలుగు వంటకాలు వండి తీసుకుని వచ్చి మారీ విందుభోజనం పెడుతున్నారు. ఎలా సాధ్యం అవుతోంది ఇదంతా?" అంటూ వేరే ఊరు నుండి మా ఊరు వచ్చిన వారు, నిన్న జరిగిన పాఠశాల వార్షికోత్సవంలో కలసినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి ప్రశ్నలకు సమాధానంగానే ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. 

      "పాఠశాల అంటే ఏమిటి? ఏం చేస్తున్నామిక్కడ?" అన్న విషయానికి వస్తే బంధాలు, బంధుత్వాలు గురించి చెప్పుకోవాలి. మనిషి సంఘజీవి. సుఖమైనా దుఃఖమైనా పంచుకునే వారుండాలి, మన వాళ్ళైతే మరీ సంతోషం. రక్త సంబంధీకుల మధ్యైనా సరే అనుబంధం బలపడాలంటే అర్ధం చేసుకునే భాష ప్రధానం. మన పిల్లలకు మన పెద్దవాళ్ళతో అనుబంధం ఏర్పడడానికి అవరోధంగా ఉంది ఈ భాష. మాతృభాష మనం పిల్లలకు నేర్పించినట్లయితే ఆ సమస్యను అధిగమించవచ్చుననే ఉద్దేశ్యంతో 2009 జనవరిలో చార్లెట్ లో మొదలైంది పాఠశాల. 

       అయితే ఇప్పటి విద్యావిధానం అటు ఇండియాలో కానీయండి ఇక్కడ కానీయండి కేవలం బ్రతుకు తెరువు చూపించే చదువుల పట్ల శ్రద్ధ వహిస్తున్నాయి కాని, మానవ సంబంధాలు, అనుబంధాలు, మానసిక వికాసం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మనం చిన్నప్పుడు నలుగురి మధ్య పెరిగిన వాతావరణం కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. రోజులో ఎక్కువ శాతం చదువు, వారి క్లాసులు వాటితోటే వారికి సమయం గడిచిపోతోంది. మిగిలిన సమయం ఎలెక్ట్రానిక్స్... పిల్లలకు మంచీ, చెడూ చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా పూర్తిగా మనమీదే ఉంది. ఇవన్నీ కూడా పిల్లలకు పాఠాలు చెప్తున్నప్పుడు వారిని గమనించి తెలుసుకున్న అంశాలు. అందుకే తెలుగు నేర్పించడమే ధ్యేయంగా పెట్టుకున్న పాఠశాల విద్యావిధానంలో నీతి శతకాలు, మంచి విషయాలు, సుభాషితాలు చేర్చడం జరిగింది. ఈ శతకాలు నేర్చుకోవడం వలన మరో ప్రయోజనం భాషలో స్పష్టత పెరగడం. 

      భాష భావం భవిత...ఇవి పాఠశాల లక్ష్యాలు. మాతృభాషను బోధిస్తూ, విద్యార్ధులలో మంచి భావాలు పెంపొందించి భవితను సన్మార్గం వైపు నడిపించడమే పాఠశాల ముఖ్యోద్దేశ్యం.

       ఏడేళ్ళ క్రితం తెలుగు నేర్పించాలని నిర్ణయించుకున్న తరువాత ఎదురైన సమస్య ఏమి నేర్పించాలి, ఎలా నేర్పించాలి? పుస్తకాలు లేవు, ఇండియా నుండి తెప్పించిన పుస్తకాలు తెలుగు రాయడం నేర్పించడానికి ఉపయోగపడుతున్నాయి కాని మాట్లాడడం నేర్పడానికి కాదు. అప్పుడే సిలబిస్ స్వంతంగా తాయారు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు రూపకల్పనే ఈ నాటి నాలుగు తరగతుల పాఠ్యాంశాలు. ఆ తరువాత పిల్లలకు ఆసక్తి కరంగా ఉండేలా వర్క్ షీట్స్ తాయారు చేయడం జరిగింది. ఈ అభ్యాసాలు పూర్తిచేయడం వలన వారికి రాయడం, చదవడమే కాక చక్కని తెలుగు మాట్లాడానికి కూడా తేలిక అయింది.


      "నేను ప్రొఫెసర్ ను కాను, లక్చరర్ ని కాను, చివరకు టీచర్ ని కూడా కాను మరి నాకున్న పరిమితజ్ఞానంతో తాయారు చేసినటువంటి ఈ సిలబస్ సరైనదేనా? ఎవరైనా తెలిసిన వారు చూసి చెపితే బావుణ్ణు" అని అనుకుంటూ ఉండేదాన్ని. అనుకోకుండా ఓ ఆరు నెలల క్రితం "తెలుగు ఎందుకు నేర్పించాలి?" అన్న చర్చలో పాల్గొనడం జరిగింది. అదే చర్చలో పాల్గొన్నటువంటి కేతు విశ్వనాధ రెడ్డి గారి మాటల ద్వారా వారు పలు విద్యా సంస్థల సిలబస్ ను పరిశీలించినట్లుగా అర్ధం అయింది. వారు డా|| బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటి డైరెక్టర్ గా పని చేసిన వారూ, ప్రముఖ కథకులు, విమర్శకులు కూడానూ. వారికి విషయం చెప్పాను. ఆయన వెంటనే "తప్పకుండానమ్మా పంపించండి చూద్దాం"  అన్నారు. సిలబస్ పంపించాను. 

     వారు క్షుణ్ణంగా పరిశీలించి, సిలబస్ లోని ప్రతి వాక్యాన్ని వివరిస్తూ దాదాపుగా మూడు గంటలు నాతో మాట్లాడారు. వారేమన్నారంటే "పరభాషా మాధ్యంలో పెరుగుతున్న పిల్లలకు ముందుగా నేర్పవల్సింది మాతృభాషలో మాట్లాడడం. అది కూడా చాలా సులువుగా ఉండాలి. వారి తల మీద బరువులా ఉండకూడదు. బాగ్ ని సంచి అని, టేబుల్ ని బల్ల అని, సాక్స్ ను మేజోళ్ళు అని  నేర్పనవసరంలేదు. వాడుక భాష నేర్పినట్లయితే వారు సులభంగా నేర్చుకోగలుగుతారు. మీ సిలబస్ సరళంగా నేర్చుకునేలా ఉంది. ఇలాగే ఉండాలి కూడా". అంటూ అక్కడా చిన్న చిన్న మార్పులు సూచించారు. ఆ మాటతో గొప్ప ఉత్సాహం వచ్చింది. 

       షికాగో, విస్కాన్సిన్, అగస్టా, మెంఫిస్... ఇలా చాలా ప్రాంతాల వారు మా పాఠశాల విద్యావిధానం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. సిలబస్ అడిగితే సంతోషంగా ఇస్తున్నాం. అయితే ఒక్క షరతు ఈ సిలబస్ ను విజ్ఞానం పంచడానికి ఉపయోగించాలే తప్ప వ్యాపారంగా మార్చుకోవడానికి కాదు. అంటే తెలుగు నేర్పించడానికి మా సిలబస్ తీసుకున్నట్లయితే వారికి పాఠాలు ఉచితంగా చెప్పాలి. న్యూ జెర్సీ లోని జై గురుదత్త సంస్థ వారు పాఠశాల సిలబస్ నుపయోగించి పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు.  

      మాకు తెలుగు నేర్పించడమే ప్రధానం. అందుకే మా ఉపాధ్యాయులే విద్యార్ధుల దగ్గరకు వెళ్తారు. అర్ధం కాలేదా? మా పాఠశాలకు స్కూల్స్ అవీ అవసరం లేదండీ. ఉపాధ్యాయుల ఇళ్ళే తరగతులు. ఆరుగురు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయులు, అంతకు మించితే ఇద్దరు ఉపాధ్యాయులు. సంఖ్య ఎక్కువైన కొద్దీ విద్యార్ధులందరినీ పట్టించుకోవడం కుదరదు.  

      భాష కోసం ఏమైనా చెయ్యాలనే తపన ఉన్నవారు కొందరైతే, ఎలాగూ మన పిల్లలకు నేర్పాలనుకుంటున్నాం మరికొంత మందితో కలిసైతే ఉత్సాహంగా నేర్చుకుంటారని అనుకునే వారు మరికొందరు. పాఠశాల వలన మా పిల్లలు మా పెద్దవాళ్ళతో మాట్లాడగలుగుతున్నారు ప్రతిగా పాఠశాలకు ఏమైనా చెయ్యాలనుకునే వారు ఇంకొందరు. ఇలా ఎవరికి వారు ఆలోచించుకుని పాఠాలు చెప్పడానికి ముందుకు వస్తున్నారు.  

       ఎక్కడా అడ్వర్టైజ్ మెంట్ లేదేమిటి? అని వారిడిన ప్రశ్నకు మా సమాధానం అడ్వర్ టైజ్ మెంట్ ఇవ్వడానికి ఇది వ్యాపార సంస్థ కాదు. పిల్లలకు తెలుగు నేర్పించండి అని మేమెవ్వరికీ చెప్పం. పిల్లలకు తెలుగు నేర్పించాలనుకోవడం స్వవిషయం. తెలుగు నేర్పించాలనుకునే వారికి సహాయం చేస్తాం. మా పాఠశాల తల్లిదండ్రులకు కూడా ఒక్కటే చెప్తాం. "మీరే మీ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు. ఉపాధ్యాయులు దానికి సులువైన మార్గం చూపిస్తారు."     
  
        కొలంబియా తెలుగు అసోసియేషన్ వారు పోయిన సంవత్సరమే పాఠశాల తరగతులు మొదలు పెట్టారు. ఈ ఏడాది అక్కడ నలభైకి పైగా విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్నారు. రాలేలో ఈ ఏడాదే పాఠశాల మొదలైంది. అక్కడ కూడా పాతిక మంది వరకు విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్నారు. ఎక్కువ సంఖ్యలో విద్యార్ధులు తెలుగు నేర్చుకోవడం చూస్తుంటే మాతృభాష మీద పెరుగుతున్న మమకారానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. 


Monday, April 13, 2015

పాఠశాల ఆరవ వార్షికోత్సవం

         పాఠశాల ఆరవ వార్షికోత్సవం శ్రీ మన్మథ నామ సంవత్సర ఉగాది నాడు కమ్యూనిటీ హౌస్ మిడిల్ స్కూల్లో జరిగింది. పోయినేడాది కూడా ఇక్కడే జరిగింది కాని, అప్పుడు పాఠశాలలో యాభై మూడు మంది విద్యార్ధులు, పదకొండు మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఏడాది నూటనాలుగు మంది విద్యార్ధులు, పంతొమ్మిది మంది ఉపాధ్యాయులు. అంటే సగటున ప్రతి ఐదుగురు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయులున్నారన్నమాట. ఇది పాఠశాల విద్యార్ధులు చేసుకున్న అదృష్టం. 
ఉపాధ్యాయులు 
వేలూరి రాధ, సూరే మంజుల, వాడకట్టు శైలజ, కింతలి అనురాధ ఉపాధ్యాయులుగానే కాక పాఠశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. 


        పడాల ఉష, మారోజు కవిత, సుంకే జ్యోతి, చెట్టా రమేష్, భైరి ఈశ్వరి, మేడికయాల లక్ష్మి, సూర్యదేవర హరిత, 
గుమ్మడి సుధ, మల్లాది శశికాంత్, బులుసు పద్మ, కాకాని లక్ష్మి, పాండవ రోహిణి, రామడుగు మాధురి, గండ్లూరి భాను ప్రకాష్ ఈ ఏడాది కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు.  ఏ పని చేయడానికి వాలంటీర్లు ఎవరూ ముందుకు రావడంలేదని వింటుంటాం. 


వచ్చినా వారు నిబద్దతతో పనిచెయ్యరని అపోహ. అలాంటిది ఏడాది పొడవునా ప్రతివారం ఓ సమయానికి కట్టుబడి పాఠాలు చెప్తున్న  ఈ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. 


వీరు పాఠాలు చెప్పడమే కాదండి, పాఠశాల తరగతులను తమ ఇంట్లోనే  నిర్వహించడానికి సహృదయంతో ముందుకు వచ్చారు. ఒంట్లో బాగాలేని రోజులుంటాయి, ఆఫీసులో ఒత్తిడి, పిల్లలకు బాగా లేకపోవడం, చుట్టాలతో బిజీగా ఉన్న సందర్భాలు... ఇలా ఎన్నో ఉంటాయి.
సంవత్సరం మొదట్లో రూపొందించిన కాలెండర్ ప్రకారం ప్రతి వారం తరగతి నడిపే ఉపాధ్యాయులకు ఏమిచ్చినా ఋణం తీరదు. పైగా విద్యార్ధులు హోం వర్క్ చేయకపోయినా, ఎవరైనా కొంచెం వెనకబడుతూ ఉన్నా “ఆ పిల్లాడు చాలా బాగా చేస్తాడండి. ఇంట్లో వాణ్ని కూర్చోబెట్టి వాడేం చేస్తున్నాడో కొంచెం చూసేవాళ్ళుంటే బావుణ్ణు” అంటూ విద్యార్ధుల గురించి వీళ్ళు బాధపడి పోతారు. 

       ఇందులో ఆరుగురు టీచర్ల పిల్లలు పాఠశాల విద్యార్ధులు కారు.

అయినప్పటికీ వారు మాతృభాష మీద అభిమానంతో పాఠాలు చెప్పడానికి ముందుకు వచ్చారు. కొంత పని చేసి ఎంతో ప్రతిఫలం ఆశించే ఈ రోజుల్లో నిస్వార్ధంగా ఇంత సహాయం చేస్తున్న ఉపాధ్యాయులకు ఏడాదికి ఒక్క రోజు భోజనం పెట్టి తమ సంతోషం మేరకు వాళ్ళను సత్కరించాలనే తల్లిదండ్రుల ఆలోచనతో ఈ వార్షికోత్సవం. 

మా ఆహ్వానాన్ని మన్నించి విద్యార్ధులను ఆశీర్వదించడానికి డొక్కా ఫణి కుమార్ గారు రావడం ఓ విశేషం.
       ఈ ఏడాది మరో విశేషం పాఠశాల కొలంబియా, సౌత్ కేరోలినాలో మొదలవడం. ప్రముఖ కవి విన్నకోట రవిశంకర్ గారు, విద్యాసాగర్ గారు ఉపాధ్యాయులు. వారికి తమ ప్రోత్సాహం అందిస్తున్న వారు కొలంబియా తెలుగు అసోసియేషన్ అద్యక్షులు కడాలి సత్య గారు. 
కొలంబియా పాఠశాల బృందం 

ఎంతో మంది, ఎన్నో రోజుల కృషి ఫలితం ఈ వార్షికోత్సవం. తెర వెనుక
వుండి అహర్నిశలూ కష్టపడిన వారిని ఇప్పుడు పరిచయం చేస్తాను. 



వార్షికోత్సవ బాధ్యతలు భుజాన వేసికొని ఈ కార్యక్రమాన్ని నడిపించిన సమన్వయకర్త డోకి శ్రీనివాస్ గారు. ప్రణాళికా బద్దంగా ప్రతిపనికి 
ఓ సమయాన్ని కేటాయించి, వారానికో సమావేశం ఏర్పాటుచేసి, ప్రతి చిన్న విషయాన్నీ వివరంగా పరిశీలిస్తూ సమర్ధవంతంగా నిర్వహించారు.

       

విద్యార్ధుల కార్యక్రమాల గురించి ఉపాధ్యాయులతో మాట్లాడుతూ వారి సాధక బాధకాలను పరిశీలిస్తూ, అవసరం మేరకు సలహాలు సూచినలు ఇచ్చి వేలూరి రాధ గారు కష్టతరమైన కార్యాన్ని ఎంతో ఇష్టంగా నిర్వహించి దిగ్విజయంగా పూర్తి చేశారు. 

ఈ కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించడం దగ్గర నుండి ఇప్పటి వరకు కీలక పాత్ర పోషిస్తున్నవారు సూరె మంజుల గారు. ఈ కార్యక్రమానికి నిర్వాహక బాధ్యత తీసుకుని కూడా కొత్తవారిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో వెనుకనే ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించారు.

ఒక కార్యక్రమం నిర్వహించాలంటే స్పీకర్లు, మైకులు, పాలు,
నీళ్ళు లెక్కలు, అప్పులు, వసూళ్ళు, వగైరా, వగైరా, వగైరా. ఈ హరైనా అంతా పడుతూ డాలర్ అడిగితే “క్వార్టర్ తో సర్దుకుందురూ” అంటూ కోత వేసి చాలా పొదుపుగా ఈ కార్యక్రమాన్ని బడ్జెట్ ప్రకారం నడిపిన వారు దేవినేని నీలిమ గారు. ఈవిడ ఫుడ్ కమిటీ లో కూడా ఉన్నారు. అక్కడ మాత్రం ఈవిడ అన్నపూర్ణే. నాలుగు ట్రేలు సరిపోతాయంటే “లేదండీ... ఆరైతే బెటర్” అంటూ వంటలన్నీ ఘనంగా వండించారు. 


       పాఠశాల తరగతుల నిర్వహణ కోసం తమ ఇంటిని వాడుకోమని
సహృదయంతో ముందుకొచ్చి సహాయం చేసిన వారు ముందుకు వచ్చినవారు మొగిలి షర్మిల గారు. అంతేకాదండి ఎప్పుడు ఉపాధ్యాయులకు ఇబ్బంది వచ్చినా ఆ తరగతిని నడపడానికి సహాయం చేశారు. తమ పిల్లలు పాఠశాల విద్యార్ధులు కానప్పటికీ మీకెప్పుడు అవసరమైనా నేనున్నానంటూ ఉపాధ్యాయులకు సహాయపడినవారు గుడితి వేణి గారు.                                                                                                            
తెలుగులో ప్రశంసా పత్రాలు తాయారు చేయడమే కాక, జ్ఞాపికల మీద కూడా తెలుగులోనే పేర్లు వ్రాయించి తెప్పించిన వారు వర్ధినేని వెంకట్ గారు. 

ఈ వార్షికోత్సవం జరుపుకోవడానికి మనకు వేదిక సమకూర్చిన వారు గొట్టిపర్తి వెంకట్ గారు. కేవలం ఒక్క గంటలో వేదిక అలంకరణ పూర్తి చేసి కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికి మొదలయ్యేలా సహకరించిన వారు వాడకట్టు శైలజ గారు, వాడకట్టు సునీల్ గారు, పడాల సూర్య గారు, వేమూరి సత్య గారు, పుల్లేటి కల్యాణి గారు. 
ఎప్పుడు కొన్నారో ఎలా జాగ్రత్త చేసారో కానీ మనకు తాజా రోజాలను అందించిన వారు. అంబటి సరిత గారు, కింతలి అనురాధ.


వచ్చవాయ్ రామ్ కుమార్ ఈ కార్యక్రమానికి వీడియోలు తీయడమే వెంటనే యూ ట్యూబ్ లో పెట్టేశారు కూడా. ఆ వీడియోలను ఇక్కడ చూడొచ్చు. 

కార్యక్రమం మొదటినుండి ఓపిగ్గా ఫోటోలు తీస్తున్నారు ఫణి కుమార్ గారు, మల్లాది శశికాంత్ గారు. ఫణి కుమార్ గారు తీసిన ఫోటోలను ఇక్కడ, శశికాంత్ గారు తీసిన ఫోటోలను ఇక్కడ చూడొచ్చు. 

శశికాంత్ ఉపాధ్యాయులు కూడా. ఫణి కుమార్ గారి శ్రీమతి ఈశ్వరి పాఠశాల ఉపాధ్యాయులు. వీరు కూడా అవసరమైనప్పుడు తరగతి నిర్వహణలో సహాయం చేస్తుంటారు. 


కార్యక్రమమైన విజయవంతం అవడానికి అతిముఖ్యమైనవి. స్పీకర్లు, మైకులు. వాటిని తీసుకొచ్చి అమర్చి వాటి బాగోగులు చూస్తున్న వారు సుంకర శశికాంత్ గారు. 


తమ సరదా సంభాషణలతో సమర్ధవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యాఖ్యాత పారుపూడి ఉష గారు.


కార్యక్రమానికి ఎంత మంది హాజరవుతారో చూసి అందరికీ సరిపడా భోజనం

తరయ్యేలా చూడడం శ్రమ కంటే వత్తిడితో కూడకున్న పని. వంటలు, వడ్డనల ఏర్పాట్లు చూస్తున్న వారు పుల్లేటి కళ్యాణి, పండ లక్షి, కుంట రంజని, దేవినేని నీలిమ. 

చదవలవాడ రాజా గారు, వేమూరి సత్య గారు అవసరమైన ప్రతి దగ్గర మేమున్నామంటూ ముందుకు వచ్చి అన్ని పనులూ సవ్యంగా జరిగేలా చూశారు.

ఈ వార్షికోత్సవంలో తమ ప్రజ్ఞా పాటవాలతో మనల్ని అలరించిన విద్యార్ధులకు అభినందనలు. వారికి ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులు ధన్యవాదాలు.


అచ్చతెలుగుపేర్లతో తయారయిన జ్ఞాపికలు 



ఒకటవ తరగతి 



ఒకటవ తరగతి 


ఒకటవ తరగతి 

ఒకటవ తరగతి 
ఒకటవ తరగతి 



మూడవ తరగతి విద్యార్ధులు 



పూర్వ విద్యార్ధులు 


రామ లక్ష్మణులు 


ప్రజ్ఞా పత్రాలు, జ్ఞాపికలు అందుకుంటున్న రెండవ తరగతి విద్యార్ధులు 



రామ రావణ యుద్ధం 


సింహము, కుందేలు కథ చెప్తున్న విద్యార్ధులు 


శ్రీ రామ విజయం నాటిక వేసిన నాలుగవ తరగతి విద్యార్ధులు 


సోది 

బుఱ్ఱ కథ 

ఉగాది పచ్చడి 


తల్లిదండ్రులు తమ స్వహస్తాలతో తయారుచేసిన విందు భోజనం 
తాంబూలాలు  


పాఠశాల వైభవాన్ని తమ దర్పణంలో ప్రతిబింబించిన ఐడియల్ బ్రెయిన్ , ఆంద్ర ప్రభ, అంతర్జాతీయ తెలుగు వార్తా వేదిక, తెలుగు కమ్యూనిటీ న్యూస్, తెలుగు టైమ్స్ పత్రికలన్నింటికీ ధన్యవాదాలు.

ఒక సంస్థ అభివుద్ది వైపు అడుగులు వేయాలంటే ఒక వ్యక్తి కాదు ఓ వ్యవస్థ కావాలన్న నిజాన్ని గ్రహించి నడుం కట్టి ముందుకొచ్చి వార్షికోత్సవాన్ని విజయపంథాలో నడిపించిన కార్యనిర్వాహకులందరికీ అభినందనలు.