Sunday, January 29, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యాశాల - 8

కొట్టకల్ - ఆర్యవైద్యాశాల - 7

కొట్టకల్ లో ఉన్న మూడు వారాలలో ఒక్క సినిమా చూడలేదు, పగలంతా ఎవరినీ కలిసిందీ లేదు. ఉదయాన్నే పార్కులో నడక, కాంటీన్ లో టిఫిన్, పుస్తకాలు చదవడం, సాయంత్రం గుడి దగ్గర అక్కడకు వచ్చిన వాళ్ళతో కబుర్లు, రాత్రి భోజనం, ఇలా ఉండేది దినచర్య. ఎప్పుడూ చుట్టూ మనషులు, ఉద్యోగాలు, వారాంతంలో పాఠశాల, పార్టీలు ఇలా హడావిడిగా ఉండే మా ఇద్దరికీ చాలాకాలం తరువాత తీరుబడి చిక్కింది. జీవితపు ఈ మజిలీలో కలకాలం గుర్తుంచుకోవలసిన పరిచయాలు, గుర్తుండిపోయే క్షణాలు కొన్ని. 

వివేక్ విజయన్, పి.కె.వారియర్ గారి మనుమడు, అక్కడే కైలాసమందిరంలో ఉంటున్నారు. వివేక్ బహుముఖ ప్రజ్ఞాశాలి, వేదం చదువుకున్నారు, ఆస్ట్రాలజీ తెలుసు, రచయిత. జీవితం విసిరిన సవాల్ ను ఆత్మస్థైర్యంతో ఎదుర్కుంటున్న అతనిని చూసి ఎంతో నేర్చుకోవచ్చు అనిపించింది.  

డాక్టర్ సరోజ్ బజాజ్, అక్కడకు పేషెంట్ గా వచ్చారు. హిందీ సాహిత్యంలో పి.హెచ్.డి పట్టా పుచ్చుకుని, ప్రొఫెసర్ గా పనిచేసి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. హైదరాబాద్ లో మహిళల కోసం సుమన్ జూనియర్ కాలేజ్, మహిళా దక్షత సమితి కాలేజ్ ఫర్ విమెన్, సుమన్ వొకేషనల్ కాలేజ్ ఫర్ గాళ్స్, నర్సింగ్ కాలేజ్ లు నడుపుతున్నారు. పేద విద్యార్థినిలకు అక్కడ పూర్తిగా ఉచితం. నేషనల్ సిటిజన్స్ అవార్డ్, మహిళా శిరోమణి, మహిళా రత్న పురస్కార్, బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డ్ లాంటి ఎన్నో అవార్డ్స్, బంగారు పతకాలు రాష్టపతి గ్యాని జైల్ సింగ్ యాదవ్, మదర్ థెరిస్సా, శంకర్ దయాళ్ శర్మ గారి సతీమణి విమలా శర్మ లాంటి నుండి అందుకున్నారు.   

బహదూర్, అజయ్ నేపాల్ నుండి వచ్చి అక్కడ కాంటీన్ లో పనిచేస్తున్నారు. ఏడాదికి ఒక్కసారే వారి దేశానికి వెళ్ళి కుటుంబాన్ని కలిసేది. లేచిన దగ్గర నుండి పడుకునే  ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కానీ  సంతోషాన్ని స్వంతం చేసుకునే విద్యేదో వాళ్ళకు తెలిసినట్లుంది మొహం మీద నవ్వులేకుండా ఎప్పుడూ కనిపించలేదు.   

గుడి మెట్ల మీద కబుర్లు, మసాలా టీ, చైనీస్ ప్లాటర్ కలిసి పంచుకున్న కొట్టకల్ స్నేహాలు, బుల్లి డాక్టర్ల ముచ్చట్లు బావున్నాయి అన్నీ. రెండు నెలలు పాటు పథ్యం ఉంటూ మందులు వాడమన్నారు. ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రయాణం బావుంది. 

మీరెవరైనా ఆయుర్వేద చికిత్స తీసుకుని ఉంటే మీ అనుభవాలు కామెంట్ లో వ్రాయండి, మరి కొంతమందికి ఉపయోగపడొచ్చు. ఇంతవరకూ ఈ  కబుర్లున్నీ ఓపిగ్గా విన్న మీకందరకూ ధన్యవాదాలతో  

స్వస్తి 




Wednesday, January 25, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 7

కోజికోడే (కాలికట్), కొట్టకల్ కు నలభై ఐదు కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఈ  పట్టణం ఒకప్పుడు మలబార్ జిల్లా రాజధాని. "సిటీ ఆఫ్ స్పైసెస్"  అని పిలువబడే ఈ పట్టణంలో సుగంధ ద్రవ్యాల ఎగుమతి ఏడవ శతాబ్దం నుండి మొదలైయ్యింది. అంతే కాదు  వాస్కోడిగామా మొదటిసారి భారత దేశానికి అడుగు పెట్టిన ప్రాంతం అది. "కోజికోడే బీచ్ లో సూర్యాస్తమయం చాలా బావుటుంది. అక్కడ ఎస్.ఎమ్ స్ట్రీట్ అనే వీధిలో దొరికే స్వీట్స్ రుచి అమోఘం" అని హాస్పిటల్ స్టాఫ్ చెప్పారు. కొట్టకల్ కు దగ్గరలోనే ప్రఖ్యాతి గాంచిన గురువాయూర్ గుడి ఉంది. ఇవి రెండూ  చూడాలని సరదా పడ్డాం. 

ఆర్యవైద్యశాల నుండి బయటకు వెళ్ళడానికి డాక్టర్ అనుమతి తీసుకోవాలి.  అలా వెళ్ళొస్తామని డాక్టర్ తో చెప్పగానే  "ట్రీట్‌మెంట్ తీసుకునే సమయంలో శరీరానికి విశ్రాంతి అవసరం, ఎక్కడికీ ప్రయాణం చేయకూడదు" అనేసారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు శరీరం చాలా సున్నితంగా అవుతుందట. అలాంటి సమయంలో చిన్న పాటి కుదుపులకు కూడా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువట. అంతే కాదు ట్రీట్మెంట్ పూర్తి అయిన తరువాత కూడా రెండు వారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పారు. 

ఈ విషయం ముందుగా తెలిస్తే కొంత ముందే వచ్చి అవన్నీ చూసే వాళ్ళం కదా అనుకున్నాము.ట్రీట్‌మెంట్ రేపు పూర్తవుతుందనగా కొట్టకల్ లోనే ఉన్న మ్యూజియమ్, హెర్బల్ గార్డెన్, కాలేజ్ చూసి వచ్చాము. 

మ్యూజియమ్ చూడవలసిన ప్రదేశం. అక్కడ ఆర్యవైద్యశాల చరిత్ర, పి.ఎస్.వారియర్, పి.కె.వారియర్ లకు వచ్చిన అవార్డ్స్, వైద్యశాల మొదలెట్టినప్పటి ఫోటోలు, పి.వి.యస్ నాట్య సంఘంలో ప్రదర్శనలిచ్చిన ప్రముఖుల ఫోటోలు, ఇంకా ఎన్నో విశేషాలు వివరంగా వ్రాసి ఉన్నాయి.





ఛారిటబుల్ హాస్పిటల్,  మ్యూజియమ్ ఉన్న ప్రాంగణంలోనే ఉంది. మేము వెళ్ళిన సమయంలో కన్సల్టేషన్ కోసం వచ్చిన పేషంట్స్ తో హాస్పిటల్ ముందు చాలా పెద్ద లైన్ ఉంది. అక్కడ ఇన్ పేషంట్స్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఆయుర్వేదంతో పాటు అక్కడ అల్లోపతి డాక్టర్స్ కూడా ఉంటారట. అక్కడ వైద్యం, భోజనం, రూమ్ అన్నీ ఉచితం.


హెర్బల్ గార్డెన్ లో ఆయుర్వేద మందుల తయారీకి కావలసిన మొక్కలు పెంచుతున్నారు. పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. 






అక్కడకు కొంచెం దూరంలోనే ఆయుర్వేద కళాశాల ఉంది. చాలా పెద్ద కాలేజ్, హాస్టల్ కూడా ఉంది. 
డాక్టర్స్ రౌండ్స్ కు వచ్చేటప్పుడు వారితో పాటు జూనియర్ డాక్టర్స్ ఇద్దరు వచ్చేవారు. వాళ్ళు ఒకరు కొట్టకల్ లో మరొకరు ఉత్తరాఖండ్ లో అంతకు ముందు సంవత్సరమే BAMS పూర్తి చేసారట. ఆయుర్వేదంలో కోర్సు పూర్తి చేసాక ఒక గురువు దగ్గర కానీ హాస్పిటల్ లో కానీ పని చేయాలి. హౌస్ సర్జన్సీ లాగా అన్నమాట. వాళ్ళిద్దరితో ఒకరోజు కాంటీన్ కు వెళ్ళాను, ఆయుర్వేద వైద్యం గురించి, కొట్టకల్ హాస్పిటల్ గురించి చాలా వివరాలు చెప్పారు. 

మాన్యుఫాక్చరింగ్ యూనిట్ హాస్పిటల్ కు దగ్గరలోనే ఉంది కానీ చూడడానికి అనుమతి లేదు. అక్కడ తయారయిన మందులు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. మందుల తయారీకి అవసరమైన ఆకులు, మూలికల కోసం ఫామ్స్ లో చాలా మొక్కలు పెచ్చుతున్నారు. ఇవే కాక అడవులలో దొరికేవీ గిరిజనులు సేకరించి ఇస్తారు. 


Tuesday, January 24, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 6

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 5 
హాస్పిటల్ కు వచ్చిన రెండవ వారం తనకు మరో ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. ఉదయం చేసే ట్రీట్‌మెంట్ పేరు పొట్లి. మూలికలు, దినుసులు వేసి వేడిచేసి మూటలా కట్టి నూనెలో ముంచి నొప్పి ఉన్న ప్రాంతంలో పొట్లితో కాపడం పెడతారు.
Picture courtesy - Google

Picture courtesy - Google
సాయంత్రం చేసే ట్రీట్‌మెంట్ శిరోవస్తి, తల మీద బ్రిడ్జి లాగా కట్టి వెచ్చని నూనెతో నింపుతారు. వెన్నెముక గట్టిపడడానికి, లేదా వెన్నెముకకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఈ ట్రీట్‌మెంట్ వలన తగ్గుతుంది.
ప్రతిరోజూ ఉదయాన్నే బీపీ చూడడానికి ఒకరు, మందులు ఇవ్వడానికి మరో నర్స్ వచ్చే వాళ్ళు. ఆ తరువాత డాక్టర్స్ వచ్చేవారు. సాధారణంగా హాస్పిటల్స్ లో డాక్టర్స్ రౌండ్ కు వస్తున్నారంటే ఒకలాంటి హడావిడి కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ అలాంటిదేమీ ఉండదు, స్టాఫ్ అంతా కూడా ప్రశాంతంగా కనిపిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం మరో డాక్టర్ వచ్చి పేషంట్ ఎలా ఉన్నారో కనుక్కుని వెళ్ళే వారు.

హాస్పిటల్ ఎదురుగా గుడి ఉందన్నాను కదా అది విశ్వంభర గుడి. దానిని పి.యస్.వారియర్ కట్టించారు. గుడి ముందున్న ప్రవేశ ద్వారం పైన అల్లా, క్రీస్తు, కృష్ణుడి చిహ్నాలు ఉన్నాయి. అస్పృశ్యతను పాటించే అప్పటి రోజుల్లో కూడా కులం, మతం అనే పక్షపాతం లేక ఆ గుడిలోకి అందరికీ ప్రవేశం ఉండేది.
అయ్యప్ప స్వామి దీక్ష మొదలు పెట్టే రోజు, గుడి బయట, లోపల అంతా దీపాలు పెట్టి, పువ్వులతో అందంగా అలంకరించారు. 



గుడికి ఎదురుగా ఒక స్టేజ్ కట్టి ఉంది. పి.వి.యస్ నాట్య సంఘం లోని కళాకారులు మేము అక్కడ ఉన్న మూడు వారాలలో మూడుసార్లు ప్రదర్శన ఇచ్చారు. మాకు ఆ విధంగా కథాకళి నృత్యాన్ని దగ్గరగా చూసే అవకాశం కలిగింది. ఈ నృత్యంలో కళ్ళు, కనుబొమల కదలికలతో నాట్యం చేయడం గమ్మత్తుగా ఉంది. ఈ నాట్యంలో కళాకారులకు వేసే రంగులలో కూడా చాలా అర్థం ఉంటుందట.ఈ నాట్య సంఘం జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, చైనా, కొరియా, ఇండోనేషియా ఇలా పలు దేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది.                                          
           

ప్రతి సంవత్సరం ఒక వారం రోజుల పాటు ఆ గుడి ప్రాంగణంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కేరళలోని చాలా ప్రాంతాల నుండి కళాకారులు వచ్చి ప్రదర్శనలు ఇస్తారు. ఆ వేదిక మీద యేసుదాస్, పద్మ సుబ్రమణియం, ఎమ్. ఎస్, సుబ్బలక్ష్మి గారు అలాంటి ప్రముఖులు ప్రదర్శన ఇచ్చారు.   

 
రోజూ సాయంత్రాలు ఏడు గంటల తరువాత గుడికి వెళ్ళే వాళ్ళం. మాలాగా ట్రీట్‌మెంట్ కి వచ్చిన వారు కలిసేవారు. ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండే కాక, ఇతరదేశాల నుండి కూడా పేషెంట్స్ వచ్చారు. అక్కడకు విదేశీయులు రావడం విశేషం అనిపించింది. 

ఒక్కొక్కళ్ళది ఒక్కో సమస్య. ఆర్థరైటిస్, స్లిప్ డిస్క్, డిస్క్ బల్జ్, సాయటికా, వర్టిగో, సోరియాసీస్, ఆటో ఇమ్యూన్ డీసీజెస్ ఇలా. అందులో కొంతమంది పది సంవత్సరాల నుండీ వస్తున్నవాళ్ళు ఉన్నారు. మాకొక సందేహం వచ్చింది. ఒకసారి ట్రీట్‌మెంట్ తీసుకున్నాక వ్యాధి నయమైతే మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని. దానికి వాళ్ళ సమాధానం ఏమిటంటే "సర్జరీ తప్పనిసరి అని అల్లోపతి డాక్టర్స్ చెప్పినా ఇక్కడ ట్రీట్‌మెంట్ తో సర్జరీ అవసరం లేకుండా మామూలు జీవితం గడపుతున్నాము. ఏడాదికి ఒకసారి ఇక్కడకు మెయింటెనన్స్ కు వస్తూ ఉన్నాము" అని.

సాధారణంగా ఏదైనా వ్యాధి వచ్చిన వెంటనే కాక అల్లోపతి వైద్యంలో నయమవనప్పుడు చివర ప్రయత్నంగా ఆయుర్వేదం, హోమియోపతీ వైద్యానికి వెళ్తాం. అప్పటికే జరగవలసిన అనర్ధం జరిగిపోతుంది. మొదట్లోనే వస్తే తగ్గే అవకాశం ఉంటుందట.

విజయవాడ నుండి ఒకళ్ళు ఏడు సంవత్సరాల నుండీ వస్తున్నారు. "విజయవాడలో లో కొట్టకల్ క్లినిక్ ఉంది, ఈ మసాజ్ లు, ట్రీట్మెంట్స్ అక్కడ కూడా ఉన్నాయి కదా, మరి ఇంత దూరం వస్తున్నారే" అని అడిగాము. "ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఉన్నన్ని రోజులు విశ్రాంతి చాలా ముఖ్యం, అక్కడే ఉంటే రోజు వారీ పనులతో ట్రీట్‌మెంట్ తీసుకున్న ఫలితం కనిపించడం లేదు" అని చెప్పారు.

ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయికి ఫైబ్రోమైయాల్జా. హైదరాబాద్ లో ఎందరో డాక్టర్స్ కు చూపించారట,  తొమ్మిది నెలల పాటు ఎన్నో సార్లు హాస్పటిల్ లో జాయిన్ అయిందట. అక్కడ డాక్టర్స్ ఇక తగ్గదు అని చెప్పినప్పుడు పెన్ కూడా పట్టుకోలేని స్థితిలో కొట్టకల్ కు వచ్చారట. వచ్చిన వారంలోనే ఆ అమ్మాయి మామూలుగా అయిందట. ఆ పాపను ఆరు నెలలకు ఒకసారి చొప్పున మూడుసార్లు రమ్మన్నారట. అది మూడవ సారి వాళ్ళు రావడం. 

ఆర్యవైద్యశాలకు వైద్యం కోసం వచ్చిన ప్రముఖులలో రాష్ట్రపతి వి.వి.గిరి, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, జయప్రకాష్ నారాయణ్, ఇంకా సినీ నటులు ఉన్నారు.

Saturday, January 21, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 5

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 4 వ భాగం 

పి.యస్.వారియర్ వ్రాసిన విల్లు ప్రకారం ఆయన మేనల్లుడు పి.ఎమ్.వారియర్ మానేజింగ్ ట్రస్టీ అయ్యారు. మందులు తాయారీలో విద్యుత్ తో పనిచేసే యంత్రాలను ఉపయోగించడం ఈయన ఆధ్వర్యంలోనే మొదలైంది. ఆర్యవైద్యశాల అభివృద్దికి ఎన్నో ప్రణాళికలు రూపొందించారు కానీ బాధ్యత తీసుకున్న పది సంవత్సరాలలోపే విమాన ప్రమాదం వలన అకాలమరణం పాలయ్యారు. 

ఆ తరువాత చీఫ్ ఫిజీషియన్ గా పనిచేస్తున్న పి.ఎమ్. వారియర్ చిన్న తమ్ముడు పొన్నియంబల్లి కృష్ణన్కుట్టి వారియర్ మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యత తీసుకున్నారు. 
ప్రతి రోజూ ఉదయం కైలాస మందిరంలో ఉన్న విశ్వంభర స్వామిని దర్శించుకోవడం, పి.యస్.వారియర్ సమాధి దగ్గర దీపం వెలిగించడం, అష్టాంగ హృదయం చదవడం, ఆ తరువాత హాస్పిటల్ లో వైద్యం కోసం వచ్చిన వారిని చూడడం ఇది ఆయన దినచర్య. ఆ హాస్పిటల్ ను, ఛారిటబుల్ హాస్పిటల్ ను చూసుకుంటూ, కావలసిన మందులేవో తయారు చేసుకుంటూ ఉంటే కొట్టకల్ పేరు మరెక్కడా వినిపించేది కాదేమో! 
పి.కె.వారియర్ హస్తవాసి మంచిదనే పేరు రావడంతో వైద్యం కోసం ఎక్కడెక్కడి నుండో ప్రజలు రావడం మొదలు పెట్టారు. అప్పటి రాష్ట్రపతి వి. వి. గిరి కొట్టకల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు.  

వైద్యం అన్ని ప్రాంతాల వారికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో డిల్లీ, మరియు కొచ్చిలో ఆయుర్వేద హాస్పిటల్స్ మరియు రీసెర్చ్ సెంటర్స్, ఇరవై ఆరు ప్రాంతాలలో క్లినిక్ లు ఏర్పాటు చేసారు. హాస్పిటల్ లో పెరిగిన రోగులకు సరిపడా ఔషదాలు తయారుచేయడం కోసం పాలక్కాడ్ లో, నంజన్గుడిలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ ప్రారంభించారు. 

చూర్ణాల రూపంలో ఉన్న ఔషదాలను టాబ్లెట్స్ రూపంలోకి తీసుకుని వచ్చారు. రీసెర్చ్ చేస్తూ ఎన్నో కొత్త మందులు తయారు చేయడం కూడా మొదలు పెట్టారు. కెనడాలోని ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్ (IDRC) తో కలసి పనిచేసి మెడిసినల్ ప్లాంట్స్ మీద పుస్తకాలు వ్రాసారు. 

మందుల తయారీ పెరిగింది. నాణ్యత చూడడానికి గాను సెంటర్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద అండ్ సిద్ద (CCRAS), AYUSH, DST, DAE, IIT సంస్థల సహకారంతో క్లినికల్ రీసెర్చ్ సెంటరు ప్రారంభించారు. ఈ రీసెర్చ్ సెంటర్ AYUSH, DSIR, KSPCB సంస్థల గుర్తింపు పొందింది. ఈ రీసెర్చ్ సెంటర్ లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు మందు కనిపెట్టారు. ప్రస్తుతం అక్కడ కాన్సర్ కు మందు కనిపెట్టడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. 

పి.కె.వారియర్ ఆయుర్వేదం మీద ఎన్నో వ్యాసాలు వ్రాసారు. రష్యా, అమెరికా వంటి దేశాలలో ఆయుర్వేదం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. 
ఆయుర్వేదంలో ఈయన చేసిన సేవలకు, సాధించిన ప్రగతికి పద్మశ్రీ, పద్మభూషణ్, ధన్వంతరి, కేరళ సాహిత్య అకాడమీ అవార్డ్ ఎలా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. 



ఇన్ని అవార్డ్ లు అందుకున్నా తన జీవితంలో సంతోషకరమైన విషయం ఏమిటని ఒక ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నకు "జీవితం మీద ఆశ వదిలేసుకున్న పేషెంట్స్ ను తిరిగి ఆరోగ్యవంతులుగా చూడడం" అనే చెప్పారట. ఆర్యవైద్యశాల వంటి సంస్థను ముందుకు తీసుకువెళ్ళే అవకాశం దొరకడం తన అదృష్టం అంటారు.  

ఎన్ని పనులు చేస్తున్నా వైద్యునిగా తన బాధ్యత మరువలేదు. పేద, గొప్ప తారతమ్యం చూపించక అందరినీ ఒకేలా చూసేవారు. డెభై సంవత్సరాల పాటు సమర్ధవంతంగా ఆ బాధ్యతలను నిర్వర్తించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని 2021 వ సంవత్సరం జులై 10 వ తారీఖున దివంగతులయ్యారు. 

తరువాత రోజు పార్క్ లో నడుస్తుంటే అనిపించింది, ఆయుర్వేదంలో ఎంతో ప్రగతిని సాధించిన మహానుభావులు ఒకప్పుడు ఇదే దారిలో నడిచే వారనీ, వారి జీవితాశయం, ఆ ఆశయ సాధన కోసం వారు చేసిన కృషికి నిదర్శనమే ఈ వైద్యశాల అని అర్థమైనప్పుడు, అంతవరకు ఏ భావం కలగనటువంటి ఆ ఊరు, ఆ హాస్పిటల్, ఆ దారిపై ఎనలేని గౌరవం కలిగింది. 

డాక్టర్ పి. కె. వారియిర్ గురించి ఇక్కడ చదవొచ్చు. 

Tuesday, January 17, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 4

కొట్టకల ఆర్యవైద్యశాల - 3 

లైబ్రరీ నుండి తెచ్చిన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. కేరళ లోని ఒక మామూలు గ్రామమైన కొట్టకల్, ఆయుర్వేదానికి పుట్టినిల్లుగా నిలిచిందంటే దానికి కారణం డాక్టర్ పి.ఎస్.వారియర్. అతని కలే ఈ ఆర్యవైద్యశాల. ఆ కలకు ఆయన ప్రాణం పోస్తే దానిని ఈ మధ్య కాలం వరకూ నడిపినవారు ఆయన మేనల్లుడు డాక్టర్ పి.కె.వారియర్.
బ్రిటిష్ పాలనలో ఆయుర్వేదం మెల్లమెల్లగా కనుమరుగు అవుతున్న రోజులు. 1902 వ సంవత్సరంలో ముప్పై రెండేళ్ళ పొన్నియంబల్లి సంకుణ్ణి వారియర్, కొట్టకల్ లో ఆర్యవైద్యశాల ప్రారంభించారు. ఈయన అతి చిన్న వయస్సులో ఆయుర్వేదం నేర్చుకోవడమే కాక ఒక డాక్టర్ దగ్గర మూడేళ్ళ పాటు అల్లోపతి కూడా అభ్యసించి, చిన్న చిన్న సర్జరీలు చేయడం కూడా నేర్చుకున్నారు. 
అప్పటికి ఆయుర్వేదం గురించి సరైన పుస్తకాలు లేవు. వైద్యులు అనుసరించే విధానాలు వేరువేరుగా ఉండేవి, ఒక్కొక్క వైద్యుడు ఒక్కో విధంగా చికిత్స చేసేవారు. పి.యస్.వారియర్ 1907 వ సంవత్సరంలో ‘చికిత్స సంగ్రహం’ అనే పుస్తకం వ్రాసారు. ఆ పుస్తకంలో ఏ వ్యాధులకు ఏ మందులు, ఎంత మోతాదులో వాడాలి, పంచకర్మ ఎలా చేయాలి, ఇంకా  ప్రత్యేక చికిత్సా విధానాలు, ఫిజిచల్ కోర్సులు ఇవన్నీ కూడా అందరికీ అర్థమైయ్యేలా తేలిక భాషలో వ్రాసారు. ఆ పుస్తకం ఎన్నో ఇతర భాషలలోకి అనువదించబడింది. 
1925 వ సంవత్సరంలో అనాటమీ, ఫిజియాలజీ కి సంబంధించిన ‘అష్టాంగశరీరం’ అని పుస్తకం వ్రాసారు. ఆ పుస్తకాన్ని కాలేజ్ సిలబస్ లో చేర్చడం జరిగింది. ఆయుర్వేదంలో మొదటి పత్రిక ‘ధన్వంతరి’ కూడా ఈయనే ప్రారంభించారు. సాధారణ ప్రజానీకానికి కూడా ఆయుర్వేదం గురించి తెలుసుకోవడానికి దోహద పడిన ఈ పత్రిక ఇరవై మూడు సంవత్సరాల పాటు నడిచింది .  

అల్లోపతి లో టాబ్లెట్స్ రూపంలో మందులు దొరుకుతున్న కాలంలో ఆయుర్వేదంలో మందుల తయారీ లేదు. వైద్యులు, రోగులకు ఏ మందులు వాడాలో వాటిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తే, రోగులు లేదా వారికి సంబంధించిన వారు మూలికలు, ఆకులు సేకరించి మందులు తయారు చేసుకునే వారు. దీని వలన మందు సరైన మోతాదులో లేకపోవడమో, ఒకటో అరో మూలికలు వేయకపోవడమో జరిగేది. దాని వలన జబ్బు నయం అయ్యేది కాదు. ఆయుర్వేదంలో ఈ విధానమే కనుక కొనసాగితే ప్రజలకు ఆ వైద్య విధానం పట్ల నమ్మకం పోతుందని పి.యస్.వారియర్ భావించారు. 

ఆయుర్వేద వైద్యులు మందులు తయారుచేసి అందరూ అవే వాడినట్లయితే ఆ సమస్య తీరుతుందని భావించి పి.ఎస్.వారియర్ ఆర్యవైద్యసమాజాన్ని ప్రారంభించారు.  

అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే ఆలోచనతో 1924 సంవత్సరంలో చారిటబుల్ హాస్పిటల్ ప్రారంభించారు. ఇక్కడ వైద్యం, భోజనం, వసతి అన్నీ ఉచితం. ఈ హాస్పిటల్ లో ఆయుర్వేదంతో పాటు అల్లోపతి వైద్యం కూడా ఇస్తారు. 

ఆయుర్వేదం అభివృద్ది చెందడానికి పుస్తకాలు, మందులే కాదు, ముఖ్యంగా కావలసింది వైద్యులు. అందుకోసంగా పి.యస్.వారియర్ 1917 సంవత్సరంలో కాలికట్ లో ఆయుర్వేద పాఠశాల ప్రారంభించారు. ఆ తరువాత ఈ పాఠశాలను కొట్టకల్ కు మార్చారు. ఆ పాఠశాల తరువాత కళాశాలయై, ప్రస్తుతం విద్యార్థులకు ఆయుర్వేదంలో డిగ్రీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. 

ఆ విధంగా ఆయుర్వేదానికి సంబంధించిన పుస్తకాలు, మందులు తయారు చేయడానికి కావలసిన ఫార్ములా, వైద్యం చేయడం నేర్పించే పాఠశాల ఏర్పడ్డాయి. ఇక కావలసింది మందులు తయారు చేసే మాన్యుఫాక్చరింగ్ యూనిట్. అది కూడా కొట్టకల్ లోనే ప్రారంభమైంది. మందుల తయారీకి అవసరమైన మొక్కలను ఫామ్స్ లో పెంచుతున్నారు. 



ప్రస్తుతం ఈ యూనిట్ లో ఐదు వందల రకాల మందులు తయారవుతున్నాయి. ఏడాదికి ఎనభై ఐదు కోట్ల రూపాయల మందులు తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. దాదాపుగా 1000 మంది ఏజంట్స్ ఉన్నారు. ఇన్ని ఉన్నా ఆయుర్వేద మెడిసిన్స్ అని గూగుల్ లో వెతికితే డాబర్, హిమాలయ లాంటి బ్రాండ్స్ కనిపిస్తాయి కానీ కొట్టకల్ కనిపించదు, దానికి కారణం వారు మార్కెటింగ్ గురించి ఖర్చు పెట్టకపోవడమే.
పి.యస్.వారియర్ ఆయుర్వేద వైద్యం పెంపొందించడానికి చేసిన కృషిని గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు వైద్యరత్న బిరుదు ఇచ్చి సత్కరించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ లో సభ్యునిగా చేర్చుకోవడమే కాక ఆయుర్వేద వైద్య విధానాల పట్ల వారి వైఖరిని మార్చుకున్నారు. పి.ఎస్.వారియర్ జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వం 2002 వ సంవత్సరంలో కొట్టకల్, పి.యస్.వారియర్ స్టాంప్ విడుదల చేసింది.
పి.యస్.వారియర్ కు వైద్యమే కాదు కళల పట్ల కూడా ఆసక్తి మెండు. ఆయన 1909 లో ‘పరమ శివ విలాసం’ అనే నాటక కంపెనీ ప్రారంభించారు. తాను స్వయంగా కొన్ని నాటకాలు కూడా వ్రాసి వేయించే వారు. తరువాత కాలంలో అది పి.యస్.వి నాట్య సంఘంగా మారింది. కేరళలోని ప్రఖ్యాతి గాంచిన నాట్య సంఘాలలో ఇది కూడా ఒకటి.

ఏ సంస్థ అయినా ప్రారంభించిన వారు కనుమరుగవగానే రూపురేఖలు మార్చుకుంటుంది, చాలా సందర్భాలలో శిథిలమైపోతుంది కూడా. అయితే ఆర్యవైద్యశాల మాత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ సంస్థ ఇంత సమర్ధవంతంగా నడవడానికి కారణం పి.ఎస్.వారియర్ ముందు చూపు ఆయన వ్యవహార దక్షత. 

పి.యస్.వారియర్ ఆర్యవైద్యశాల ట్రస్ట్ ఏర్పాటు చేసారు. ఈ ట్రస్టులోని ఏడుగురు సభ్యలలో  ఐదుగురు వారి కుటుంబ సభ్యలు, ఇద్దరు హాస్పిటల్ లో పనిచేసే వైద్యులు ఉంటారు. కేరళలో కొన్ని కుటుంబాలలో మాతృస్వామ్య విధానం ఆచరిస్తూ ఉంటారు. అంటే వారసులు అన్నతమ్ముల పిల్లలు కాక మేనల్లుళ్ళు అవుతారు. వారియర్ కుటుంబం అదే విధానం అనుసరిస్తోంది. 

ఆర్యవైద్యశాల సంస్థకు మేనేజింగ్ ట్రస్టీ అవ్వాలంటే పి.యస్.వారియర్ మేనల్లుడు అవడమే కాక ఆయుర్వేద డాక్టర్ అయి ఉండాలి. ఫౌండర్ కుటుంబ సభ్యలకు కూడా ఆ సంస్థలో పనిచేస్తేనే జీతం. ఒక్క హాస్పిటలే కాక, మందులు తయారుచేసే కర్మాగారం, ఉచిత హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్, హెర్బల్ గార్డెన్స్ ఇవన్నీ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన ఆదాయంలో నలభై ఐదు శాతం ఛారిటబుల్ హాస్పిటల్ కు, నలభై ఐదు శాతం ఆయుర్వేద అభివృద్దికి, పది శాతం కాలేజ్ అభివృద్దికి వాడాలని పి.యస్.వారియర్ విల్లులో వ్రాసారు.
పి.ఎస్.వారియర్ కు ప్రతిరోజూ డైరీ వ్రాసే అలవాటు ఉంది. ఆయన డైరీ చదివితే ఆనాటి కాలమాన పరిస్థితులు కూడా తెలుస్తాయి. 1944 వ సంవత్సరం జనవరి 30వ తేదీ ఉదయాన తెరిచిన డైరీ, వ్రాయడానికి సిధ్ధం చేసుకున్న పెన్, వెలిగించిన దీపం అలానే ఉన్నాయి కానీ వైద్యరత్నం పి.యస్.వారియర్ మాత్రం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.