Showing posts with label పుస్తక పరిచయం. Show all posts
Showing posts with label పుస్తక పరిచయం. Show all posts

Tuesday, November 22, 2022

The Day I Stopped Drinking Milk


ఇవి కథలు కావు సుధామూర్తి గారు మనకు అందించిన మానవత్వపు పరిమళాలు. ఇందులో చాలా వరకు తనవి, తను కలిసిన వారివి అనుభవాలట.

తమకు ఎటువంటి సంబంధమూ లేని పిల్లలను తమ స్వంత పిల్లలతో పాటుగా పెంచడం, పేదవారి మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించడం, పరుల కోసం కూరగాయలను పండించడం, ఒక పేద వనిత తన స్వంత సంపాదనతో ఊరి కోసం చెరువు తవ్వించడం, ఇవన్నీ కూడా ప్రతిఫలాపేక్ష, చప్పట్ల మీద వ్యామోహమూ లేకుండా చేయడం. ఇలాంటివన్నీ మనకు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. 

‘Sticky Bottoms’, ‘Too many Questions’, ‘Foot in the Mouth’, ‘Lazy Potrado’ లాంటి కథలు చదివితే ఎలా ఉండకూడదో తెలుస్తుంది. 

‘Sraddha’ కథలో ఆచారాలు, సాంప్రదాయాలను గుడ్డిగా పాటించక తర్కంతో ఎలా అర్థం చేసుకోవాలో చెప్పిన ఉపకథ చాలా బావుంది.  

గుర్రాన్ని గాడిదనూ ఒకే గాటికి కట్టకుండా సందర్భాన్ని బట్టి పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో 'A Mother’s Love' కథలో చక్కగా వివరించారు. 

‘Do you Remember’ కథలో ట్యూరింగ్ అవార్డ్ గ్రహీత రాజ్ రెడ్డి గారు ఇలా అంటారు. “Whenever I get a prize, I always know that only some people will remember this and that too for only a short time. There is nothing great about it. My prize is that I enjoyed my work.”

“Those people might not have achieved anything in the eyes of the world. But they made you secure and confident. They made you feel like a rockstar. They gave you strength, courage and values. They are the true prizes in your life and you should always cherish them.” 

 సుధామూర్తి గారు చివరలో చెప్పిన వాక్యాలు నాకు చాలా నచ్చాయి. 

"I usually never know the real opinion of most people I converse with. The reason is that people whom I do not give money criticize me and people who hope to receive money from me say that I am great. So I have made many enemies and only a few friends. Now I understand why people at the top are always lonely”.

"Poverty does not mean just a lack of money but also a lack of confidence. Money can be earned in life but confidence is easy to lose and very hard to gain back."

ఆఖరలో తాను జీవితంలో నేర్చుకున్న పాఠాలను చెప్పి ఈ పుస్తకం ముగించారు. 

ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం అలవాటు లేని వారు కూడా సులభంగా చదువగలిగేలా కథలన్నీ తేలికైన భాషలో చక్కగా ఉన్నాయి.

Wednesday, March 4, 2015

పెళయ కావేరి కతలు

        ఆ పొద్దు నిదర లేసే యాళకి సందమామ పరంటికి వాలతా వుండాడు. పిలకాయలు, ఇంటాయినా గుర్రుపెడతా పొణుకోనుండారు. అట్టిట్ట తిరిగి యేదన్నా సదూదామని 'కినిగె' తట్టు యెతుకులాడితే 'ప్రళయ కావేరి కథలు' పొస్తకం ఔపడింది. ఇదేందో కవేరమ్మకు వొరదొచ్చిన కతలాగుండాదే అనుకుంటా పేజీలు దిప్పినాను. మద్దినేళదాకా వొకదానమ్మట వొకటి కతలు సదూతానే వుండిపోయినా. అయ్యేం కతలు... అదేం కతా... సల్ది పొద్దేళదాకా వాకిట్లో ముక్కర్ర గీలా, సుట్టింట్లో సట్టి పొయ్యి మిందకెక్కీలా.

      అసలీ కతలేందీ? ఎవురు రాసినారు? అనుకుంటా వుణ్ణ్యారా. 

"అమ్మంటే కన్నతల్లి మటుకే కాదురా. అమ్మంటే అమ్మ బాస కూడా. అమ్మంటే అమ్మనేల కూడా" అన్యాడంట ఓ తాత. ఆ మాటను గుండెల్లో యెట్టుకుని ఆయన మనవడు స. వెం. రమేశ్ పది కాలాల పాటు పెళయ కావేరి మన గాపకల్లో నిలిసిపోయేలా ఈ కతలు రాసినాడు. ఈయన్నీ రాగన్న పట్టెడ, జల్లల దొరువు, కాళాస్తిరి, గొల్లపాళెం, శిరసనంబేడ, ఓటుకుప్పం, నిమ్మాడి తిప్ప, నిడిగుర్తి, నలగామూల, ఓడ పాళెం ఇంకా శానా శానా వూర్లున్యాయి. ఆ వూర్లల్లోని కతలే. 

          ముంతమావిడాకుల యిస్తట్లో ఇంత  వణ్ణం బెట్టుకుని  బెండలం గెడ్డల పులుసు, వంకాయ బజ్జి యేసుకుని కడుపునిండా తిని ఈ వూర్లన్నీ ఓ సుట్టు సుట్టి వచ్చినా.  

     'ఉత్తర పొద్దు' కత చదవతా "ఈ పొద్దు యీడ్నేవుండి రేపు బయదేలిపోండి నయినా. ఉత్తర పొద్దు పెయానం మంచిది కాదు"  అన్నా యినకుండా ఆ ముకుపచ్చలారని పిలకాయలు పెయానం పెట్టుకుంటిరే...పళయ కవేరమ్మ సూరీడుతో కలసే మందల యెరగరే..నీళ్ళలో యెట్ట  యీదులాడతారా... యెట్ట 'జల్లల దొరువు' జేరతారా అని వొకటే యోచన జేస్తిని.

    "ఇంట్లో మొగోడు లేనపుడొచ్చి ఆడకూతుర్ని ఎత్తుకోని పోతావంట్రా ముండమోపి నాయాలా, అడిగే వోళ్ళు లేరనా నీ కంత పోత్రం? నీ యిష్టమొచ్చినట్లు చేస్తే చూస్తా వుండే దానికి మేము పరంటోళ్ళం కాదు, ఈ దామరాయ కాశెమ్మ గొంతులో వూపిరుండగా సీతమ్మ మింద చెయ్యెయ్యి, ఆనేక తెలస్తాది మందల" అని 'కాశెవ్వ బోగాతం' యింటా పకపకా నవ్వినా. యీ నవ్వులినబడితే సెకలు బడతన్నానని కాశెవ్వ నన్ను కూడా తాటి బరకతో వొక్క పెరుకు పీకుతాదేమో!

     నిండెన్నల రెయ్యిలో 'ఎచ్చలకారి సుబ్బతాత' చెప్పే కతలు ఇంటా బక్కోడితో బాటే నేనుగూడా మచ్చు కత్తి పొట్టుకొని గెనాల మింద నడిసినాను.

      అటిక మామిడాకులో పెసల పొప్పేసి యెణిపిన కూరతో అవ్వ ముద్దలు గలిపి పెడతావుంటే ఒకో ముద్దా నోటిలో యేసుకుంటా..."అయ్య మీరెవరయ్యా యింత ఆగడములా కోస్తిరీ, యెవరూ లేని వేళా మీరిపుడు యేకాంతములా కొస్తిరీ" అని అల్లెవ్వ ఊరిందేవి నిద్దర పాట యిణ్యాను.

     యెన్నిట గుడ్లాట ఆడతా బొయ్యి శంకరవ్వోళ్ళ సందులో వుండే "మామిడి చెట్టు కింద కొరివి దెయ్యం" జూసి బెదురు జెరం దెచ్చుకున్న బక్కోడికి, లోలాకులోడికి తిప్పతీగ కషాయం కాసిచ్చినాను.

     "ఆడపిలకాయలు కూడా మగరాయుళ్ళ మాదిర ఆడేదానికి  బయల్దేర్నారు" అని చెంగత్త మూత్తిప్పడం జూసి ఈ మాటగాని ఫెమినిస్టు లెవురన్నా ఇన్యారేమో! ఇపుడేం జగడమౌతదో అని జడుసుకున్నా. అంతట్లోకే "మేం మటుకు ఆడుకోబళ్యా" అని గుండు పద్న అనేసింది. "ఎందిమే ఆడేది, ఇట్నేనా? ఆడపిలకయులు ఆడుకోవాలంటే వామనగుంటలు, అచ్చంగాయలు, గెసికపుల్లలు, గుడుగుడు గొంజెం చికుచికు పుల్ల, బుజ్జిల కూడు, బుడిగీలాట ఇట్టాంటి ఆడుకోవాలగానీ మగపిలకాయిల యెనకాల బొయ్యి బావుల్లో దూకి ఈత కొట్టేదేంది ఆగిత్తం కాకపోతే "అనేసింది చెంగత్త.  దానికి అవ్వ "మేయ్ చెంగమ్మా, వోళ్ళని బోనీ. ఆడేవొయిసులో ఆడాల పాడే వొయిసులో  పాడాల"  అన్యాక చెంగత్త ఊరుకునింది.  
  
       ఆ గాణమ్మ అట్టొచ్చిందో లేదో 'కత్తిరి గాలి' ని గూడా లెక్కజేయకుండా వొంటి చేత్తో సమస్తం సక్కబెట్టేసింది. ఆ యక్కకు ఫేస్ బుక్ అకౌంటోటి సేసి పెడితే నేనిద్జేసినానని ఆ యక్క గోడ మింద బెట్టనూ మనం లైకులు గొట్టనూ.... గోడ కొనాకి ఆ ముచ్చటే నిండి పోయ్యేట్ది.

       ఓ నాడు "అల్లి సుదుగులకని పొయ్యి ఆవు దూడను దెచ్చినారు యాడదిది?" అనిందవ్వ. "యెనకటికి నీ బోటోడొకడు  యెండి బంగారు పోగొట్టుకొని పిడకల కూచి కోసరం యేడిసినాడంట" అని అవ్వని యెగతాళి బట్నాడు తాత." కర్రి వన్నె, మొహం మింద నామం తీసినట్టు తెల్లటి మచ్చ, నడీపన, సట్టుమిందా పుల్ల సారలు, పొందికయిన కొమ్ముల్తో" అందంగా వున్న 'కొత్త సావాసగోడ్ని' జూసి మురుసుకుంటిని.

     'నల్లబావ తెంపు' కతలో "పులింజేది మాది డా, ఇరకం మాది దా. పళవేర్కాడే మాది దా" అని నొచ్చుకుప్పం పట్టపోళ్ళు మాట్లాడతా అమ్మిడికి రాంగానే, నల్ల బావ "ఏందాన్నో, మాటలు బద్దరంగా రానీ. మేము దురాయి కట్టల్నా? మేమేమ్మన్నా పట్టపోల్లమా? ఎల దాటి చేపల యాత కోచ్చినామా? దేనికి కట్టాల దురాయి? అని అరవంగనే బిత్తరతో గుండె దడదడ లాడతా వసంతక్కతో పాటు చెల్లాతమ్మకి మొక్కినా.

      "ఎప్పుడొచ్చినావు పండో" అని పిట్టకి పల్లాయిలు పాడతా ఓటుకుప్పానికి పోయి వొంటి కంబం మిద్దికి బోయినా. జల్లల దొరువుకు 'పద్దినాల సుట్టం'గా వొచ్చి, కడుపులో పెట్టుకొని సాకిన ఆవ్వకు ఊపిరినే బొదులిచ్చిన మిద్దోడు కోసరం కంట తడిపెట్టినాను.

     'తెప్పతిరనాళ'లో మందు కాలేతపుడు ఆకాశ సువ్వలు జనం మిందకి వచ్చేతలికి తోపుడు మొదలవ్వంగనే  ఆ జనంలో లోలాకు  యేడకు బొయ్యినాడో యేందో ఇపిటికీ అయిపులేడు.

     రామనాటకం చూసేదానికి పొద్దు పరంటకీ వొంగి, తూరుపు తట్టు నీడలు లేసె యాళకి మొత్తం తొమ్మిది మంది బయిలుదేలినారు. "ఇంతింతాకు తగును బాలింతకు తగును, మందలో మేకకు తగును, సందులో ఆకుకు తగును, కలుగులో ఎంట్రకాయికి తగును. ఎలుగులో కాకక్రకాయికి తగును, కర్రిపిల్ల మూతి కళింగు మనును" అని అల్లెవ్వ కత అల్లంగనే "రయిక ముడి బీమారం అమ్మగారు, రాకుంటే పీకులాడు అత్తగారు" అంటూ చెంగత్త పైకత అల్లేసింది. ఈ కతలినే 'పుబ్బ చినుకులు' వాళ్లెంట బడినట్టుండాయి.

      పిలకాయిలు కూట్నీల్లూ, పెద్దోళ్ళు కల్లునీళ్ళతో దాహం అణుసు కుంటుండిన వయ్యాశి ఎండల కాలంలోవసంతక్క చేసిన పనికి కళ్ళు తడిశాయి. 


       "అబయా లేసి సూడరా ఎంత బావుండాయో " అన్న అక్క మాటతో అక్క సూపించిన తలికి సూసినాను. "ఆకాశానుండే సుక్కలన్నీ అడివిలోకి వోచ్చేసుండాయి. సుట్టూ వుండే చెట్ల ఆకాకూ మినమిన మెరిసి పోతుండాది. అడివిమ్మ వొళ్ళంతా తళుకులు అంటుకొని తళతళ వుండాయి. మింట యెగరతా కొమ్మకొమ్మకీ రెమ్మరమ్మకీ యాలాడతా, గుంపులు గుంపులుగా లెక్కలేనన్ని మిణకర బూసులు."  కొంచెపటికి  బావ ఈత కొట్టేది సాలిచ్చి "వసంతా చెవుల పిల్లులు యెట్ట బోయినాయి మే" అని అరస్తా అడిగినాడు. "ఎరగం, సందమామ ఇంట్లో మా సుట్టముండాడు, చూసేసోస్తాము అంటే కట్టు ముళ్ళు యిప్పినాము. అమాసకాలం గదా, సందమామని యెతకతా యెట్నో పోయినట్టు వుండాయి" అక్కతో పాటు ముసిముసిగా నవ్వేసినాను.

     ఓ నాడు "రాత్రి ఒక పోద్దుకాడ నెప్పులు మొదలయినాయి నా. కుమ్మరోళ్ళ యాగాతక్క కి  పురుడు పోసే దానికి పిలుసుకో నొచ్చినాము ఆయమ్మ యింతసేపూ పోరకాడింది. యిందాకనే బిడ్డ అడ్డం తిరిగింది నా వల్లగాదు పేటకు తోడ్కొని పొండి అనేసింది. బిన్నా బండి కట్టునా" అంటానే కళ్ళనీళ్ళు పెట్టుకుంది సుబ్బవ్వ"సినమ్మికి తోడుగా దాపటెద్దుని పంపించిందిరా మన పెళయకావేరమ్మ" తాత మాటతో గుండె బరువెక్కిపోయ్యింది. 

       "అత్త పిండిని వుంటచేసి, తట్టి నూన్లో యేసికాల్చి, యెత్తి నిప్పట్ల పీటమింద యేస్తా వుంటే, మామ నిప్పట్లలో నూని కారిపోయ్యేటట్టు వొత్తి ఇంకొక తట్టలో యేస్తా ఉండేది." ఆ నిప్పట్లను పరంటింట్లో పరిసిపెట్టిన యెండు కసువుమింద వరసగా పరిసినాను.

      అరుణ, కాళంగి, ప్రవాళం, సువర్ణముఖి... ఆ నలుగురు ఆడపొడుసులు వదినని చూసేదానికి ఉరుకులు పరుగులతో వచ్చినారు. కొత్త చేటలో పసుపు, కుంకం, గాజులూ, పూలూ, రైక గుడ్డలూ పెట్టుకొని పెళయకావేరమ్మ ఆడపొడుసులకు సాంగెం పెట్టిచ్చినాను. 
  
     "తాతా ఎన్నాళ్ళిట్ట చేతులు కాల్చుకుంటావు. కంటి సూపు గూడా సదరంగా లేదంటివి. నా మాటిని పేటకు పోదాం రా తాతా. ఎవురికీ లేని పాశం నీకు మటుకు దేనికి తాతా?" అని అడిగినాను. "ఇది అమ్మపాశం. నేను పుట్టిన మూడోనాడే మాయమ్మ జన్నెక్కి సచ్చి పోయిందంట అపిట్నించీ ఈ ప్రళయకావేరమ్మ వొళ్ళోనే నేను పెరిగింది. ఆట ఆడేది, పాట పాడేది, మడక కట్టేది, మాను కొట్టేది, సేద్దం చేసేది, మద్దిస్తం చూసేది అన్నీ ఈయమ్మ వొళ్ళోనే నేర్సుకునింది. అట్టాంటి మాయమ్మని నేనెట్ట మర్సిపోతాను చెప్పు" బొదులిచ్చినాడు తాత. 

 "అబయా, మీ తాత  యెట్ట బోయినాడు రా ?" అని నల్లబావ అనడిగే తలికి ఉలిక్కిపడి లేచినాను. "ఇల్లూ, వాకిలీ, కొట్టామూ, కసువామీ చూసి, బోడోడి  దిబ్బ,పీతిరి దొరువు, ఆరేటమ్మ కయ్యిలు, బాడవ చేను యెతికేటపితికి ఎలుగు పడింది. మీ తాత ప్రళయకావెట్లో పడుండాడు" అని గసబోసుకుంటా చెప్పిన కుమ్మరోళ్ళ రవణన్న మాటతో ఆత్రంగా పరిగెత్తినాను. తాత వోళ్ళమ్మ వొళ్ళో పొణుకోని వొళ్ళెరగని నిదర పోయేది చూసి కళ్ళొత్తుకుంటా యెనిక్కి దిరిగినాను.

    ఆ పంటరంగస్వామి రమేసన్నను సల్లంగా జూడాలి. ఆయన్న యిట్టాంటి కతలెన్నో మనకినిపియ్యాల.

         *           *          *            *      

       స. వెం. రమేశ్ గారు తమిళనాడులో తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివుద్ది కోసం నిరంతర కృషి చేస్తూ, తెలుగు భాషోద్యమ సమాఖ్య రాష్ట్రేతర ప్రాంతాల కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈయన తమిళనాడులో తెలుగు భాషా పరిశోధన బోధనా ప్రచారాల కోసం ప్రారంభమైన 'తెలుగు వాణి' ట్రస్టు సభ్యుడుగా, పూర్తి సమయ కార్యకర్తగా ఉన్నారు.



Saturday, May 11, 2013

వాహిని


మా ఊరి వాహిని పత్రిక 

         పిల్లలు, అన్ని విషయాల్లో పెద్దవాళ్ళను అనుకరిస్తూ ఉంటారు. మనం తెలుగు చదవడం నచ్చిన వాటిని పిల్లలకు చదివి వినిపించడంలో పిల్లలకు మన భాష మీద ఆసక్తి పెరుగుతుంది. ఎదురుగా పుస్తకం కనిపిస్తూ ఉన్నప్పుడు చదివే అలవాటులేని వారు కూడా తప్పకుండా పుస్తకం చదువుతారు. ఇలాంటి ఆలోచనలోంచి పుట్టిందే మా 'వాహిని.' 

        పత్రిక కోసం ఇంత అందమైన బొమ్మను వేసిచ్చిన పాణి గారికి, తమ రచనలను ఇచ్చిన రచయితలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ పత్రికను సమీకరించి అందంగా తీర్చిదిద్దిన సంపాదకులకు ప్రత్యేక ధన్యవాదాలు.


వాహిని పత్రికలను ఇక్కడ చదవొచ్చు.

Friday, October 5, 2012

తామెల్లరూ విచ్చేసి...

"శర్కరీ... ఓయ్ శర్కరీ ఎక్కడా?"
"ఇక్కడిక్కడ...ఏమిట౦త ఉత్సాహం?"
"ఉత్సాహమా...అంత కంటే పెద్ద పదం ఏదైనా.."
"ఆహా...ఏమిటో విశేషం?"
"విశేషమే మరి"
"చెప్పకూడదా?"
"చెప్పాలనేగా వచ్చాను."
"అయితే సరి...చెప్పు మరీ."
"అంత తొందరే.."
"ఉండదా?"
"ఉంటుందనుకో.."
"మాటలతోనే సరా?"
"కాదు"
"మరి?"
"పసందైన విందు!"
"ఓస్ అంతేనా?"
"అంతేనా!"
"కాక.."
"ఎక్కడని అడగవా?"
"ఎక్కడైతేనేం"
"అక్కడే వుంది విశేషం"
"అయితే చెప్పు"
"సైకత తీరాల వెంబడి శార్వరీ సమీపాన..."
"ఊ"
"చందన సమీరాలు వీస్తుండగా..."
"నీకేమమ్మా ఎక్కడికైనా వెళ్తావు..ఏమైనా చేస్తావు"
"ఉడుక్కోకే వెఱ్ఱిదానా"
"మరేం చెయ్యగలను?"
"అందుకేగా నీ కోసం..."
"ఏమిటీ....నా కోసమే?"
"ఊ...శత భక్ష్య పరమాన్నాలతో..."
"ఏమిటీ వందే...గొప్ప విశేషమే! ఇంతకూ అసలు విషయం చెప్పనేలేదు"
"నా నెచ్చెలివి....ఊహించలేవా?"
"అంత సూటిగా అడిగితే....ఓ...ఇది వందో టపా కదూ"
"సరిగ్గా చెప్పావ్. వంద పూర్తయిన సందర్భాన.... "
"మాకందరకూ విందన్నమాట"
"అతిధిలు కూడా వేంచేశారు, మరి వడ్డన మొదలు పెట్టనా?"
"తప్పకుండా...."
"ఇవన్నీ నన్ను ఆకట్టుకున్నవి...మది దోచినవీను."
"మృష్టాన్నభోజనమన్నమాట..."
"అన్నమాటే౦! ఉన్నమాటే."

తామెల్లరూ శర్కరి సహపంక్తిని ఈ బ్లాగింట విందారగించి చందన తాంబూలాలు స్వీకరించ వలసినదిగా ప్రార్ధన.


Sunday, February 12, 2012

మీ ప్రేమ పరిభాష ఏమిటి?

       “ఏమిటీ...ప్రేమకు భాషా?” సందేహంగా ఉంది కదూ! ఉంటుందనే చెప్తున్నారు డా. గేరి చాప్మన్. ఈ ప్రేమ భాష గురించి వారు వ్రాసిన పుస్తకం “ఫైవ్ లవ్ లా౦గ్వేజస్". ప్రశంస, కబుర్లు, పనిలో పాలుపంచుకోవడం, బహుమతులు, స్పర్శ ఇలా ఐదు భాషల ద్వారా ప్రేమను వ్యక్తం చెయ్యొచ్చ౦టున్నారు ఆ రచయిత.

         ఓ ఇల్లాలు కోపంగా ఉన్నారు. “పాపం ఇంట్లో పని ఎక్కువై౦దేమో! సహాయం చేద్దామని” ఆ ఇంటాయన తనవంతుగా కూరలు తరిగేస్తున్నారు,
అన్నం వార్చేస్తున్నారు. ఇంటా బయటా తనే అయి పనులన్నీ చక్కబెట్టేస్తున్నారు. మార్పేమీ లేకపోగా చిర్రుబుర్రులు మరింత ఎక్కువయ్యాయి. సరదాగా సినిమాకి వెళదామన్నారు. కాంతామణికి చిరాకు తగ్గనే లేదు. “నేనింత సహాయం చేస్తున్నా పట్టించుకోవడంలేదని’ ఆ కాంతునకు కూడా కోపం వచ్చేసింది. తరచి చూడగా తెలిసి౦దేమిటంటే ఆ ఇంతికి తన పెనిమిటి సమక్షమే స్వర్గమట. సినిమాలు, టివీల అంతరాయం లేకుండా రోజూ కాసింత సేపు చక్కగా కబుర్లు చెప్పుకుంటే చాలట. ఇక అప్పట్నుంచీ ఆ ఆర్యుడు రోజులో కొంత సమయం తన అర్ధాంగి కోసమే కేటాయించారు. ఆ ఆలుమగల జీవితం న౦దనవనం.


The 5 Love Languages: The Secret to Love That Lasts [Book]ఓ శ్రీమతి పరాకుగా ఉంటున్నారు, తెగ చిరాకు పడిపోతున్నారు. వంటి౦ట్లో గిన్నెలన్నీ కొత్త శబ్దాలు చేస్తున్నాయ్. శ్రీవారు బాగా అలోచించి ఉప్పాడ చీర పట్టుకొచ్చారు, సినిమాకి షికారుకి తీసుకెళ్ళారు. వంటిట్లో గిన్నెలతో పాటు పెరట్లో వస్తువులూ చప్పుడు చేయడం మొదలుపెట్టాయి. రోజులు గడిచేకొద్దీ అమ్మగారి విసుర్లు అయ్యగారి కసుర్లు ఎక్కువవుతున్నాయి. చల్లని సంసారంలో మంటలు రేగాయి. ‘ఎలా ఆర్పాలా’ అని అరా తీస్తే తెలిసి౦దేమంటే, ఆ శ్రీమతి తన బాధ వెళ్ళబోసుకునే సమయాన సదరు శ్రీవారు సలహాలు గట్రాలు ఇవ్వక “అవునా”, “అయ్యో”, “నిజమే సుమా”లతో సరిపెట్టేస్తే చాలునట పట్టుచీరలూ, వెండిమెట్టెలు లాంటి బహుమతులేమీ అఖ్ఖరలేదట. కథ సుఖాంతం.

        పై ఇద్దరి కథలూ విన్న ఓ పతిదేముడు తన సతీమణి కోపంగా, చిరాకుగా ఉన్న సమయంలో స్నేహితుల సలహాలు పాటించారు. ఏమైందటారా? హ హ..పనిచేయలేదు. ఆ మగనికి ఏం చెయ్యాలో తోచలేదు. తల పట్టుక్కూర్చున్నారు, 'కారణమేమయివుంటుందా?' అని ఆలోచనలతో సతమమైపోయారు. ఎన్నో అష్టకష్టాలకోర్చి తెలుసుకున్నదేమంటే, సదరు సతీమణికి బహుమతులంటే అంటే ఇష్టమట. అది తెలిసిన పతిదేముడు సతీమణి కోసం అప్పుడప్పుడు ఓ మిఠాయి పొట్లం, ఓ మూర పువ్వులు, ఓ పుస్తకం... తీసుకురావడం మొదలు పెట్టాడు. ఇక తరువాతేముందీ వారి జీవింతం ముళ్ళదారి వదిలి పువ్వులనావలో సాగింది.

         ఓ తండ్రి ఇంటికి రావడమే టివి చూస్తున్నాడని కొడుకు మీద ఎగిరిపడ్డాడు. “ఇప్పటివరకూ చదువుకున్నాడు ఇప్పుడే చూస్తున్నాడని” శ్రీమతి చెప్పబోయినా చాల్లే “నీ వల్లే చేడిపోతున్నాడని” శ్రీమతినీ విసుక్కున్నాడు. మొహం ముడుచుకుని పిల్లాడు గదిలోకి, శ్రీమతి పెరట్లోకి వెళ్లారు. ఈ మధ్య ప్రతి రోజూ జరిగే ఇలాంటి విసుర్లకు అర్ధం తెలియక ఆ శ్రీమతి తల్లడిల్లిపోతూంది. ఆ శ్రీవారికి కావలసిందేమిటి? ఎందుకలా కోపంగా ఉంటున్నారు?
         
         ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఓ సంవత్సరం తిరిగేసరికి “అసలు నీలాంటి వాణ్ని చేసుకున్నాను నాకు బుద్దిలేద”ని ఆవిడంటే, “ఆ లేదన్న విషయం ఇప్పటి వరకూ దాస్తావా” అని అతను. ‘ఛీ’ అంటే ‘ఛీఛీ’ అని ‘ఛా’ అంటే ‘ఛాఛా’ అని అనుకున్నారు. వారిద్దరిమధ్య తేడా ఎక్కడొచ్చింది?

        ఈ ప్రేమ భాష భార్యాభర్తలకో, ప్రేమికులకో పరిమితం కాదండోయ్! పిల్లలకు తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది. పిల్లలు మన మాట వినట్లేదని బాధపడిపోతూ ఉంటాం. అసలు మనం వాళ్ళ భాషలో చెప్తున్నామా? వాళ్లకు కావలసిన ఆసరా మనమిస్తున్నామా?

       ఒకరికి ఒక భాషే ఉంటుందా, ఉంటే తరచు అది మారుతుందా? భార్యా భర్తలిద్దరిదీ ఒకటే భాష అయితే సమస్య ఉండే అవకాశం ఉందా? ఉంటే ఎలా పరిష్కరించుకోవాలి? మన ప్రేమభాష తెలుసుకోవడం ఎలా? ఇలా అనేక విషయాల మీద ఈ పుస్తకంలో చక్కని విశ్లేషణ ఉంది. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం “ఫైవ్ లవ్ లాంగ్వేజస్”.




Friday, January 27, 2012

కథాజగత్ - ధనలక్ష్మి

కథాజగత్ కథా విశ్లేషణకు నేనెంచుకున్నకథ 'శ్రీరమణ' గారు రచించిన 'ధనలక్ష్మి'.

      ఆత్మవిశ్వాసం, పట్టుదల, లోక్యం ముడిసరుకులుగా రూపొందిన కథ 'ధనలక్ష్మి'. 'శ్రీరమణ' గారు ఈ కథని నడిపించిన తీరు అనితరసాధ్యం. మొదటి వాక్యం నుండి చివరి అక్షరం వరకూ ఆపకుండా చదివించి "ఔరా!" అనిపించుకు౦టు౦దీ కథ. 

        ఈ కథలో ముఖ్య పాత్ర 'ధనలక్ష్మి', పరిస్థితుల కారణంగా ఆస్థి మొత్తం పోయినా, తరగని ఆత్మవిశ్వాతంతో జీవనం సాగించి, పూర్వ వైభవం సంపాదించుకోవడమే కాక జీవితాన్ని నందనవనం చేసుకున్న స్త్రీ . రచయిత 'ధనలక్ష్మి' ద్వారా చెప్పించిన వ్యాపారసూత్రాలుహారంలో పొదిగిన వజ్రల్లా అందంగా అమిరాయి. 

      ధనలక్ష్మి, సీతారామాంజనేయులు వారు కలసి జీవితం మొదలు పెట్టేనాటికి ఉన్న ఆస్థి పోయి దిక్కుతోచని స్థితిలో ఉంటారు. రామాంజనేలు ఏదో ఒక చిన్న పనిచేసి జీవితం సాగిద్దాం అనుకుంటాడు. ధనలక్ష్మి అ౦దుకు ఒప్పుకోక వ్యాపారం చేసే ఆలోచన చేస్తుంది. అందుకు సమర్ధులైన వారి సహాయం తీసికుంటారు. ఈ కథలో రచయితే ఆ పాత్ర పోషిస్తారు, వారి ద్వారానే మనకు కథ చెప్పడం జరిగింది. 

      ధనలక్ష్మి రామాంజనేయులు పిండి మరతో వ్యాపారం మొదలు పెడతారు. పిండిమర నడపడం, దాని రిపేర్లు నేర్చుకోవడం ద్వారా మనకు ధనలక్ష్మి తెలివి తేటలు, దాని ద్వారా దొరికిన పిండిని సున్నుపిండిగా మార్చి అమ్మడం, చిల్లర అమ్మడం లాంటి వాటిల్లో ధనలక్ష్మి వ్యాపారదక్షత తెలుస్తుంది. మెల్లగా అప్పులు తీర్చి, అవసరమైన వాటిని జత చేసుకుంటూ చిన్న దుకాణం ఏర్పరచుకునే స్థాయికి ఎదుగుతారు. ఆ సందర్భంగా ధనలక్ష్మి చిన్న వ్యాపారాలు నిలదొక్కుకోవాలంటే ఏం చెయ్యాలో చెప్పిన విషయాలు చదివి తీరవలసినవి. యాత్రాబస్సులు ఏర్పాటు చేసి ఊరి ప్రజల మెప్పు పొందడమే కాకుండా, యాత్రల కవసరమైన వస్తుసామాగ్రిని తమ దుకాణం నుండే బస్సులో వేయించి,  వెళ్ళిన ప్రదేశాల్లో చౌకగా దొరికే వస్తువులను తమ ఊరికి తెచ్చి అమ్మి లాభాలు కూడా పొందుతారు. 

       శకుంతల మాటల్లోని వ్యంగం లోకరీతికి అద్దం పడుతుంది. ఎరువుల వేగన్ దాచి పెట్టడంలోనూ, సదరు వ్యక్తికి సొమ్మందించే విషయంగా ధనమ్మ వ్యవహరించిన విధానం ధనమ్మ యుక్తికి నిదర్శనాలు. అలాగే పనికిరాదనుకున్న స్థలాన్ని తీసుకుని తమకనుగుణంగా మార్చుకోవడంలో కూడా. ఈ విషయం దగ్గర తన భర్త అహాన్ని తృప్తి పరచి సంసారం నిలబెట్టుకోవడంలో మనకు పట్టూవిడుపూ తెలుసున్న ధనలక్ష్మి కనిపిస్తుంది. చివరగా తన కొడుకు విషయంలో తీసుకున్న నిర్ణయం, తదనుగుణంగా వ్యవహారం నడిపి తనకు కావలసిన విధంగా జరిపించుకోవడంలో ధనమ్మ లౌక్యం అమోఘం. సైన్సు మాష్టారుకు ఉద్యోగం రూపేణా ధన సహాయం చేయడం, తమకు వ్యాపారంలో సహాయం చేస్తున్నవారికి ఉచిత యాత్రాసౌకర్యాలు కల్పించడం ఆ దంపతుల పరోపకారానికి నిదర్శన౦.  
  
    చిన్న చిన్న విషయాలక్కూడా  బెంబేలుపడే మనస్తత్వానికి విరుద్దంగా రచయిత ధనలక్ష్మి పాత్రను మలచి, తద్వారా సంకల్పం, ఓపిక, పట్టుదల, తెలివి తేటలు, వ్యవహార దక్షతలన్ని౦టినీ మనకు చూపిస్తారు. ఈ కథలోసంభాషణల తీరూ, కథ చెప్పే విధానం ప్రతిభావంతమైన రచయత శైలిని సుస్పష్టం చేశాయి. ఈ కథ ఆశావాదానికి మారుపేరని కూడా చెప్పొచ్చేమో. ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సినదీ కథ.

తూరుపు ముక్క కథాజగత్ లో ప్రచురితమైన 'ధనలక్ష్మి' కథను మీరు ఇక్కడ చదవొచ్చు

Thursday, January 26, 2012

కథాజగత్ -- వాన ప్రస్థం

కథ: వాన ప్రస్థం   రచించిన వారు: సాయి బ్రహ్మానందం గొర్తి

     ఆలోచనా ధోరణిలోని వ్యత్యాసం గురించీ, ఆదర్శవంతమైన జీవన విధాన౦ గురించీ చెప్పే ఈ కథచక్కని కథనంతో ఆద్యంత౦ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ కథలో అనురాగంఆత్మీయత మనకు అడుగడుగునా కనిపిస్తాయి. కథకు తగిన శీర్షిక 'వాన ప్రస్థం'.

    స్వదేశం వెళ్ళిన రాంబాబు, పొలం అమ్మే నిమిత్తం తమ ఊరికి వెళుతూ తన స్నేహితుని తల్లిదండ్రులైన మూర్తి, వర్ధనమ్మగార్లను కలుస్తాడు. ఆ దంపతులు వారి అభిమానంతో అతన్ని ఓ రోజు అక్కడే ఉండేలా ఒప్పిస్తారు. ఆ వయసులో వారి వ్యాపకాలు, తద్వారా చేసే సమాజ సేవ చూసి ముచ్చట పడతాడు రాంబాబు. సుఖమయ జీవనం కోసం ఆహారం విషయంలోనూ వారు తీసుకు౦టున్న శ్రద్ధ, వ్యాయామం, వారు ఆచరించే జీవన విధానం చూసి "నిజం చెప్పద్దూ - మీరిద్దరూ డెబ్బై దాటిన వాళ్ళల్లా కనిపించరు. ఏదో నిన్ననే అరవయ్యో పడిలో వచ్చిన వాళ్ళల్లా ఉన్నారు."  అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. 

     ఆ సమయంలోనే రాంబాబు, తన అక్క అనారోగ్యం విషయంగా, ఆవిడకు శారీరక రుగ్మత కంటే, మానసిక రుగ్మతే ఎక్కువగా ఉన్నట్లు చెప్తాడు. వారి సంభాషణల్లో ఆ దంపతుల మధ్య అవగాహన, కలసి పనిచేసుకోవడంలోని ఆనందం గురించి తెలుసుకుంటాడు. రాంబాబు అక్క, తన పిల్లల గురించి ఆలోచించే విధానంలోనూ, ఆ దంపతులు తమ పిల్లల గురించి ఆలోచించే విధానంలోనూ ఉన్న తేడాలను రచయిత స్పష్టంగా వ్యక్తీకరించారు.

     రచయిత, మూర్తి గారి ద్వారా చెప్పించిన ఈ మాటలు, ఈ కథకు ప్రాణమని చెప్పొచ్చు. 

'ఎక్స్పెక్టేషన్' అనేది అది కేన్సర్ లాంటిది. నిన్నూ నీ చుట్టూ ఉన్న వాళ్ళనీ కనిపించకుండా దహించేస్తుంది..."  అని చేప్తూ తమ ఆరోగ్య రహస్యం కూడా చెప్తారు. "మేం సంతోషంగా ఉంటాం. ఒకర్నొకరు తిట్టుకోం. తప్పులెన్నం. వీలయినంతా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అలాగే మా పిల్లల్నుండి మేం ఏమీ ఆశించం. ఇదే మా ఆనందానికి కారణం. మేం ఎవరినుండీ ఏదీ ఎక్స్పెక్ట్ చేయం." 


     కథ ముగింపులో రాంబాబు తన అక్క గురించి అనుకున్న మాట ఈ కథకు పరిపూర్ణతనిచ్చింది. ఈ కథలో మంచి సందేశం ఉంది. చిరకాలం గుర్తుండి పోయే కథ 'వాన ప్రస్థం'. 

తూరుపు ముక్క- కథా జగత్ లో ప్రచురితమైన 'వాన ప్రస్థం' కథను మీరు ఇక్కడ చదవొచ్చు.