Thursday, March 26, 2020

కరోనా సమయంలో అమెరికా ప్రయాణం - 1

ఏ దేశమైన చూడాలి, అక్కడి జీవనసరళి తెలుసుకోవాలంటే కనీసం ఓ రెండు నెలలైనా ఆ దేశంలో ఉండాలని నా అభిప్రాయం. ఆ కోరిక నాకు ఇండియాలో తీరింది. అదేమిటి నువ్వు ఇండియన్ వేగా వేరుగా దేశం చూడడమేమిటి అనుకోకండి. నేను ఇండియన్ ని అయినా అమెరికాకు వచ్చి దాదాపుగా పాతికేళ్ళు అవుతోంది. ప్రతి రెండేళ్ళకూ, లేదా ఇంకా తక్కువ వ్యవధిలోనో ఇండియా వెళ్తూ ఉన్నా నేను అక్కడ అతిథినే. చుట్టాలనూ, స్నేహితులనూ కలవడం అన్నీ అమర్చిపెడుతుంటే ఖుషీగా తిరుగుతూ అలా వెళ్ళి షాపింగ్ చేసుకుని రావడం ఇలా అన్నమాట. అది ఇండియాలో ఉండడం ఎలా అవుతుంది?

ఈసారి ఆ కోరిక తీర్చుకోవడానికీ, మెడిసిన్ పూర్తి చేయబోతున్న మా అమ్మాయి దగ్గర ఉండడానికి రెండువేల పంతొమ్మిది అక్టోబర్లో ఇండియా వెళ్ళాను. ఆరునెలలు అక్కడే ఉండి ఏప్రిల్ పదహారున తిరిగి అమెరికా వచ్చేట్లుగా అనుకున్నాము. నెల్లూరులో ఇల్లు  అద్దెకు తీసుకుని పాలు, నీళ్ళు, పేపర్ అన్నీ సమకూర్చుకుని, అక్కడి వాతావరణానికి, జీవనానికి అలవాటు పడుతూ, ఆస్వాదిస్తూ వున్నాను. ఫిబ్రవరి చివరి వరకూ అలాగే గడిచింది.  

అప్పటికే కరోనా గురించి అక్కడెక్కడో చైనాలో అలా ఉందీ, ఇటలీలో ఇలా ఉందీ అని వార్తలు వినపడుతున్నాయి. హఠాత్తుగా ఒకరోజు హైదరాబాద్ లో కరోనా అని పేపర్లో చదివి "మన దేశానికి  కూడా వచ్చిందీ ఇది" అనుకున్నాను. ఆ వైరస్ సోకినతని కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చిందనీ, వాళ్ళందరినీ క్వారంటైన్ లో ఉంచారనీ తెలిశాక కొద్దిగా కంగారు మొదలైంది. 

టికెట్ ప్రీ పోన్ చేసికుని మార్చ్ నెలాఖరకే అమెరికాకు వచ్చేస్తే మంచిదేమో అన్నాను శ్రీవారితో. దానికి మా అమ్మాయి ప్రమాదమేమీ లేదంటూ ఆ వైరస్ గురించి వివరించింది. చైనాలో  మొదలైనప్పుడు అప్పటికి ఆ వైరస్ గురించి తెలియక అది  ఎక్కువగా వ్యాపించిందనీ, అందువలన వైరస్ లోడ్ ఎక్కువై ప్రాణాంతకంగా పరిణమించిందనీ చెప్పింది. మరే ఇతర దేశాలలో అంత ప్రమాదమేమి లేదని, పైగా అది మామూలు ఫ్లూ లాంటిదే ఆరోగ్యవంతులకు ప్రాణభయమేమి లేదని చెప్పింది. వైరస్ లోడ్ అంటే ఏమిటని అడిగాను. "వైరస్ లోడ్ అంటే మన అపార్ట్ మెంటే తీసుకో దాదాపుగా వందమంది ఉన్న ఈ అపార్ట్మెంట్ లో నలుగురికి వస్తే పెద్ద ప్రమాదం ఏమీ లేదు, అదే ఎనభై మందికి వచ్చిందనుకో వైరస్ అన్నిచోట్లా వ్యాపించి అది శరీరంలోకి ఎక్కువ కణాలుగా ప్రవేశిస్తుంది. దాంతో వ్యాధి నిరోధక శక్తి సరిపోక అనారోగ్యం ఎక్కువవుతుంది. అప్పుడు వయసు, ఆరోగ్యస్థితితో సంబంధం లేకుండా ప్రాణహాని ఉంటుంది. దానికి పరిష్కారం జాగ్రత్తలు పాటించడమే. ప్రతి గంటకూ, బయటకు వెళ్ళివచ్చిన ప్రతిసారీ ఇరవై సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలి" అని వివరించింది. 

మా సంభాషణ జరిగిన వారానికి అంటే మార్చ్ పదకొండున ఆంధ్రప్రదేశ్ లో మొదటి కరోనా కేస్ రిజిస్టర్ అయింది, అదీ నెల్లూరులోనే. ఆ వ్యక్తి ఇటలీ నుండి వచ్చి ఓ వారం చిన్న బజారులోనే ఉన్నాడని  తెలిశాక మొదలైంది అసలు కంగారు. నాకే కాదు నెల్లూరు వాసులందరికీనూ. ఎందుకంటే చిన్న బజార్ నెల్లూరులోని ప్రధాన వ్యాపార కేంద్రం. అక్కడ చిన్న, పెద్ద దుకాణాలు, ఇళ్ళు అన్నీ కిక్కిరిసి ఉంటాయి. అయితే అతని కుటుంబసభ్యులు ఎవరికీ ఈ వైరస్ వ్యాపించలేదనే సరికి కొద్దిగా కంగారూ తగ్గింది. 

అప్పటికే అమెరికాలో స్కూళ్ళు, యూనివర్సిటీలకు ఏప్రిల్ లో ఇవ్వవలసిన  స్ప్రింగ్ బ్రేక్ ముందుగా ఇచ్చేశారు. మేము నడుపుతున్న పాఠశాలకు కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసికుని తరగతులను రద్దు చేసి తల్లిదండ్రులే పిల్లలకు పాఠాలు చెప్పేట్లుగానూ, ఈ ఏడాది వార్షికోత్సవం రద్దు చేసేట్లుగానూ నిర్ణయం తీసుకున్నాం. మరో వారం గడిచాక అమెరికన్ గవర్నమెంట్, విద్యార్ధులు ఎవరూ స్కూళ్ళ కు, యూనివర్సిటీలకూ రానక్కర్లేదనీ ఆన్ లైన్ పాఠాలు మొదలు పెట్టే ఏర్పాట్లు చేస్తున్నామనీ చెప్పారు. యూనివర్సిటీ నుండి స్ప్రింగ్ బ్రేక్ కి ఇంటికి వచ్చిన బుజ్జి పండు మరి తిరిగి వెళ్ళలేదు.  

మార్చ్ రెండవ వారానికి వచ్చేసరికి నెల్లూరులో మరో కేసు రిజిస్టర్ అయింది. ఈసారి కూడా ఇటలీ నుండి వచ్చిన వారికే వచ్చింది.  ఇండియా నుండి ఇటలీ వెళ్ళిన విద్యార్థులు అందరూ తిరిగి ఇండియా వచ్చేస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రజలకు ఈ వైరస్ పట్ల స్పృహ కలిగించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఫోన్ లో ఖళ్ ఖళ్ మని దగ్గు, ఆ తరువాత ఓ అరనిముషం పాటు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తున్నారు. టీవీలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. 

ప్రజలకు దీని సీరియస్ నెస్ బాగానే అర్ధం అయింది. రోడ్డు మీద వెళ్ళేవారు, కూరలమ్మే వాళ్ళూ, ఆటో వాళ్ళూ మాస్కులు వేసికుని జాగ్రత్తలు చక్కగా పాటిస్తున్నారు. ఇండియాలో అందరికీ  గొప్ప అవేర్ నెస్ వచ్చింది. ఇతర దేశాల నుండి వచ్చిన వారు తుమ్మినా దగ్గినా వెంటనే మెడికల్ ఆఫీసర్లకూ, హాస్పిటల్ కూ ఫోన్స్ చెయ్యడం మొదలుపెట్టారు. ఓ నాలుగు వారాలలో పరిస్థితి అదుపులోకి వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉన్నాం, పైగా ప్రాణ భయం ఏమీ లేదన్న ధీమా ఉండేది. అప్పటికి బయట దేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే ఈ వైరస్ సోకింది. భారత దేశంలో పెద్దగా ఈ వ్యాధి వ్యాపించలేదు. బహుశ అక్కడి వేడి వాతావరణం కారణం కావచ్చు. లేదా ప్రజల ఇమ్యూనిటీ కావచ్చు. ఒకవేళ ఎక్కువమంది పేషంట్స్ వచ్చినా వైద్య సదుపాయం అందించడానికి వీలుగా గవర్నెమెంట్ మరియు ప్రయివేట్ హాస్పిటల్స్ అదనపు వార్డులు ఏర్పాట్లు చేస్తున్నాయని కూడా తెలిసింది. 

మార్చ్ పదిహేడువ తేదీ నుండి షిర్డీలోనూ, ఇరవైయ్యొవ తేదీ నుండి తిరుపతిలోనూ దర్శనాలు ఆపేశారు. మార్చ్ ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు ఇండియా నుండి ఇతరదేశాలకు విమానప్రయాణాల రాకపోకలు రద్దు అనే వార్త భారతదేశం ప్రకటించింది. ఆ వార్తలు విన్నాక  నాకు మళ్ళీ కలవరం మొదలయ్యింది. ఒకవేళ ఏప్రిల్ వరకూ పరిస్థితి ఇలాగే ఉంటే ఎలాగా అని. అప్పటికే అమెరికాలో కూడా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. అక్కడ పండు, వాళ్ళ నాన్న ఇద్దరే ఉన్నారు. మామూలుగా అయితే ఫ్రెండ్స్ రావడం, పోవడం ఏమి అవసరమైనా మన వాళ్ళు ఉన్నారనే ధైర్యం ఉండేది. రాకపోకలు నిలిచిపోవడంతో వాళ్ళ గురించి నాకు కంగారుగా ఉండేది. 

అప్పుడు మా అమ్మాయి, "అమ్మా, నాన్న గురించి నువ్వు టెన్షన్ పడుతూ ఇక్కడ ఉండడం కంటే నువ్వెళ్ళు నేను తరువాత వస్తాను" అన్నది. దానికి వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. నువ్వొక్క దానివే ఎలా ఉంటావు? ఇప్పటికిప్పుడు బయలుదేరవలసిన అవసరం లేదు నేనూ పండూ జాగ్రత్తగానే ఉన్నాం. ఒకటి రెండు వారాలు ఇలాగే ఉంటుంది తరువాత అంతా సర్దుకుంటుంది. ఏప్రిల్ పదహారు నాటికి అంతా మామూలయిపోతుంది. మీ ప్రయాణానికేమీ  ఇబ్బంది ఉండదు, అప్పుడు ఇద్దరూ కలిసే రండి అన్నారు. ఈ చర్చలన్నీ మార్చ్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో జరిగాయి.  

అదే రోజు రాత్రి రెండు గంటలకు శ్రీవారి నుండి ఫోన్, ఒక లింక్ పంపించాను చదువు అంటూ. లింక్  ఓపెన్ చేస్తే, అమెరికా ట్రావల్ 4 అడ్వైజరీ అంటూ ఓ వార్త  కనిపించింది. దాని సారాంశం ఏమిటంటే అమెరికా పౌరులు ఏ దేశాలలో ఉన్నా తిరిగి అమెరికా రావలసిందనిన్నూ రాని పక్షంలో ఆయా దేశాలల్లో అనిర్నీత కాలం ఉండేట్లుగా తగిన ఏర్పాట్లు చేసుకోవలసింది అనిన్నూ. ఆ వార్త పూర్తిగా చదివే లోపలే "టికెట్ దొరికింది రేపు రాత్రికే మీ ప్రయాణం, ఐటనరీ ఇప్పుడే మెయిల్ పంపించాను" అన్నారు. మరీ మనం ఓవర్ రియాక్ట్ అవుతున్నామేమో అన్నాను. "లేదు, ఇప్పటికే అన్ని ఎయిర్ లైన్స్ కాన్సిల్ అయ్యాయి. మన అదృష్టం కొద్దీ ఎమిరేట్స్ ఒక్కటే ఉంది. ట్రావెల్ ఫోర్ అడ్వైజ్ ఇచ్చారంటే అమెరికా కూడా త్వరలో లాక్ డౌన్ ప్రకటిస్తుంది. అప్పుడిక అమెరికా నుండి ఇతర దేశాలకు  రాకపోకలు నిలిచిపోవచ్చు. ఏప్రిల్ కి కూడా ఈ పరిస్థితిలో మార్పు లేకపోవచ్చు. నీవు ఊహించినదే నిజమయ్యేలా ఉంది" అన్నారు. 

శుక్రవారం వేకువ ఝామున టికెట్ బుక్ చేశారు, ఫ్లయిట్ శనివారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిముషాలకు. అంటే మాకు మానసికంగా సంసిద్దమవడానికి, కావలసిన వస్తువులు సర్దుకోవడానికి కేవలం ఒకటిన్నర రోజు మాత్రమే వ్యవధి ఉంది. పాపకు హౌసీ పూర్తవడానికి ఇంకా వారం ఉంది. పైగా డిసెంబర్ లో తనకు డెంగ్యూ రావడంతో మరో వారం ఎక్స్టెన్షన్ ఉంది. ఇంకా అత్యవరసరమైన ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ అవి ఎప్పుడు పెడతారో తెలియదు. కానీ ఇప్పుడు కనుక ఇండియాలోనే ఉండిపోతే మళ్ళీ ఆమెరికాకు ఎప్పటికి వెళ్ళగలమో తెలియని పరిస్థితి. టైలర్ల దగ్గర, లాండ్రీలో బట్టలు ఉన్నాయి. పాల వాళ్ళకు, పని మనిషికి, పేపర్ అతనికీ చెప్పాలి. ఇంటి ఓనర్, మ్యూజిక్ టీచర్, యోగా టీచర్లకు ఈ విషయం చెప్పి వీడ్కోలు తీసుకోవాలి.  తెల్లవారేదాకా నిద్రలేకుండా ఇలా రకరకాల ఆలోచనలు.

మిగిలిన వివరాలు ఇక్కడ ...


No comments:

Leave your Comment

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.