Saturday, January 21, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 5

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 4 వ భాగం 

పి.యస్.వారియర్ వ్రాసిన విల్లు ప్రకారం ఆయన మేనల్లుడు పి.ఎమ్.వారియర్ మానేజింగ్ ట్రస్టీ అయ్యారు. మందులు తాయారీలో విద్యుత్ తో పనిచేసే యంత్రాలను ఉపయోగించడం ఈయన ఆధ్వర్యంలోనే మొదలైంది. ఆర్యవైద్యశాల అభివృద్దికి ఎన్నో ప్రణాళికలు రూపొందించారు కానీ బాధ్యత తీసుకున్న పది సంవత్సరాలలోపే విమాన ప్రమాదం వలన అకాలమరణం పాలయ్యారు. 

ఆ తరువాత చీఫ్ ఫిజీషియన్ గా పనిచేస్తున్న పి.ఎమ్. వారియర్ చిన్న తమ్ముడు పొన్నియంబల్లి కృష్ణన్కుట్టి వారియర్ మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యత తీసుకున్నారు. 
ప్రతి రోజూ ఉదయం కైలాస మందిరంలో ఉన్న విశ్వంభర స్వామిని దర్శించుకోవడం, పి.యస్.వారియర్ సమాధి దగ్గర దీపం వెలిగించడం, అష్టాంగ హృదయం చదవడం, ఆ తరువాత హాస్పిటల్ లో వైద్యం కోసం వచ్చిన వారిని చూడడం ఇది ఆయన దినచర్య. ఆ హాస్పిటల్ ను, ఛారిటబుల్ హాస్పిటల్ ను చూసుకుంటూ, కావలసిన మందులేవో తయారు చేసుకుంటూ ఉంటే కొట్టకల్ పేరు మరెక్కడా వినిపించేది కాదేమో! 
పి.కె.వారియర్ హస్తవాసి మంచిదనే పేరు రావడంతో వైద్యం కోసం ఎక్కడెక్కడి నుండో ప్రజలు రావడం మొదలు పెట్టారు. అప్పటి రాష్ట్రపతి వి. వి. గిరి కొట్టకల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు.  

వైద్యం అన్ని ప్రాంతాల వారికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో డిల్లీ, మరియు కొచ్చిలో ఆయుర్వేద హాస్పిటల్స్ మరియు రీసెర్చ్ సెంటర్స్, ఇరవై ఆరు ప్రాంతాలలో క్లినిక్ లు ఏర్పాటు చేసారు. హాస్పిటల్ లో పెరిగిన రోగులకు సరిపడా ఔషదాలు తయారుచేయడం కోసం పాలక్కాడ్ లో, నంజన్గుడిలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ ప్రారంభించారు. 

చూర్ణాల రూపంలో ఉన్న ఔషదాలను టాబ్లెట్స్ రూపంలోకి తీసుకుని వచ్చారు. రీసెర్చ్ చేస్తూ ఎన్నో కొత్త మందులు తయారు చేయడం కూడా మొదలు పెట్టారు. కెనడాలోని ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్ (IDRC) తో కలసి పనిచేసి మెడిసినల్ ప్లాంట్స్ మీద పుస్తకాలు వ్రాసారు. 

మందుల తయారీ పెరిగింది. నాణ్యత చూడడానికి గాను సెంటర్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద అండ్ సిద్ద (CCRAS), AYUSH, DST, DAE, IIT సంస్థల సహకారంతో క్లినికల్ రీసెర్చ్ సెంటరు ప్రారంభించారు. ఈ రీసెర్చ్ సెంటర్ AYUSH, DSIR, KSPCB సంస్థల గుర్తింపు పొందింది. ఈ రీసెర్చ్ సెంటర్ లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు మందు కనిపెట్టారు. ప్రస్తుతం అక్కడ కాన్సర్ కు మందు కనిపెట్టడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. 

పి.కె.వారియర్ ఆయుర్వేదం మీద ఎన్నో వ్యాసాలు వ్రాసారు. రష్యా, అమెరికా వంటి దేశాలలో ఆయుర్వేదం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. 
ఆయుర్వేదంలో ఈయన చేసిన సేవలకు, సాధించిన ప్రగతికి పద్మశ్రీ, పద్మభూషణ్, ధన్వంతరి, కేరళ సాహిత్య అకాడమీ అవార్డ్ ఎలా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. 



ఇన్ని అవార్డ్ లు అందుకున్నా తన జీవితంలో సంతోషకరమైన విషయం ఏమిటని ఒక ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నకు "జీవితం మీద ఆశ వదిలేసుకున్న పేషెంట్స్ ను తిరిగి ఆరోగ్యవంతులుగా చూడడం" అనే చెప్పారట. ఆర్యవైద్యశాల వంటి సంస్థను ముందుకు తీసుకువెళ్ళే అవకాశం దొరకడం తన అదృష్టం అంటారు.  

ఎన్ని పనులు చేస్తున్నా వైద్యునిగా తన బాధ్యత మరువలేదు. పేద, గొప్ప తారతమ్యం చూపించక అందరినీ ఒకేలా చూసేవారు. డెభై సంవత్సరాల పాటు సమర్ధవంతంగా ఆ బాధ్యతలను నిర్వర్తించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని 2021 వ సంవత్సరం జులై 10 వ తారీఖున దివంగతులయ్యారు. 

తరువాత రోజు పార్క్ లో నడుస్తుంటే అనిపించింది, ఆయుర్వేదంలో ఎంతో ప్రగతిని సాధించిన మహానుభావులు ఒకప్పుడు ఇదే దారిలో నడిచే వారనీ, వారి జీవితాశయం, ఆ ఆశయ సాధన కోసం వారు చేసిన కృషికి నిదర్శనమే ఈ వైద్యశాల అని అర్థమైనప్పుడు, అంతవరకు ఏ భావం కలగనటువంటి ఆ ఊరు, ఆ హాస్పిటల్, ఆ దారిపై ఎనలేని గౌరవం కలిగింది. 

డాక్టర్ పి. కె. వారియిర్ గురించి ఇక్కడ చదవొచ్చు. 

No comments:

Leave your Comment

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.