Sunday, April 28, 2013

వాహిని పత్రికలో నా కథ 'మెంతి చెట్లు'

       మార్చి నెలాఖరి రోజులు, ఏటవాలుగా పడుతున్న నీరెండలో రాత్రి చలికి వణికిన చెట్లన్నీ వెచ్చగా చలి కాచుకుంటున్నాయి. విశాలమైన ఆ ఇంటి పెరట్లో పచ్చని తివాచీ పరిచినట్లు గడ్డి మొలిచివుంది. దూరంగా చెక్కతో కట్టిన ప్రహరీకి ఒక పక్క రంగురంగుల గులాబీలు విరబూసి ఉన్నాయి. వాటి పక్కన అప్పుడే నాటిన బంతి, మందారం, కనకాబరం మొక్కలు లేతగా, పసిపాప నవ్వులా నిర్మలంగా వున్నాయి. మరోవైపు చెర్రీ, పీచ్, ఆపిల్ చెట్లు తెలుపు, గులాబీ రంగులు కలగలసిన పువ్వులను అలంకరించుకుని వసంతాగమనానికి తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆ పక్కనే ఎత్తుగా పెరిగిన చెట్టు కొమ్మల్లోoచి నారింజలు సిగ్గుగా చూస్తున్నాయి.

     పెరటిలో దక్షిణపు వైపు మట్టి తొవ్వి నేలను చదును చేస్తున్నాడు నాన్న. బుజ్జి పండు, అక్క చిన్న చెంబుతో నీళ్ళు పట్టి గులాబీ మొక్కలకు పోస్తూ ఇటు అటు పరుగులు పెడుతున్నారు. వాళ్ళిద్దరూ నీళ్ళు మొక్కలకు పోసేలోపు సగం నీళ్ళు ఒంటి మీదే పడుతున్నాయి. ఈలోగా అమ్మ విత్తనాల పొట్లం, చిన్న గిన్నె తీసుకుని పెరట్లో ఈశాన్యం మూలగా ఉన్న పింక్ జాస్మిన్ పందిరి దగ్గరకు వెళ్ళింది. అమ్మ వెనకాలే వెళ్లాడు పండు.

"అమ్మా"
"ఊ..."
"నువ్వేం చేత్తున్నావ్?"
"పువ్వులు చూస్తున్నాను నాన్నా?"
"ఎందుకు?"
"ఎందుకంటే..అందంగా ఉన్నాయి కదా అందుకు"
"ఓ...మలి పచ్చి?" ఆకాశం వైపు చూపిస్తూ అడిగాడు.
"అది కూడా అందంగా ఉంది"
"చైకిలు?" అన్నాడు దూరంగా వున్న తన బుజ్జి సైకిల్ని చూపిస్తూ.
"బుజ్జిపండు సైకిలు కదా అది కూడా చాలా అందంగా ఉంది" పండు నెత్తుకుని ముద్దుపెట్టుకుని చిన్న గిన్నెలోకి పువ్వులు కోయడం మొదలెట్టింది.

"అమ్మా నేనూ కోత్తాను". పువ్వును ఎలా పట్టుకుని కోయాలో చెప్పింది. పండు ఒక్క పువ్వును పట్టుకుని లాగగానే పసిమొగ్గలు కూడా తెగిపోయాయి. అమ్మకసలే పూలంటే ప్రాణం. పండును కిందకు దించి “చిట్టితల్లీ పండును పిలువమ్మా” అని అక్కతో చెప్పింది.
"పండూ ఇలా రా సైకిల్ ఆట ఆడుకుందాం" పిలిచింది అక్క. పండు దగ్గరకు రాగానే " నీ సైకిల్ లాన్ లోకి రాకూడదు, నా సైకిల్ ఫ్లోర్ మీదకు రానివ్వను" అని చెప్పి సైకిల్ మీద గుండ్రంగా తిరగడం మొదలెట్టింది. 


     పండు తన మూడుకాళ్ళ సైకిలు మీద తిరుగుతూ అక్కని చూస్తున్నాడు, అక్కని అలా సైకిలు మీద చూడడం వాడికి చాలా ఇష్టం. పూలు కోయడం అవగానే అమ్మ పూలగిన్నె గట్టు మీద పెట్టి విత్తనాల పొట్లం తీసుకుని నాన్న చదును చేసిన దగ్గరకు వెళ్ళింది. పిల్లలిద్దరూ కూడా అమ్మ వెనకే వెళ్ళారు.

“చిట్టితల్లీ బకెట్తో కొంచెం నీళ్ళు తీసుకురామ్మా” అంటూ అక్కను పురమాయించింది. “నేను తెత్తా..నేను తెత్తా” అ౦టూ చిన్న చెంబులో నీళ్ళు తీసుకుని అక్కకంటే ముందు పరిగెడుతూ అమ్మ దగ్గరకు వచ్చాడు పండు. 

     అమ్మ మట్టిలో ఒక పక్కగా కూర్చుని జాగ్రత్తగా విత్తనాల పొట్లం విప్పి అందులో వున్న గో౦గూర విత్తనాలు వరుసగా చాళ్ళలో చల్లింది. స్క్వాష్, బీన్స్, వంకాయ విత్తనాలను చిన్న చిన్న కుండీలలో వేసింది. గోడవారగా బెండ విత్తనాలు ఒకదానికొకటి అడుగు దూరంలో వేసింది. టమేటో, మిరప విత్తనాలను నాలుగైదు వరుసలలో నారు పోసింది. అమ్మ చేస్తున్న పనిని ఆసక్తిగా గమనించాడు పండు. 

రకరకాల రంగుల్లో, ఆకారాల్లో వున్న వాటిని చూపిస్తూ “అవేంతి?” అనడిగాడు. “విత్తనాలు నాన్నా. అవి పెరిగి పెద్దై బోలెడు కూరగాయలు కాస్తాయి.” చెప్పి౦దమ్మ. 
“ఏం కాయలు?” అడిగాడు పండు.
“బీరకాయలు, వంకాయలు, బీన్స్, టమాటో, మిరపకాయలు....” అని చెప్తూ చల్లిన విత్తనాలపైన మట్టికప్పింది.
పండుకు నమ్మకం కలగలా. ఆ కూరగాయలేమో పచ్చగా, ఎర్రగా అంత పెద్దగా వున్నాయి, ఇవేమో ఇంత బుల్లిగా నల్లగా వున్నాయి. ఒక బీర విత్తనం, కొంచెం మట్టి తీసి అమ్మ చూడకుండా జేబులో వేసుకున్నాడు.
“ఆ చెట్టు కూడా విత్తన౦ వేస్తేనే మొలిచింది కదూ!” మూలగా వున్న పెద్ద ఆలివ్ చెట్టును చూపిస్తూ అడిగింది అక్క.
“ఆ అలానే మొలిచింది.” అక్క చూపించిన వైపుగా చూస్తూ చెప్పి౦ది. బుజ్జిపండు పైకి చూస్తూ వెనక్కి నడిచి చెట్టు పైనున్న చిటారుకొమ్మ కనిపించేవరకూ వెళ్ళాడు.

“ఎవరు వేశారు?”
“అంతకు ముందు ఇక్కడ వున్న వాళ్ళెవరో వేసి ఉండొచ్చు, లేకపోతే గాలికి విత్తనం యెగిరి అక్కడ పడి కూడా మొలిచి ఉండొచ్చు” చెప్పాడు నాన్న.

      పండు చుట్టూ చూసాడు గాలికి కొమ్మలు ఊగుతున్నాయి, ఆకులు అటూ ఇటూ తిరుగుతూ కింద పడుతున్నాయి, కాని ఎక్కడా విత్తనాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. పెరట్లో మరోవైపు ఏవో రాలుతున్నట్లనిపించి అక్కడకు వెళ్ళాడు. తెల్లని ఆపిల్ పూలరెక్కలు గాలికి జలజలా రాలుతున్నాయి. నేలమీద పడకుండా పూల రెక్కలు పట్టుకుంటూ, దొరికిన వాటిని తలమీద వేసుకు౦టూ ఎందుకొచ్చాడో మరచిపోయాడు.

     “పండూ నీళ్ళు పోద్దువురానాన్నా” అమ్మ పిలుపు వినిపించింది. పరిగెత్తుకుంటూ అమ్మదగ్గరకు వెళ్ళాడు. విత్తనాలు నాటిన ప్రదేశంలో పిల్లలతో నీళ్ళు పోయించి౦దమ్మ. నాన్న మొక్కలు నాటిన గుర్తుగా అక్కడ చిన్న జండా పాతాడు. తరువాత అమ్మ, నాన్న ఇద్దరూ మొక్కల దగ్గర నీళ్ళు నిలవడానికి వీలుగా పాదులు చేశారు. వాళ్ళా పని చేస్తున్నంత సేపూ పండు జేబులో చెయ్యి పెట్టి విత్తనం బీరకాయలా మారుతుందేమో చూస్తూనే వున్నాడు.

“ఇక మెంతులు వేద్దామా? అడిగాడు నాన్న.
వంటగది పక్కగా వున్న రెండడుగుల పొడవు అడుగు వెడల్పు వున్న స్థలాన్ని చూపిస్తూ “అక్కడే కదూ?” అడిగిందమ్మ.
“ఆ...అక్కడే పోయిన సారి కూడా చాలా బాగా వచ్చాయి. పైగా కిటికీలో నుండి బాగా కనిపిస్తుంది కూడాను.” చెప్పాడు నాన్న.

     అమ్మ ఒక చిన్న పుల్ల తీసుకుని వచ్చి అక్కడ నేలలో గీతలు గీయడం మొదలెట్టింది. అమ్మ తనలాగా మట్టిలో ఆడుకోవడం చూసి బోలెడు ఆశ్చర్యపోయాడు పండు. మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని ఒంగి అమ్మ వైపు చూస్తూ “ఏం చేత్తున్నావ్?” అడిగాడు.
“నీ పేరు రాస్తున్నాను నాన్నా” .
“పిచ్చమ్మ...ఎవలైనా ‘మాగ్నా డూడిల్’ మీద లాత్తారు కాని మత్తిలో లాత్తాలేమిటి?” అనుకుని “అక్కలెందుకు లాచావు?” అడిగాడు.
“పోయిన సారి అమ్మ ఇలాగే నేలమీద నా పేరు రాస్తే అక్కడ మొక్కలొచ్చి పచ్చగా నా పేరు కనిపించింది గుర్తుందా!“ మోహం వెలిగిపోతుండగా చెప్పిందక్క. 

     పండుకు అక్క చెప్పిన విషయం గుర్తు రాలేదు కాని అక్క మోహంలో సంతోషం చూసి ఏదో మంచి సంగతే అనుకుని గట్టిగా చప్పట్లు కొట్టాడు. అక్కకి కొన్ని మెంతులిచ్చి ఆ చాళ్ళలో వరుసగా దగ్గర దగ్గరగా చల్లించిందమ్మ.

“నేను కూలా ఏత్తాను” అంటున్న పండు చేతికి కొన్ని మెంతులిచ్చి చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా గీతల్లో పడేలా వేయించింది. దానిపైన కొంత మట్టి, నీళ్ళు చల్లి నిలబడి తృప్తిగా చూసుకు౦ది.
పండు దాని చుట్టూ తిరుగుతూ, “భలే భలే ఇప్పులు నా పేలు కూలా మొలుత్తుందా”? అమ్మని అడిగాడు.
“చక్కగా మొలుస్తుంది, నువ్వు ఇక్కడ తొక్కకుండా ఆడుకోవాలి మరి.”
“ఓ...అచ్చలు తొక్కను” చెప్పాడు పండు.

     మధ్యాహ్నం అవడంతో ఎండ తీవ్రత హెచ్చింది. ఉదయం నుండి పనిచేస్తున్నారేమో అమ్మ, నాన్న పిల్లలను తీసుకుని ఇంట్లోకి వెళ్లారు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం నీళ్ళు చల్లుతూ మొలకలు కనిపిస్తాయేమోనని ఎదురుచూస్తున్నారు. ఓ వారం తరువాత మెంతి విత్తనాలు వేసిన దగ్గర నేల పచ్చపచ్చగా కనిపించింది. మరునాటికి అక్కడంతా బుల్లిబుల్లి మొక్కలు మొలిచాయి. పండు అలా పచ్చగా మొలిచిన బుల్లి మొక్కలను ఆశ్చర్యంగా చూశాడు. అక్క ఆ మొక్కలను చూస్తూ ‘బుజ్జిపండు’ అని చదివింది. కొత్త మొక్కలను చూసి బోలెడు సరదా పడిపోయారు అందరూను. ఇంటికి వచ్చినవాళ్ళందరినీ బుజ్జిపండు పెరట్లోకి తీసుకెళ్ళి మె౦తి మొక్కలతో రాసిన తన పేరు చూపించాడు.

      ఓ ఆదివారం సాయంత్రం అమ్మ, నాన్న సినిమా చూస్తున్నారు. పండు, అక్క బ్లాక్స్ పెట్టుకుని ఆడుకుంటున్నారు. ఇంతలో సినిమాలో విమాన౦ వెళ్తున్న శబ్దం వినిపించింది. పండుకు అదంటే బోలెడిష్టం పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న ఒళ్ళోకూర్చున్నాడు. టివిలో రెండు కొండల మధ్య ఆకాశంలో ఎగురుతూ వున్న విమానం కనిపించింది కింద౦తా ఆకుపచ్చని చెట్లు, వాటి మధ్యగా నది కూడా కనిపించాయి. ఆ విమానం వెళ్ళే వరకు చూసి “నాన్నా ఆ చెత్లన్నీ ఇత్తనాలేనా” అడిగాడు.

“అవును నాన్నా, భలే గుర్తు పెట్టుకున్నావే” అంటూ పండుకు ముద్దిచ్చాడు నాన్న.
“నేను పెద్దయ్యాక ఎలోపెన్లో అకాచంలో ఎల్తున్నప్పులు ఫారెత్ లో బుజ్జి పండు అని కనిపిత్తుంది కదా!” అన్నాడు. నాన్నకు అర్ధం కాలేదు. “ఎక్కడ నాన్నా ఏ ఫారెస్ట్ లో?” అని అడిగాడు.
“మనం బోలెడు ఇత్తనాలు ఏచాం కదా అవి పె......ద్దై పైనుంచి చూత్తే ఫారెత్ లాగా అయి అప్పులు బుజ్జిపండు కనిపిత్తుంది.” అంటూ నమ్మకంగా పండు చెప్పిన మాటలకు అమ్మ, అక్క పెద్దగా నవ్వారు. అమ్మ పండును ఎత్తుకుని రెండు బుగ్గలమీద ముద్దులు కురిపించింది.

      ఆ తరువాత ఎప్పుడు మెంతులు చల్లినా అమ్మకు ఆకాశంలో వెళ్తున్న విమానం, కింద అడవిలో ‘బుజ్జిపండు’ బుల్లి బుల్లి ఆకుల మెంతి చెట్లు కనిపించేవి. 

వాహిని పత్రికను ఇక్కడ చదవొచ్చు.