Wednesday, December 23, 2015

తుది మజిలీ

"ఏమైనా అయన అలా చేసి ఉండకూడదు."
"ఎవరూ?"
"రంగనాథ్ గారు...ఆత్మహత్య పాపం కదా?"
"ఆత్మహత్య-పిరికితనం, ప్రాణ త్యాగం-పౌరుషం, సజీవ సమాధి-పరిపూర్ణత్వం అంటూ మరణం పట్ల ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం విన్నావుగా"
"వింటే..."
"అంతా అనుభవించేశాను ఇంకేమిటీ జీవితం అని రాధాకృష్ణ గారితో ఇంటర్యూలో కూడా  చెప్పారు."
"అదంతా ఏం కాదులే... పిల్లలు చూడలేదట, అస్సలు ఆయన దగ్గరకు రానే రారట, ఒంటరిగా ఉండడంతో ఆయనకు డిప్రషన్ అట. వృద్దాప్యంలో తండ్రిని పట్టించుకోక పోవడం ఎంత దారుణం!"
"అట, అట, అట... ఆ మాటలలో నిజమేమిటో మనకు తెలుసా? అసలు తెలుసుకోవలసిన అవసరం ఏమిటి?"
"ఏమిటంటే కళాకారుల జీవితం నలుగురికీ సంబంధించిందీనూ! అయనంటే నాకు గొప్ప అభిమానం"
"అవునా!"
"నమ్మవా? "
"నమ్మాన్లే ...నువ్వు మాట్లాడుతున్నవన్నీ వింటున్నాగా! అభిమానం చూపించే పద్ధతి ఇదే కాబోలు."
"అంత నిష్టూరమేం! తెలుసుకోవాలనుకోవడం తప్పా?"
"మీ ఇంటి విషయాలు నువ్వు ప్రపంచమంతా చాటుకోవాలనుకుంటావా?"
"అదీ ఇదీ ఒకటేనా?"
"కానే కాదు. ముఖ్యంగా తండ్రి చనిపోయిన కొన్ని గంటలలో జరిగిందేమిటో కూడా పూర్తిగా జీర్ణించుకోలేని అయోమయంలో ఇష్టం లేకపోయినా నలుగురి ఎదుట మాట్లాడవలసిన పరిస్థితి ఉంది చూశావూ... అది మనలాంటి వాళ్ళకెలా తెలుస్తుంది..."

"......"
"......."

"అయన ఎంత మంచి కవితలు రాశారు..."
"నిజమే"
"అలాంటి తండ్రి కడుపున బుట్టి అలా ప్రవర్తించడం తప్పు కదూ!"
"అవును... నేనూ నమ్మలేక పోతున్నాను."
"చూశావా, చివరకు ఒప్పుకున్నావ్"
"ఓ వ్యక్తిని అభిమానిస్తూ ఆ పెంపకంలో పెరిగిన వారి గురించి నువ్విలా ఆలోచించగలుగుతున్నావంటే, ఆయన మాటల మీద, వ్యక్తిత్వం మీద నీకు విశ్వాసం లేదన్న మాటేగా!"

"...."

"ఒక్క విషయం ఆలోచించు. తల్లిలేని లోటు వయసుతో సంబంధం లేనిది. తండ్రి కూడా అర్ధాంతరంగా దూరమయిన క్షణాలలో వారి మానసిక స్థితి ఎలా ఉంటుందోనన్న విషయం మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా అర్ధం అవుతుంది. సానుభూతి చూపించి సహానుభూతిని అందించాల్సిన సమయంలో అపోహలు, అనుమానాలను వ్యక్తం చేయడం భావ్యమా? ఒక కళాకారుడిగా ఆ అక్షరశిల్పి సమాజానికి అందించిన సేవలకు ప్రతిఫలంగా ఆయన పోయిన తరువాత ఆ కుటుంబాన్ని ఒక ముద్దాయిగా నిలబెడుతున్న మన సంస్కారాన్ని ఏమనాలి? "




"అన్నీ తెలిసిన మనిషి కూడా బలహీన క్షణాలకు లొంగిపోవడం..."
"బలహీనక్షణాలో... బలమైన వైరాగ్యమో నిర్ణయించడానికి మనమెవరం?"

"ఎవరు  ఏ దారి వెంబడి వచ్చారో, పూల బాసలే విన్నారో,  ముళ్ళ కంపలు తొలగించడానికి  వారికి యుద్దాలే చేయవలసి వచ్చిందో ఎవరికి తెలుసు? తుది మజిలీ ఏమిటో ఎవరం ఊహించగలం?"


రంగనాథ్ గారికి అశ్రునయనాలతో నివాళి.

Thursday, December 3, 2015

పదుగురాడిన మాట

        ఉదయం మెలుకువ రాగానే రాత్రి పడుకునేదాకా స్వారీ చేసిన ఆలోచన చటుక్కున తిరిగొచ్చింది. దాన్ని వదిలించుకోవడం ఎంతైనా అవసరం. లేకపోతే ఓ రోజుని స్వాహా చేసేస్తుంది, అసలే ఆలోచనకు ఆకలెక్కువ.

       ఇలా పడుకుంటే కుదిరేలా లేదు, లేచి కిటికీ తెరలు తొలిగించాను. సూరీడు చలికి బద్దకించాడో ఏమిటో ఇంకా చీకటి చిక్కగానే ఉంది. ఏదైనా పుస్తకం చదువుకోవచ్చు గాని, మనస్సును అదుపులో పెట్టాలంటే ఏదో ఒక పనిచేయాలి. వంట గది వైపుగా అడుగులు వేశాను. ఫ్రిడ్జ్ లో నండి కూరగాయలు తీసి ముక్కలు తరిగి వంట మొదలెట్టాను. అలవాటుగా చేతులు పనిచేస్తున్నా ఆలోచన మాత్రం వదలట్లేదు. ఏమిటో అంత దీర్ఘాలోచన అనుకుంటున్నారా! మనుష్యులు... మనస్థత్వాలు. ఎప్పటికీ అర్ధం కాని అంశం కదూ ఇది!

      చిన్నప్పుడు ఒక కథ విన్నాను. ఒక బీద బ్రాహ్మణుడు మేక పిల్లని భుజాన వేసుకు వెళ్తుంటాడు. ఆ దారిలో వెళ్తున్న దొంగలు నలుగురికి ఆ మేకను ఎలాగైనా స్వంతం చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. దానితో వారు ఒకరి తరువాత ఒకరు ఆ బ్రాహ్మణుడికి ఎదురు పడి "ఏమయ్యా కుక్కను భుజాన వేసుకుని వెళ్తున్నావు" అని అడుగుతారు. మొదట అది మేకే అని చెప్పిన బ్రాహ్మణుడు నలుగురూ ఒకే మాట చెప్పడంతో అది కుక్కే అన్న అభిప్రాయానికి వచ్చి దాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోతాడు. "పదుగురాడిన మాట పాటియై ధరజెల్లు ఒక్కడాడు మాట ఎక్కదు ఎందు" అని వేమన గారన్నారు. పై రెండింటి సారాంశం కూడా ఒక్కటే, పది మందీ ఏమంటే అదే చెల్లుతుంది అని. 

      ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆనాడు మంచో చెడో పది మందీ ఓ మాట చెప్పేవారు. వినడం వినకపోవడం ఎదుటి వారి గుణగణాల్ని బట్టి ఉంటుందనుకోండి. అది వేరే విషయం. కాని ఈ నాడు అసలు మాట చెప్పడమే మానేశారు. ఎందుకనీ అంటారా? అదిగో అదే నా ఆలోచన. 

      జరుగబోయే అనర్ధాలు తెలిసి కూడా ఇవన్నీ మనకెందుకులే మనకిప్పుడేమీ నష్టం జరగడం లేదుగా అనే అలసత్వం కావచ్చు. లేదా "ఇలా ఆలోచించడం తప్పు, ఇలా చెయ్యకూడదు, ఒక్క ఆలోచన వల్ల వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉంది, తద్వారా నష్టపోయేది మనమే" అన్న విషయం నిక్కచ్చిగా చెప్తే స్నేహితునికో, ఒక వర్గానికో దూరమౌతామన్న స్వార్ధపూరితమైన మొహమాటం కావచ్చు. ఇలాంటి మొహమాటానికి పోయే కదా దుర్యోధనుడి అధర్మమైన కోరికకు మద్దతునిచ్చి కర్ణుడు కురువంశ పతనానికి పరోక్షంగా కారణమయ్యాడు. 

      ఎదురుగా ఎన్నెన్నో ఘోరాలు జరుగుతుంటాయి అవన్నీ పెద్ద పెద్ద అవాంతరాలు తెచ్చి పెట్టేవి కావు. కాని అలా అని ఊరుకుంటే పర్యవసానం ఎలా ఉంటుందో 'ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్' బ్లాగ్ లో 'బురద గుంట- రేప్ ప్రపంచం' లో సవివరంగా వ్రాశారు. 

      ఇలాంటి అనర్ధాలు చాలనట్లు పుండు మీద రసి కారినట్లు ఈ కులపిచ్చి ఒకటి. ఆ దుర్వాసన నేడు ఖండాంతరాలు దాటి వాడవాడలా వ్యాపిస్తోంది. ఇలాంటి పదాలు వాడడానికే అసహ్యంగా ఉంది. చదవడానికి మీకెలా ఉందో మరి. అంతకంటే దరిద్రమైన ఉపమానాలు వాడడానికి సంస్కారం అడ్డం వస్తోంది. 

       ఎన్నో విషయాలను మనం చూసి చూడనట్లు వదిలివేస్తున్నాం. వాటివలన జరుగుతున్న అనర్ధాలకు మాత్రం విపరీతంగా స్పందిస్తున్నాం. ప్రతి మనిషికీ ఏవేవో కోరికలు ఉంటాయి, అందరీ ఆలోచన ధోరణీ ఒక్కలా ఉండదు. కాని ఆ కోరికలు వ్యవస్థను నాశనం చేస్తున్నాయని తెలిశాక కూడా ఖడించక పోవడం, చూసి చూడనట్లు మాట్లాడకుండా ఊరుకుంటున్నామంటే ఆ నేరంలో మనమూ భాగం పంచుకుంటున్నామనే అర్ధం.

      ముఖ్యంగా నాయకులు, ఒక రంగంలో విజయం సాధించిన వారు, గురువులు..... నలుగురి దృష్టి వారిపై ఉంటుంది. వారిని అనుసరించే వారు కూడా కోకొల్లలు. అలాంటి వారు సంయమనం పాటిస్తూ, అడుగు ఎంత జాగ్రత్తగా వేయాలి. తడబడితే అది నమ్మకం మీద, మానవత్వం మీద కదా దెబ్బ తగిలేది. ఆ నమ్మకమే పోయాక చేయడానికేమి మిగిలుంటుంది? 

        సమస్యను మొక్కగానే తుంచేస్తే అది మానులా ఎదగకుండా ఉంటుంది. గోటినే ఉపయోగించడం మరచిపోయిన వాళ్ళం, మనకు గొడ్డలి పట్టుకోవడం చేతనవుతుందా? యావత్ ప్రాణకోటిలో మనిషికి మాత్రమే ఉన్న వరం... మాట. అనవసర మొహమాటాలు వదిలిపెడితే మనిషి జన్మకు సార్ధకత చేకూరుతుంది.



Tuesday, November 17, 2015

ఏవిటండీ ఈయన...

       ఇప్పుడూ... మనకు మెర్సిడస్ ఫైవ్ సిరీస్ కావాలంటే ఏం చేస్తాం? లేదూ అబ్బా యికి మంచి సంబధం రావాలంటే ఏం చేస్తాం? ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే ఏం చేస్తాం? అర్ధం కాలేదా సత్యనారాయణ వ్రతం కదా చేస్తాం. పైగా కోరిక కోరడం కోసం కాదు, అది తీరిందన్న కర్ఫర్మేషన్ వచ్చేకే కదా చేస్తాం. ఇండియాలో సంగతేమో గాని అమెరికాలో మేం ఏడాదికొక్కసారి ఓ కోరికల లిస్ట్ పెట్టుకుని, అందులో కొన్ని తీరినవి మరొకొన్ని తీరవలసినవి ఉండేలా జాగ్రత్త చేసుకుని తెలిసిన వారినందరినీ పిలిచి సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం.

     మన పెద్ద వాళ్ళు మన కోరికలు తీర్చుకోవడానికి ఇంత సులభ మార్గం చెపితే... ఈయనేమిటండీ ఇలా అంటున్నారూ...ఒకటే కన్ఫ్యూజనూ...


Monday, September 14, 2015

ఎందుకు, ఏమిటి, ఎలా?

        "ఇలా ఎందుకు జరిగింది?" ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న రాకమానదు. ఎక్కువగా పరిస్థితులు అనుకూలించనప్పుడే, "అరెరే ఎందుకిలా జరిగింది?" అనుకుంటూ ఉంటాం. "ఇలా జరగడానికి కారణాలు ఏమిటి?" అని ఆలోచించడం ఓ పధ్ధతి. అయితే చాలా సార్లు ఈ ఆలోచన రాకముందే, అసలే ఆలోచనా రాకముందే చటుక్కున అడుగు ముందుకు వేసి, తీరిగ్గా "అడుసు తొక్కనేల కాలు కడగనేల" అని వాపోతూ ఉంటాం. ఆ తరువాత ఎప్పటికో తెలివొచ్చి "అసలు ఇది ఎలా జరిగింది!" అని ఆశ్చర్యపోతాం. అప్పటికే జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతాయి.

      అనుభవపూర్వకంగా తెలుసుకున్నదేమిటంటే ఎందుకో ఒకందుకు కొన్ని జరుగుతాయి. వాటిలో మన ప్రమేయం ఏమీ ఉండదు, కాబట్టి ఆ ప్రశ్న పక్కన పెట్టి జరిగిందేమిటి? దాన్ని ఎలా పరిష్కారించాలి? అని కాస్త నిదానంగా ఆలోచిస్తే సమస్య దూదిపింజలా తేలి పోకపోయినా శ్రావణమేఘంలా కురుసిపోతుంది. అంటే చివరకు ఎలాగోలా పోతుందన్నమాట. సమస్యకు కుదురులేదు మరి, మన పక్కనే అది ఇల్లు కట్టుకుని కూర్చోదు.

ఈ ఎందుకు? ఏమిటి? ఎలా? ప్రశ్నలు ఈవారంలో నాకు రెండు సార్లు ఎదురయ్యాయి.

   ఒకటి కాజా సురేశ్ గారి దగ్గరనుండి నాలుగు రోజుల క్రితం ఒక మెయిల్ వచ్చింది. మేము ఈ వారాంతం 'హమారా' వేదిక ద్వారా ఒక కార్యక్రమం చేస్తున్నాం. మీరు దానిలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పాలి అన్నారు.

     వెంటనే పై మూడు ప్రశ్నలు వరుసగా దర్శనమిచ్చాయి. అయితే వాటి కర్తను నేను కాదు కాబట్టి సమాధానం వారి నడిగే తెలుసుకుందామని సురేశ్ గారికి ఫోన్ చేశాను. హమారా ద్వారా వారు వివిధ ప్రాంతాల వారిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నామని, దానికోసం ఎవరూ పనికట్టుకుని రానక్కరలేకుండా ఇంట్లోనే కెమెరా ఆన్ చేసుకుంటే చాలని చెప్పారు. చాలా ఆనందం కలిగింది. వారు నన్ను ఆహ్వానించినందుకు కాదు! ఇలాంటి ఓ పద్ధతికి శ్రీక్రారం చుట్టినందుకు. ఇక ఎలా, ఏమి చెప్పాలన్న విషయానికి నాకు తోచింది, తోచినవిధంగా చెప్పొచ్చని అర్ధమైంది.

     ఇంతకూ అసలు విషయం మీకు చెప్పనే లేదు కదూ! అదేనండీ వారు నాతో ప్రస్తావించిన కార్యక్రమం గురించి. మన పిల్లలకు తెలుగు ఎందుకు నేర్పించాలి?  ఎలా నేర్పించాలి? ఎంతవరకు నేర్పించాలి? ఇవీ అంశాలు.

    ఆ మొదటి ప్రశ్న చాలా సర్లే విన్నాము, మాకు తోచిన సమాధానం  చెప్పాము. ఇప్పుడీ చర్చద్వారా పలువురి అభిప్రాయాలు తెలుసుకోవచ్చని ఆసక్తి కలిగింది. ఇక ఎలా నేర్పించాలి? ఎంతవరకు నేర్పించాలి? అన్న ప్రశ్నలకు మేము ఆచరిస్తున్న విధానాన్నే చెప్పొచ్చు. పైగా అవన్నీ తల్లిదండ్రుల సలహా మేరకు మేము అనుసరిస్తున్నవిధానాలు, విద్యార్ధులు ఆమోదం తెలిపిన బోధనా పద్ధతులూనూ.

        ఈ శనివారం మధ్యాహ్నం గంటన్నర అనుకున్న చర్చ రెండున్నర గంటల పాటు ఆసక్తికరంగా సాగింది. ఆ వివరాలన్నీ హమారా సైట్లో వున్నాయి. పైగా ఏ నిముషానికి ఏమి మాట్లాడామో చాలా ఓపిగ్గా అక్కడ పొందుపరిచారు. ఆ సంభాషనంతా యూ ట్యూబ్  మేము మాట్లాడుతున్నప్పుడే ప్రసారం చేశారు. మీరు కూడా విని మీ అభిప్రాయలు మాతో పంచుకుంటే అవి ఎంతో మందికి ఉపయోగపడొచ్చు. ఇంకో విషయం ఏమిటంటే అక్కడ ఎలా చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఏమి చెప్పాలన్న విషయాలపై వారు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారో అవన్నీ మా పాఠ్యాంశాలలో ఉన్నవే. మేమేమీ మార్చుకోనక్కర్లేదని అర్ధమైంది. ఆ సంభాషణ విన్న మా ఉపాధ్యాయులందరూ కూడా నా అభిప్రాయంతో ఏకీభవించారు.

ఇక ఆ ప్రశ్నలు రెండవ సారి నిన్న రాత్రి ఎదురయ్యాయి.

      జ్యోతి వలభోజగారు "మీ ఫేస్ బుక్ వాల్ ఒకసారి చూసుకోండి." అని మేసేజ్ పెట్టారు. ఏమిటా అనుకుంటూ  వెళితే అక్కడ ఆవిడ షేర్ చేసిన నవతెలంగాణా లింక్ కనిపించింది. చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. ఎలా వ్రాశారో చూద్దామని అని ఆ లంకె పట్టుకుని వెళితే 'అక్షర కుసుమం' అంటూ ఇదిగో ఇది కనిపించింది.






సమస్య ఎలా ఇల్లు కట్టుకుని మన పక్కనే పాతుకుని ఉండలేదో, సంతోషం కూడా అంతే. కాని ఆ అనుభూతి మాత్రం గుర్తొచ్చినప్పుడల్లా గుభాళిస్తూనే ఉంటుంది.

ఆ విధంగా ఈ వారంలో రెండు సార్లు ఆ ప్రశ్నలు శుభ సందర్భంలోనే ఎదురయ్యాయి. హమారా టీం కు, నవతెలంగాణా పత్రికకు, శ్రమ తీసుకుని ఈ బ్లాగులను పరిచయం చేసిన భారతిగారికి ధన్యవాదాలు.


Friday, July 24, 2015

రంగుల కల

       అందమైన కల ఇచ్చే అనుభూతే వేరు, అది నిద్రలో కాని, మెలుకువలో కాని. నాకు బాగా గుర్తున్న కల.. బుజ్జిపండు ఇక రెండు నెలల్లో పుడతాడనగా వచ్చిన పసుపు పచ్చని పులిహోర కల. నవ్వకండి! నిజంగానే. తెల్లవారి లేచి మామూలు కన్నా కొంచెం ఎక్కువ పసుపుతో పులిహోర కలిపి తినేశాను. ప్రస్తుతం నా కలల్లో రంగులు కనిపించడం లేదు. పోనీ కలలకే రంగులు వేస్తే! ఏమిటీ..  వేయలేం కదూ! అందుకే చుట్టూ ఉన్న పరిసరాలకు అంటే ఇంటి గోడలకు రంగులు వేయాలనిపించింది. ఆ కథా కమామీషంతా ఓ సహస్రం నడిచింది. టూకీగా విశేషాలు చెప్తాను.

             *            *            *            *            *            *    

"ఇవాళ రంగులు చూసి వద్దామా?" తో ఓ రోజు మొదలైంది. ఆ వసంతమాసపు ఉదయం ఉత్సాహంగా 'షెర్విన్ విలియమ్స్' లోకి అడుగు పెట్టాం. కావలసిన రంగులేలో కార్ట్ లో  పెట్టుకుని తెచ్చేద్దాం అనుకుంటూ.
"కెన్ ఐ హెల్ప్ యూ?" సేల్స్ గర్ల్ వచ్చింది.
"మేము ఇంటికి రంగులు వేయాలనుకుంటున్నాం."
"మరి రంగులు ఎంచుకున్నారా?" అని అడిగింది. "ఇంకా లేద"నగానే రంగుల్లో ఎన్ని రకాలున్నాయో, ఏ రంగులైతే ఒకదానిపక్కన ఒకటి సఖ్యంగా ఉంటాయో, సాధారణంగా ఏఏ గదులకు ఏఏ రంగులు వాడతారో ... అన్నీ చెప్పడం మొదలెట్టింది. పూర్తయ్యేసరికి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. ఆ పూటకు రంగుల వేట చాలించి  ఆ మర్నాడు కొత్తగా రంగులు వేసిన మా స్నేహుతుల ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటాయన వాళ్ళ గదులన్నీ ఉత్సాహంగా చూపించి అన్ని గదులకు కలిపి మొత్తం పదహారు రంగులు వాడినట్లుగా చెప్పాడు. మరో ఇంటికి వెళ్ళాం, వాళ్ళూ అంతే. అంటే ఈ రంగుల ఎంపిక అంత తేలికగా అయ్యే వ్యవహారం కాదని అర్ధం అయింది. "తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది" అన్నట్లుగా మేమొకటి అనుకుంటే మా పిల్లల అభీష్టం మరొకటని అర్ధం అయింది. ఎలాగంటారా...  

"నీ రూమ్ కే రంగు వేద్దాం అమ్మలూ",
"పింక్ అండ్ పర్పుల్"
"ప్రెట్టీ కలర్స్, చ్యూజ్ వన్"
"ఐ వాంట్ బోత్"
"బుల్లి రూమ్ కి రెండు రంగులు ఏం బావుంటాయిరా?"
"బావుంటాయమ్మా" అమ్మని ఒప్పించాలంటే ఏ భాషలో మాట్లాడాలో అమ్మాయికి బాగా తెలుసు. 
సరే అందులో షేడ్స్ చూడు. 
"లైట్ పింక్ అండ్ డార్క్ పర్పుల్..  ఐ మీన్ ఫషియా"
"ఫషియా .... ఫషియా అంటే దగ్గర దగ్గరగా నేరేడుపండు రంగు... ఇంకో సారి ఆలోచించరా"
"బాత్ రూమ్ కి లావెండర్ కలర్."
వెంటనే ఓకె  చెప్పేశాను. ఆలస్యం చేస్తే కిటికీ అంచులకీ, డోర్ నాబ్ కి కూడా వేరే రంగులు చెప్పెయ్యగలదు. 
"నీకు పండూ"
"ఐ వాంట్ ఓన్లీ వన్ కలర్. బ్లూ"
"ఓకే. గుడ్"
"డా...ర్క్ బ్లూ".
"రూమంతా అదేనా?" నడి సముద్రంలో మునిగిపోతున్న ఫీలింగ్ తో అడిగారు నాన్న.  
"ఆక్చ్యువల్లీ . ఐ వాంట్  హైపర్ బ్లూ".
"ఒద్దురా బాబూ. ఆ రంగువేస్తే  రూమంతా చీకటై పోతుంది." 
"నాకదే కావాలి. బాత్ రూమ్ అండ్ కోజెట్స్ బ్రైట్ ఆరంజ్"
"నో వే" రామ్ గోపాల్ వర్మ సినిమా చూడకుండానే ముచ్చెమటలు పోశాయి.
"ఎస్."
"ఆ..సరే కానియ్."
ఆ 'నో వె' కి... 'సరే కానియ్' కి మధ్య చాలా అంతరాలు దాటాల్సి వచ్చింది.

మిగిలిన గదులన్నింటికీ ఏ రంగులు వేయాలా? అని ఇంటర్ నెట్  అంతా వెతుకుతూ ఓ రోజు బయటకు చూసేసరికి ఎరుపు, పసుపు, నారింజ రంగులతో చెట్లు హోలీ ఆడినట్లు రంగులే రంగులు. ఫాల్ కలర్స్ తో ఆకులు రంగులు మార్చుకున్నాయి కాని మా గోడలకు ఆ భాగ్యం కలగలా. . ఇక లాభం లేదని పెయింటర్ ని ఇంటికి పిలిచి సలహా అడిగాం. ఏ రంగు బావుంటుందో చూడాలంటే ముందు సాంపిల్స్ తెచ్చి వేసి చూడమన్నాడు. వేశాం. ఏ గోడమీద చూసినా ఎక్సర్ సైజ్ చేస్తున్న ఇంద్రధనస్సులే.

మళ్ళీ వసంతం వచ్చిన కొన్ని రోజులకు గోడలకున్న పటాలన్నీ కిందకు దిగాయి. సోఫాలు, మంచాలన్నీ ముందుకు జరిగాయి. ఏ గదిలోకి వెళ్ళినా గోడమీద నృత్యం చేస్తున్న రంగులు పులుముకున్న కుంచెలు...అర్ధం కాని భాషలో ఆ కుంచెలు పట్టుకున్న వారి కబుర్లు. ఒక్కో గోడకు రంగు వేస్తుంటే అది ఎలా మారుతుందో ఆశ్చర్యంగా చూడడం. నచ్చకపోతే షెర్విన్ విలియమ్స్ కి పరిగెత్తి కొత్త రంగు తెచ్చుకోవడం. ఇలా ఓ వారం గడిచాక...

    మంచి గంధానికి రెండు చుక్కలు లవంగనూనె కలిపినట్లు మధ్య గది, తొలకరి జల్లులో మెరిసే మైదానంలా వంటగది, కుంకుమ పువ్వు పులుముకుని ముందుగది, నడివేసపు చల్లని సాయంత్రంలో మెరిసేటి నీలి సంద్రంలా మరో గది.... ఇలా గది గదిలో ప్రకృతికాంత విన్యాసాలతో నా రంగులకల పూర్తయ్యింది.

నేర్చుకున్న పాఠాలు:

  • ఎవరి ఇంట్లోనైనా అందంగా అనిపించిన రంగు మన ఇంటికి సరిపోకపోవచ్చు. వెలుతురును బట్టి రంగు అందం మారుతూ ఉంటుంది. 
  • ఇంటికి రంగులు వేసిన తరువాత సామాన్లు కొనడం ఉత్తమం.
  • పెయింట్ గోడ మీద చూడాలనుకుంటే పోస్టర్ బోర్డ్ మీద వేసి గోడకు అంటించాలి. అంతే కాని నచ్చిన దగ్గర పులిమేయకూడదు.   
  • చీకటిగా ఉన్నాయి కదా అని క్లోజెట్స్  కి లేత రంగులు వేయక్కర్లేదు. ముదురు రంగులు కూడా బావుంటాయి. లైటింగ్ మార్చుకుంటే సరిపోతుంది. 
  • గోడలమీద వున్న నొక్కులు, చొట్టలు సరిచేసిన తరువాత  రంగు వేస్తే మంచిది. ఈ విషయం మీ పైంటర్ మీకు చెప్పకపోవచ్చు.
  • ముదురు రంగులు వేయడం చూస్తూ ఉన్నప్పుడు గది చీకటై పోతుందేమో అని కంగారుగా అనిపిస్తుంది. మరేం ఫరవాలేదు. తెల్లని గోడపక్కన అలా అనిపిస్తుంది కాని గది మొత్తం వేసినప్పుడు అసలు రంగు తెలుస్తుంది.  
  • లేత రంగు ఎంచుకునేప్పుడు ఆ షీట్స్ తెలుపు రంగు కాగితం మీద పెట్టి చూస్తే రంగు ఎలాంటిదో సరిగ్గా అర్ధం అవుతుంది.

Tuesday, July 7, 2015

ఏమండోయ్...

"మిమ్మల్నే.... పిలుస్తుంటే పలకరేం?"
"పిలిచావా? ఏమని?"
"ఏమని పిలుస్తానో తెలీదా?"
"ఎందుకు తెలీదు. బాగా తెలుసు. అలా దారిని పొయ్యేవారిని పిలిచినట్లు 'ఏవండోయ్' ఏవిటి? చక్కగా పేరు పెట్టి పిలవొచ్చుగా?"
"అలవాటు లేని పని కొత్తగా ఎందుకని?"
"అలవాటుదేముంది చేసుకుంటే అదే వస్తుంది."
"మిమ్మల్ని చేసుకున్నాను చాలదూ!"
"అదంతా ఏం కుదరదు. ఇవాళ నన్ను పేరు పెట్టి పిలవాల్సిందే"
"పేరా... ఏం పేరూ?"
"మా అమ్మా నాన్న పెట్టిన లక్షణమైన పేరు."
"మిమ్మల్ని నాకిచ్చేశారుగా. కనీసం ఆ పేరన్నా వాళ్ళకి వదిలేద్దామని."
"అబ్బో గొప్ప ఆలోచనే!"
"కదా!"
"కదా లేదు ఏం లేదు. పిలవాల్సిందే"
"కుదరదు."
"ఏం.. ఎందుకని"
"ఏవిటో సిగ్గనిపిస్తోంది"
"కొత్త పెళ్ళికూతురా రారా! నీ కుడికాలు ముందుమోపిరారా!...."
"చాల్లే. అయినా నేను సిగ్గుపడితే అందంగా ఉంటానని నిన్నేగా అన్నారు. ఇప్పుడేమో ఎగతాళి చేస్తున్నారు"
"అది రాత్రి మాట కదా!"
"పగలో మాట రాత్రో మాట. మాట మార్చడం మీ వంశంలోనే లేదని మొన్న మీ మామయ్యతో అన్నారు..."
"ఏదో కోపంలో మాటా మాటా అనుకున్నాం. అయినా బోడి గుండుకూ మోకాలికీ ముడి పెడతావే."
"ఎంత కోపం వస్తే మాత్రం పెద్దవాళ్ళతో అందులోనూ మేనమామతో అలాగేనా మాట్లాడేది?
"మరి ఆయనన్న మాటలు యెట్లా ఉన్నాయ్?" 
"యెట్లా ఉన్నాయేమిటి?"
"ఆయన తాతగారిని, అమ్మావాళ్ళను అలా అనడం తప్పుకాదూ"
"తప్పే."
"ఆ విషయం ఆయనకు మాత్రం తెలియదూ?"
"తెలుసు. చివరి రోజుల్లో మీ అత్తయ్య తాతగారిని చూడక పోవడం. ఆస్తంతా ఆయన అత్తయ్యగారి పేరున వ్రాయడం ఈ గొడవలన్నింటికీ కారణం. మీ అత్తయ్య ఆయనని చూడకపోవడంలో మీ మామయ్య తప్పేం ఉంది? పైగా ఆయనకు తండ్రి కోసం ఏమీ చెయ్యలేక పోయాననే గిల్టీ కాన్షస్. దాంతో ఏదో అన్నారు. పెద్దవాళ్ళు ఏదో అనుకుంటున్నారని ఊరుకుంటే పోయేదిగా"

"మరి నాకు మాత్రం కోపం రాదేమిటి?"
"వస్తుంది. ఆ కోపంలో చిన్నప్పట్నుండీ ఆయన మిమ్మల్ని ఎంత గారాబం చేసేవారో, మీ అత్తయ్యకు మీరంటే ఎంత ఇష్టమో మర్చిపోయారా? వాళ్ళతో గడిపిన సమయం అంతా ఇప్పుడు తలచుకుంటే ఎలా ఉంది? అన్నీ పాడుచేసుకుంటారా?"

"నిజమే. బాధగానే ఉంది. కాని ఆయన అలా చేయడం తప్పుకదూ! పైగా అప్పుడు అత్తయ్యకు సర్ది చెప్పుకోలేక ఇప్పుడిలా మాట్లాడడం!"
"మీ తాతగారికి ఆడవాళ్లంటే ఉన్న చులకన మీకు తెలుసుగా! స్వతహాగా మీ అత్తయ్య చాలా మంచివారు. ఆవిడ మనసెంత కష్టపడితే అలా బిహేవ్ చేసి ఉంటారో మీరూహించగలరా?"

"అయితే మాత్రం?"
"అయితే గియితే ఏమీ లేదు. ఆవిడ చెప్పుల్లో కాళ్ళు పెట్టి గతాన్నీ భవిష్యత్తునూ మనం చూడలేం. అయినా అలాంటివన్నీ మనసులో పెట్టుకుంటే చివరకు మనకూ ఎవరూ మిగలరు."

"అవుననుకో అన్ని మాటలనుకున్నాక అంతకు ముందులా ఎలా ఉండగలం?"
"చక్కగా ఉండొచ్చు. బూరెలు చేశాను. మీ మామయ్యకు ఇష్టంగా! తీసుకుని సాయంత్రం వాళ్ళింటికి వెళ్దాం. మీ అత్తయ్య మీ కిష్టమైన మామిడికాయ పులిహోర చెయ్యకపోతే నన్నడగండి"
"అంతేనంటావా?"
"అంతే కాదు. ఇప్పుడంటే కోపంలో ఉన్నారుగాని, మీరెవ్వరూ మీ మామయ్యతో మాటాడక పోవడం, రెండు కుంటుంబాల మధ్య కలతలు రావడం అత్తయ్యగారికి ఎలా ఉంటుందో ఆలోచించండి."
"....."
"అయిన వారి మధ్య కలతలు ఎన్ని మానసిక సమస్యలకు దారి తీస్తాయో మీకు తెలియదు. అహానికి పెద్ద పీట వేస్తే సౌఖ్యానికి తిలోదకాలు ఇవ్వాల్సి ఉంటుంది. పరిస్థితి చేయి దాటనివ్వకండి."
"......"
"ఎమాలోచిస్తున్నారు?"
"నువ్వు గొప్ప మాయల మరాఠివి"   
"అందరం బావుండాలని తోచిన సలహా చెప్పాను. గొప్ప బిరుదే ఇచ్చారు. ఇష్టం లేకపోతే మానెయ్యండి"
"ఆహ అది కాదు" 
"ఏది కాదు సందర్భం వచ్చింది కదా అని చెప్పాను. కోపంలోనో, ఆవేశంలోనో ఒకరు తడబడినప్పుడు రెండో వారు దిద్దుకుంటేనే కదా జీవనం సవ్యంగా సాగేది. నాకెన్నిసార్లు మీరిలాంటివి చెప్పలేదు."

"సర్లేవోయ్. అసలు విషయానికి వద్దాం" 
"ఏ విషయం....ఓ అదా!"
"అదా అని అంత తేలిగ్గా అనేస్తే ఎలా..."
"బరువుగా అనడం రాదు మరి. నేనసలే ఏడు మల్లెలెత్తు. మిమ్మల్ని కలిసిన మొదటి సారి మా బాబాయి చెప్పలేదూ"
"అప్పుడు ఏడు మల్లెలే. ఇప్పుడే ఏడువేల మల్లెలయ్యాలి."
"ఎన్నయినా మల్లెలు మల్లెలే."
"మల్లెలు మల్లెలే జాజులు జాజులే"
"ఇప్పుడా మల్లెలు జాజుల కథలెందుకులెండి!"
"ఔనంటే కాదనిలే... కాదంటే ఔననిలే... ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే....ఇప్పుడు ఎందుకన్నావంటే మరి కావాలన్నమాటేగా!"
"ఆడవాళ్ళందర్నీ కాచి వడపోసి గొప్ప మాటే చెప్పారు కవిగారు"
"కవిగారి సంగతి మనకెందుకు కాని 'బాహుబలి' ఎల్లుండి రిలీజ్ అవుతోందిట. వెళ్దామా?"
"వెళ్దాం. టికెట్స్ దొరుకుతాయా?
"నీకెందుకు నేను తీసుకొస్తాగా. అయితే ఒక షరతు" 
"ఏమిటో..." 
"ఏముంది పేరు పెట్టి పిలవడం."
"మీరింకా మర్చిపోలేదా?"
"లేదు" 
"ఓ విషయం చెప్పనా?"
"చెప్పొద్దు."  
"ఇప్పుడూ..." 
"ఇప్పుడూ లేదు అప్పుడూ లేదు. ఎప్పుడైనా సరే పేరు పెట్టి పిలవాల్సిందే"
"అబ్బ నన్ను కొంచెం చెప్పనిస్తారా?"
"నివ్వను."  
"అది కాదండీ."
"ఏది కాదండీ." 

"పేరుతో పిలవడానికేం అభ్యంతరం లేదు. కాకపోతే...ఈ ప్రపంచంలో ఒకే ఒక్క పేరు....అదీ నాలుగక్షరాల కలయిక మాత్రమే. ఆ పేరు పలకడానికి ఏదో సిగ్గు, బిడియం. తెలియని భావాలేవో ఎదలో మెదులుతుంటే తొలిసారి మిమ్మల్ని యేమని పిలిచానో జీవితాంతం అలానే పిలవాలనిపిస్తుంది. ఆ రోజు మన మధ్య మొదలైన స్నేహానికి గుర్తుగా అనుక్షణం హృదయ సీమలో విహరించే అక్షరాలను పెదవి దాటనీయక పదిలంగా దాచుకోవాలనీ, ఆ అనుభూతిని అలాగే నిలుపుకోవలనీ అనిపిస్తుంది. లేదూ కాదూ పేరుతోనే పిలవాలంటే మీ ఇష్టం"

*                       *                       *                        *          

ఏమండోయ్ మిమ్మల్నే. ఐదున్నరౌతోంది ఇక బయలుదేరదామా?
ఇదుగో వచ్చేస్తున్నా. కారు తాళాలు తీసుకో!


Monday, April 13, 2015

పాఠశాల ఆరవ వార్షికోత్సవం

         పాఠశాల ఆరవ వార్షికోత్సవం శ్రీ మన్మథ నామ సంవత్సర ఉగాది నాడు కమ్యూనిటీ హౌస్ మిడిల్ స్కూల్లో జరిగింది. పోయినేడాది కూడా ఇక్కడే జరిగింది కాని, అప్పుడు పాఠశాలలో యాభై మూడు మంది విద్యార్ధులు, పదకొండు మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఏడాది నూటనాలుగు మంది విద్యార్ధులు, పంతొమ్మిది మంది ఉపాధ్యాయులు. అంటే సగటున ప్రతి ఐదుగురు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయులున్నారన్నమాట. ఇది పాఠశాల విద్యార్ధులు చేసుకున్న అదృష్టం. 
ఉపాధ్యాయులు 
వేలూరి రాధ, సూరే మంజుల, వాడకట్టు శైలజ, కింతలి అనురాధ ఉపాధ్యాయులుగానే కాక పాఠశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. 


        పడాల ఉష, మారోజు కవిత, సుంకే జ్యోతి, చెట్టా రమేష్, భైరి ఈశ్వరి, మేడికయాల లక్ష్మి, సూర్యదేవర హరిత, 
గుమ్మడి సుధ, మల్లాది శశికాంత్, బులుసు పద్మ, కాకాని లక్ష్మి, పాండవ రోహిణి, రామడుగు మాధురి, గండ్లూరి భాను ప్రకాష్ ఈ ఏడాది కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు.  ఏ పని చేయడానికి వాలంటీర్లు ఎవరూ ముందుకు రావడంలేదని వింటుంటాం. 


వచ్చినా వారు నిబద్దతతో పనిచెయ్యరని అపోహ. అలాంటిది ఏడాది పొడవునా ప్రతివారం ఓ సమయానికి కట్టుబడి పాఠాలు చెప్తున్న  ఈ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. 


వీరు పాఠాలు చెప్పడమే కాదండి, పాఠశాల తరగతులను తమ ఇంట్లోనే  నిర్వహించడానికి సహృదయంతో ముందుకు వచ్చారు. ఒంట్లో బాగాలేని రోజులుంటాయి, ఆఫీసులో ఒత్తిడి, పిల్లలకు బాగా లేకపోవడం, చుట్టాలతో బిజీగా ఉన్న సందర్భాలు... ఇలా ఎన్నో ఉంటాయి.
సంవత్సరం మొదట్లో రూపొందించిన కాలెండర్ ప్రకారం ప్రతి వారం తరగతి నడిపే ఉపాధ్యాయులకు ఏమిచ్చినా ఋణం తీరదు. పైగా విద్యార్ధులు హోం వర్క్ చేయకపోయినా, ఎవరైనా కొంచెం వెనకబడుతూ ఉన్నా “ఆ పిల్లాడు చాలా బాగా చేస్తాడండి. ఇంట్లో వాణ్ని కూర్చోబెట్టి వాడేం చేస్తున్నాడో కొంచెం చూసేవాళ్ళుంటే బావుణ్ణు” అంటూ విద్యార్ధుల గురించి వీళ్ళు బాధపడి పోతారు. 

       ఇందులో ఆరుగురు టీచర్ల పిల్లలు పాఠశాల విద్యార్ధులు కారు.

అయినప్పటికీ వారు మాతృభాష మీద అభిమానంతో పాఠాలు చెప్పడానికి ముందుకు వచ్చారు. కొంత పని చేసి ఎంతో ప్రతిఫలం ఆశించే ఈ రోజుల్లో నిస్వార్ధంగా ఇంత సహాయం చేస్తున్న ఉపాధ్యాయులకు ఏడాదికి ఒక్క రోజు భోజనం పెట్టి తమ సంతోషం మేరకు వాళ్ళను సత్కరించాలనే తల్లిదండ్రుల ఆలోచనతో ఈ వార్షికోత్సవం. 

మా ఆహ్వానాన్ని మన్నించి విద్యార్ధులను ఆశీర్వదించడానికి డొక్కా ఫణి కుమార్ గారు రావడం ఓ విశేషం.
       ఈ ఏడాది మరో విశేషం పాఠశాల కొలంబియా, సౌత్ కేరోలినాలో మొదలవడం. ప్రముఖ కవి విన్నకోట రవిశంకర్ గారు, విద్యాసాగర్ గారు ఉపాధ్యాయులు. వారికి తమ ప్రోత్సాహం అందిస్తున్న వారు కొలంబియా తెలుగు అసోసియేషన్ అద్యక్షులు కడాలి సత్య గారు. 
కొలంబియా పాఠశాల బృందం 

ఎంతో మంది, ఎన్నో రోజుల కృషి ఫలితం ఈ వార్షికోత్సవం. తెర వెనుక
వుండి అహర్నిశలూ కష్టపడిన వారిని ఇప్పుడు పరిచయం చేస్తాను. 



వార్షికోత్సవ బాధ్యతలు భుజాన వేసికొని ఈ కార్యక్రమాన్ని నడిపించిన సమన్వయకర్త డోకి శ్రీనివాస్ గారు. ప్రణాళికా బద్దంగా ప్రతిపనికి 
ఓ సమయాన్ని కేటాయించి, వారానికో సమావేశం ఏర్పాటుచేసి, ప్రతి చిన్న విషయాన్నీ వివరంగా పరిశీలిస్తూ సమర్ధవంతంగా నిర్వహించారు.

       

విద్యార్ధుల కార్యక్రమాల గురించి ఉపాధ్యాయులతో మాట్లాడుతూ వారి సాధక బాధకాలను పరిశీలిస్తూ, అవసరం మేరకు సలహాలు సూచినలు ఇచ్చి వేలూరి రాధ గారు కష్టతరమైన కార్యాన్ని ఎంతో ఇష్టంగా నిర్వహించి దిగ్విజయంగా పూర్తి చేశారు. 

ఈ కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించడం దగ్గర నుండి ఇప్పటి వరకు కీలక పాత్ర పోషిస్తున్నవారు సూరె మంజుల గారు. ఈ కార్యక్రమానికి నిర్వాహక బాధ్యత తీసుకుని కూడా కొత్తవారిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో వెనుకనే ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించారు.

ఒక కార్యక్రమం నిర్వహించాలంటే స్పీకర్లు, మైకులు, పాలు,
నీళ్ళు లెక్కలు, అప్పులు, వసూళ్ళు, వగైరా, వగైరా, వగైరా. ఈ హరైనా అంతా పడుతూ డాలర్ అడిగితే “క్వార్టర్ తో సర్దుకుందురూ” అంటూ కోత వేసి చాలా పొదుపుగా ఈ కార్యక్రమాన్ని బడ్జెట్ ప్రకారం నడిపిన వారు దేవినేని నీలిమ గారు. ఈవిడ ఫుడ్ కమిటీ లో కూడా ఉన్నారు. అక్కడ మాత్రం ఈవిడ అన్నపూర్ణే. నాలుగు ట్రేలు సరిపోతాయంటే “లేదండీ... ఆరైతే బెటర్” అంటూ వంటలన్నీ ఘనంగా వండించారు. 


       పాఠశాల తరగతుల నిర్వహణ కోసం తమ ఇంటిని వాడుకోమని
సహృదయంతో ముందుకొచ్చి సహాయం చేసిన వారు ముందుకు వచ్చినవారు మొగిలి షర్మిల గారు. అంతేకాదండి ఎప్పుడు ఉపాధ్యాయులకు ఇబ్బంది వచ్చినా ఆ తరగతిని నడపడానికి సహాయం చేశారు. తమ పిల్లలు పాఠశాల విద్యార్ధులు కానప్పటికీ మీకెప్పుడు అవసరమైనా నేనున్నానంటూ ఉపాధ్యాయులకు సహాయపడినవారు గుడితి వేణి గారు.                                                                                                            
తెలుగులో ప్రశంసా పత్రాలు తాయారు చేయడమే కాక, జ్ఞాపికల మీద కూడా తెలుగులోనే పేర్లు వ్రాయించి తెప్పించిన వారు వర్ధినేని వెంకట్ గారు. 

ఈ వార్షికోత్సవం జరుపుకోవడానికి మనకు వేదిక సమకూర్చిన వారు గొట్టిపర్తి వెంకట్ గారు. కేవలం ఒక్క గంటలో వేదిక అలంకరణ పూర్తి చేసి కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికి మొదలయ్యేలా సహకరించిన వారు వాడకట్టు శైలజ గారు, వాడకట్టు సునీల్ గారు, పడాల సూర్య గారు, వేమూరి సత్య గారు, పుల్లేటి కల్యాణి గారు. 
ఎప్పుడు కొన్నారో ఎలా జాగ్రత్త చేసారో కానీ మనకు తాజా రోజాలను అందించిన వారు. అంబటి సరిత గారు, కింతలి అనురాధ.


వచ్చవాయ్ రామ్ కుమార్ ఈ కార్యక్రమానికి వీడియోలు తీయడమే వెంటనే యూ ట్యూబ్ లో పెట్టేశారు కూడా. ఆ వీడియోలను ఇక్కడ చూడొచ్చు. 

కార్యక్రమం మొదటినుండి ఓపిగ్గా ఫోటోలు తీస్తున్నారు ఫణి కుమార్ గారు, మల్లాది శశికాంత్ గారు. ఫణి కుమార్ గారు తీసిన ఫోటోలను ఇక్కడ, శశికాంత్ గారు తీసిన ఫోటోలను ఇక్కడ చూడొచ్చు. 

శశికాంత్ ఉపాధ్యాయులు కూడా. ఫణి కుమార్ గారి శ్రీమతి ఈశ్వరి పాఠశాల ఉపాధ్యాయులు. వీరు కూడా అవసరమైనప్పుడు తరగతి నిర్వహణలో సహాయం చేస్తుంటారు. 


కార్యక్రమమైన విజయవంతం అవడానికి అతిముఖ్యమైనవి. స్పీకర్లు, మైకులు. వాటిని తీసుకొచ్చి అమర్చి వాటి బాగోగులు చూస్తున్న వారు సుంకర శశికాంత్ గారు. 


తమ సరదా సంభాషణలతో సమర్ధవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యాఖ్యాత పారుపూడి ఉష గారు.


కార్యక్రమానికి ఎంత మంది హాజరవుతారో చూసి అందరికీ సరిపడా భోజనం

తరయ్యేలా చూడడం శ్రమ కంటే వత్తిడితో కూడకున్న పని. వంటలు, వడ్డనల ఏర్పాట్లు చూస్తున్న వారు పుల్లేటి కళ్యాణి, పండ లక్షి, కుంట రంజని, దేవినేని నీలిమ. 

చదవలవాడ రాజా గారు, వేమూరి సత్య గారు అవసరమైన ప్రతి దగ్గర మేమున్నామంటూ ముందుకు వచ్చి అన్ని పనులూ సవ్యంగా జరిగేలా చూశారు.

ఈ వార్షికోత్సవంలో తమ ప్రజ్ఞా పాటవాలతో మనల్ని అలరించిన విద్యార్ధులకు అభినందనలు. వారికి ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులు ధన్యవాదాలు.


అచ్చతెలుగుపేర్లతో తయారయిన జ్ఞాపికలు 



ఒకటవ తరగతి 



ఒకటవ తరగతి 


ఒకటవ తరగతి 

ఒకటవ తరగతి 
ఒకటవ తరగతి 



మూడవ తరగతి విద్యార్ధులు 



పూర్వ విద్యార్ధులు 


రామ లక్ష్మణులు 


ప్రజ్ఞా పత్రాలు, జ్ఞాపికలు అందుకుంటున్న రెండవ తరగతి విద్యార్ధులు 



రామ రావణ యుద్ధం 


సింహము, కుందేలు కథ చెప్తున్న విద్యార్ధులు 


శ్రీ రామ విజయం నాటిక వేసిన నాలుగవ తరగతి విద్యార్ధులు 


సోది 

బుఱ్ఱ కథ 

ఉగాది పచ్చడి 


తల్లిదండ్రులు తమ స్వహస్తాలతో తయారుచేసిన విందు భోజనం 
తాంబూలాలు  


పాఠశాల వైభవాన్ని తమ దర్పణంలో ప్రతిబింబించిన ఐడియల్ బ్రెయిన్ , ఆంద్ర ప్రభ, అంతర్జాతీయ తెలుగు వార్తా వేదిక, తెలుగు కమ్యూనిటీ న్యూస్, తెలుగు టైమ్స్ పత్రికలన్నింటికీ ధన్యవాదాలు.

ఒక సంస్థ అభివుద్ది వైపు అడుగులు వేయాలంటే ఒక వ్యక్తి కాదు ఓ వ్యవస్థ కావాలన్న నిజాన్ని గ్రహించి నడుం కట్టి ముందుకొచ్చి వార్షికోత్సవాన్ని విజయపంథాలో నడిపించిన కార్యనిర్వాహకులందరికీ అభినందనలు.





Monday, March 16, 2015

సందడే సందడి

“ఏమిటంత అలసటగా వున్నావ్?” వాడిపోయిన తంతి మొహం చూస్తూ అడిగింది విద్య. నాకూ విద్యాలయానికీ రోజుకోసారైనా కలసి కబుర్లు చెప్పుకోకపోతే తోచదు. ఈ వేళ పాఠశాల 'మెయిల్' కూడా మాతో కలసింది.

“ఏం చెప్పమంటావ్ శర్కరీ, ఆ టీచర్లేవో "ఈ వారం ఈ పాఠం చెప్పాం, ఇదిగో ఈ కొత్త పద్యం నేర్పించాం." అంటూ అడపాదడపా ఓ కబురు పంపిస్తుండేవాళ్ళు. తీరగ్గా హాయిగా ఉండేది. ఇదిగో ఇప్పుడీ వార్షికోత్సవం వస్తోందిగా, పగలూ రాత్రీ తీరక లేదంటే నమ్ము” మొరపెట్టుకుంది తంతి. 

“అవున్లే, మరి వార్షికోత్సవం అంటే బోలెడు పనులుంటాయిగా!” సానుభూతి చూపించింది విద్య.

“అయితే నీకేమిటి? నువ్వేమన్నా దానికోసం ఊరూ, వాడా తిరిగి పన్లు చేస్తున్నావా?” ఆశ్చర్యంగా అడిగాను.

“నీకేం తెలీదు శర్కరీ. వార్షికోత్సవానికి బోలెడుమంది కార్యకర్తలు కమీటీలుగా ఏర్పడి పని చేస్తారు. భోజనం ఏర్పాట్లకో కమిటీ, జ్ఞాపికల తయారీకో కమిటీ, అలంకరణకొకటి, ఆహ్వానాలకొకటి, ఫోటోలకొకటి, వీడియోలకొకటి, ఇలా చాలా చాలా ఉంటాయి” వివరించింది విద్య.

“అయితే?”

“అయితే ఏమిటీ వాళ్ళందరూ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎవరో ఒకరు అది కావాలనో ఇది కావాలనో ఓ కబురు పంపడం, దానికి మరొకరు వెంటనే సమాధానం చెప్పడం.”

“అవన్నీ నీక్కూడా చెప్తారా?” సందేహంగా అడిగాను.

“ఆవన్నీ నా ద్వారానేగా మరీ. ఫుడ్ కమిటీ గురించి చెప్తా విను. "ఇదిగోనండి వార్షికోత్సవానికి నాలుగొందల మంది వస్తున్నారు, మనం వంటలవీ ఇంట్లోనే చేద్దాం, ఇవి ఇవి చేస్తే బావుంటుంది. ఇందులో మీరేం చేస్తారు? అని అడిగారు." దానికి పులిహోర చేస్తామని కొందరు, దద్దోజనమని కొందరు, గొంగోర పచ్చడిని, బంగాళ దుంప కుర్మా అని ఇలా ఒకటేమిటి బోలెడు మంది అవీ ఇవీ చేస్తామని ఉత్సాహంగా ముందుకు వచ్చారు”

“అబ్బో భలేగా ఉందే! ఈ జ్యోతసలే నాకేమీ చేసి పెట్టదు. అప్పుడెప్పుడో ఓ మూడేళ్ళ క్రితం చెక్కలు, ఆ తరువాతేదో గులాబ్ జామున్ తప్ప మరేమీ రుచి చూసి ఎరగను. నువ్వా పేర్లు చెప్తుంటేనే నూరూరిపోతోంది.”

"అవునూ...వార్షికోవత్సవానికి ఈ వంటలవీ ఎందుకు?" సందేహం వ్యక్తపరిచాను.

ఎందుకంటే మధ్యాహ్నం రెండుగంటలకల్లా ఆడిటోరియం దగ్గరకు వస్తారందరూ, నాలుగు గంటలకు కార్యక్రమాలు మొదలవుతాయి. సాయంత్రం ఏడు గంటలకు అందరూ అక్కడే భోజనాలు చేస్తారు.  

"ఓ భలే ఉందే. ఇంకా" చెప్పమన్నట్లుగా చూసింది విద్య.

"పాఠశాల విద్యార్ధులను అభినందిస్తూ వారికి ప్రజ్ఞా పత్రాలు, జ్ఞాపికలు అందజేసే ఉత్సవాన్ని మీరెల్లరూ కనులారా తిలకించి చందన తాంబూలాలు స్వీకరించ ప్రార్ధన." అంటూ తల్లిదండ్రులనూ పెద్దలనూ ఆహ్వానించారు.

“ఇంకా ఏమేం కార్యక్రమాలున్నాయో అవీ చెప్పు” ఉత్సాహంగా అడిగింది విద్య.

"పాటలు, పద్యాలు, నాటికలూ, బుఱ్ఱ కథ, సోది .."

"ఏమిటేమిటీ బుఱ్ఱ కథ సోదీనా" సంబర పడింది విద్య.

"బుఱ్ఱ కథ స్క్రిప్ట్ ఎంత బావుందనుకున్నావు?" మరింత ఊరించింది తంతి.

"మరివన్నీ తెలుగురాని ఆ పిల్లలతో చేయించాలంటే బోలెడు శ్రమ కదూ!" అడిగాను.

"చిన్నగా అంటున్నారా? ఆ టీచర్లు మీ పిల్లలకీ డైలాగులు నేర్పించండి, ఈ పాటలు ఈ ట్యూన్ లో పాడించండి, మీరు ఇంటి దగ్గర చెప్పిస్తే స్పష్టంగా చెప్పగాలగుతారు. అని తల్లిదండ్రులతో ఎంతో ఇదిగా చెప్తున్నారు."

"నిజమేలే పాపం టీచర్లకా మాత్రం తాపత్రయం ఉంటుందిగా. అవన్నీ చక్కగా చేస్తే వాళ్ళ విద్యార్ధులను బోలెడు మంది మెచ్చుకుంటారని, ఆ ఉత్సాహంతో ఆ పిల్లలు ఎంతో ఇష్టంగా తెలుగు నేర్చుకుంటారనీ వీళ్ళా శ్రమ తీసుకోవడం". వివరించింది విద్య. 

"మరో విషయం చెప్తా వినూ! పిల్లలు చెప్పిన పద్యాలు, పాటలు, తెలుగులో సరదాగా మాట్లాడిన వీడియో పంపమని అడుగుతున్నారు.  

"ఎందుకవన్నీ?" ఆశ్చర్యంగా అడిగాను.

"వాటితో సరదాగా వీడియో చేసి అందరికీ చూపిస్తారట" ఎంతో ఇష్టంగా చెప్పిందా మాట.

“వీటన్నింటిలో పాలుపంచుకోవడానికి అదృష్టం ఉండాలి” మనస్ఫూర్తిగా అన్నానా మాట. ఏ కార్యక్రమమైన జరిగేది ఓ రెండు గంటలు లేదా ఒక పూట మాత్రమే. అదీ బోలెడు హడావిడిగా జరిగిపోతుంది. ముందుగా నలుగురు కలసి సంతోషంగా చేసుకునే ఏర్పాట్లలోనే ఉంటుంది సరదా అంతానూ. అప్పటికి తంతి మూడ్ మారినట్లుంది. ఇక ఇక్కడి నుండి ఉత్సాహంగా చెప్పడం మొదలెట్టింది.
“ఇంకా వినూ. జ్ఞాపికలేవో అచ్చేయిస్తారట. వాటికి అచ్చ తెలుగులో పేర్లు వ్రాసి పంపించాలట" అంటూ పకాపకా నవ్వింది.

"అందులో అంత నవ్వాల్సిందేముంది?" అడిగింది విద్య.

“మా క్లాసులో కొన్ని ఇంటి పేర్లు తప్పుగా పడ్డాయి, బరాటం కి బారతం, తేళ్ళ బదులు తెల్ల, వడమాలకు బదులు వాదముల అని పడింది. అని ఓ టీచర్ చెప్పారు." వస్తున్న నవ్వు ఆపుకుని చెప్పింది.

“ఇంకా?” నాకా కబుర్లు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి.

“మాకు తోకలు కావాలని ఓ టీచర్..." అంటూ ఫక్కున నవ్వింది తంతి.

"ఎందుకట?" తనూ నవ్వింది విద్య.

"వాళ్ళ తరగతి విద్యార్ధులు అడవి జంతువుల వేషాలు వేస్తున్నారట”

"ఉపాధ్యాయుల సంగతి సరే మరి కార్యకర్తలు ఏం చేస్తున్నారు?" గతస్మృతులేవో గుర్తొచ్చినట్లున్నాయి విద్యకి.

“వారానికో మీటింగ్ పెట్టి "ఎవరే పని చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు?" అంటూ ఒకటే ప్రశ్నలు. దానికేదో సమాధానమొస్తుంది. వెంటనే "మీకేమన్నా సహాయం కావాలంటే మేం చేస్తామంటూ" మరొకరు చటుక్కున ముందుకొస్తారు”

"కొంతమంది కార్యకర్తలయితే రెండు మూడు కమిటీలలో కూడా పనిచేస్తున్నారు"

"అవునా?"
"అప్పుడెప్పుడో శ్రీరామ నవమికి పందిళ్ళు వేసి వూరు ఊరంతా సందడి చేసేవారు చూడండి. అలా వీరు ఈ ఉగాదికి అంతా ఒక కుటుంబంలా కలసిపోయి ఏర్పాట్లు చేసుకుంటున్నారు."
"వాళ్ళ పేర్లూ అవీ చెప్పకూడదా?" ఆసక్తిగా అడిగాను.

"వార్షికోత్సవమయ్యాక ఆ విశేషాలన్నీ నాకు తెలుస్తాయి. అప్పుడు నీకూ చెప్తాలే" అంటూ వెళ్ళడానికి తయారయింది విద్య.

"అక్కడ నాకోసం ఏమేమి కబుర్లు ఎదురుచూస్తున్నాయో! నేనూ వస్తాను" అంటూ లేచింది తంతి.

"అవునా ఆ ఫోటోలు, వీడియోలవీ తీసుకుని త్వరలో మీరిటు రావాలి మరి" అంటూ వీడ్కోలు పలికాను.