Thursday, April 30, 2020

కౌముది పత్రికలో నా కవిత 'పరీక్ష'

'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రికలో నాకవిత 'పరీక్ష' ప్రచురితమైంది. 

ఈ కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.



Tuesday, April 14, 2020

సంయమనం

"కరోనా సమయంలో ప్రయాణం అంటూ రాశావు. ఆ తరువాత చడీ చప్పుడూ లేదు. అంతా బాగేనా?" అంటూ మిత్రులు పలకరించారు. మీ అభిమానానికి ధన్యవాదాలు. మేమంతా బావున్నాము. మొదటి రెండు వారాలు 'మీకు మీరే మాకు మేమే' అనుకుంటూ ఎవరి గదుల్లో వాళ్ళం తలుపులు వేసుకుని ఉన్నా ఆ తరువాత అంతా మామూలే. బయలుదేరేప్పుడు మరీ హడావిడి చేస్తున్నామేమో అనిపించింది కానీ రెండు రోజుల్లోనే అలా వచ్చేసి చాలా మంచి పని చేశామని అర్థం అయింది.

ఇక ఇక్కడ అమెరికాలో పరిస్థితి ఎలా ఉందంటే యూనివర్సిటీలకు వెళ్ళిన పిల్లలంతా మార్చ్ మొదటి వారంలోనే ఇళ్ళకు వచ్చేశారు. వారికి రోజూ ఆన్లైన్ లో తరగతులు జరుగుతున్నాయి, ఆన్లైన్ ట్యూటరింగ్ కూడా ఉంది. హైస్కూల్, మిడిల్ స్కూల్ పిల్లలు కూడా బళ్ళకు వెళ్ళడం లేదు. హైస్కూల్ విద్యార్ధులకు కూడా రోజూ ఆన్లైన్ లో తరగతులు జరుగుతున్నాయి. మిడిల్ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు హోమ్ వర్క్ మాత్రం పంపుతున్నారు. కొందరు టీచర్లు ప్రతి తరగతికీ ఓ అరగంటో గంటో విద్యార్ధుల సందేహాలు తీర్చడానికి కేటాయించారట. ఐటి ఉద్యోగులందరూ దాదాపుగా ఇంటి దగ్గరనుండే పనిచేస్తున్నారు. బండి నడుస్తూనే ఉంది, దారి మరిందంతే.

ఇక ఇళ్ళల్లో ఇడ్లీ, పులిహోర, పొంగళ్ళతో పాటు సూప్స్, సలాడ్స్, స్టిర్ ఫ్రైయ్స్ కూడా తయారవుతున్నాయి. వంటగది ఆధిపత్యాన్ని వదులుకున్న వారి ఇంటిలో తినే వాళ్ళూ, వండే వాళ్ళు సరిసమానం. సరుకులన్నీ ఆర్డర్స్ పెట్టి తెప్పించుకునే సౌకర్యం కల్పించారు, కర్బ్ సైడ్ పిక్ అప్ కూడా ఉంది. అంటే ముందే ఆర్డర్ పెట్టిన సరుకులు షాప్ దగ్గరకు వెళ్ళగనే బయటే కార్ ట్రంక్ లో లోడ్ చేస్తారన్నమాట. కారు దిగవలసిన పని కూడా లేదు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఈ వసతి లేదట. మైయిల్ ప్రతిరోజూ వస్తోంది. చెత్త వారానికోసారి అంతకు ముందులానే తీసుకువెళ్తున్నారు.

రోజు వారీ పనులు చేసుకుని బ్రతికే వాళ్ళకు, ఇల్లు వాకిలీ లేని వారికి గవర్నమెంట్, చారిటీ ఆర్గనైజేషన్స్, ఇంకా చేయగలిగిన వాళ్ళు చేతనైన సహాయం చేస్తున్నారు. ప్రధాన రహదారులలో ఉదయం, సాయంత్రం రోడ్ మీద ట్రాఫిక్ కొంచెం ఉంటోంది. బహుశ లాండ్ స్కేప్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, హెల్త్ కేర్ డిపార్ట్ మెంట్ వాళ్ళు, ఇంకా గ్రాసరీస్, రెస్టారెంట్ లో పనిచేస్తున్న వాళ్ళు, డెలివరీ ఇస్తున్న వాళ్ళు అయివుండవచ్చు. రెస్టారెంట్స్ లో 'డైన ఇన్' తీసేసి, 'టు గో' ఇస్తున్నారు. అన్ని షాపులూ కూడా పనివేళలను బాగా కుదించి వేశాయి.

మా ఇంటి వెనుకే ఉన్న చిన్న రోడ్డు మీద అప్పుడో కారు ఇప్పుడో కారు వెళ్తున్నట్లుగా శబ్దాలు వినపడతూ ఉన్నాయి. ఇక ఇంటి ముందు వసారాలోకి వెళితే సాయంత్రాలు ఒకరో ఇద్దరో నడుస్తూ కనిపిస్తున్నారు. అంతకు ముందు సాయంత్రం నాలుగైతే చాలు "చిల్డ్రన్ ఎట్ ప్లే" అనే బోర్డ్ రోడ్డుకు ఆ చివరా ఈ చివరా అడ్డంగా పెట్టి బోలెడు మంది పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళ లాన్ లలో కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అటూ ఇటూ పరిగెడుతూ పిల్లలు ఆడుతూ ఉండేవాళ్లు. పిల్లలంతా ప్రస్తుతం పేపర్లను మడతలు పెట్టి, కత్తెర్లతో వైనంగా కత్తిరించి ఏ ఏనుగు బొమ్మనో, బాతు బొమ్మనో చేస్తూ ఉండి ఉంటారు. లేదా గిన్నెల్లో నీళ్ళు పోసి రంగులు కలిపి పేపర్ మీద యే బొమ్మకో రంగులు వేస్తూ ఉండి ఉంటారు. ఇక బోర్డ్ గేమ్స్, టీవి లాంటివి ఉండనే ఉన్నాయి. అన్నట్లు పిల్లలకు పుస్తకాలు ఉచితంగా చదువుకునే సదుపాయం కూడా కల్పించారు, చక్కగా ఐపాడ్ లో చదువుకుంటూ ఉండి ఉంటారు. అయినా బయటకు వెళ్ళి ఆడుకోలేక పోవడం వారికి చాలా ఇబ్బందిగానే ఉండి ఉంటుంది. 

ఉదయం పక్షుల కలకలం షరా మామూలే. కిలకిలారావాలు ఏమీ ఆపలేదు, సూర్యోదయం కాకముందే రివ్వున ఎగరిపోవడమూ మానలేదు. "అయినా మనం కదా దేనికీ టైమే లేదు, ట్రాఫిక్ లో సోషల్ గాదరింగ్స్ లో టైమంతా పోతోందని గొడవ పెట్టింది. ఇప్పడవేవీ లేవు ఏమి కావాలనుకుంటే అవి చేసుకునే టైమ్ అంతా మనదే". ఈ మాటలు నేనలేదు, సిస్టర్ శివాని చెప్పారు. ఊరికే మధన పడుతూ ఉంటే నెగటివ్ ఎనర్జీ పెంచుతామట. దొరికిన ఈ సమయంలో ఏం చెయ్యాలో ఆవిడ చక్కగా చెప్పారు. ఒకవేళ కుదరలేదనుకోండి కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఇదే మంచి తరుణం.

హైస్కూల్ పూర్తవగానే పిల్లలు కాలేజీలకు వెళ్ళిపోతున్నారు, సెలవలకు వచ్చినా చుట్టం చూపుగానే అని కదా వాపోతుంటాం. ఆ సందర్భంగానే అప్పుడెప్పుడో "ఎడబాటు" అనే కవిత రాశాను. ఇప్పుడు మన పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారు. ఇంటి నుండి వెళ్ళిన తరువాత వారు చేసిన ప్రయాణంలో ఎన్నో అనుభవాలు అనుభూతులూ స్వంతం చేసుకున్న యువతీ యువకులు వాళ్ళు. కాస్త సావకాశంగా వింటే కథలూ కబుర్లూ వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. వారి నుండి చాలా విషయాలు తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఆ మాత్రం మనకు తెలీదా అనుకోకండి మనకు నిజంగానే తెలీదు. ఎందుకంటే మనం ఎందుకు ఏమిటీ అని ప్రశ్నించకుండా కథలూ కబుర్లూ విన్నాం కదా! ఇప్పటి పిల్లలు అలా కాదు ఈ కథ లో చిన్న పిల్లవాడు కూడా ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే తీరూ, ఆ అలోచనా ధోరిణి గమనించండి.

రేపెలా ఉంటుందో తెలియదు. గడచిన ఇన్నేళ్ళలో మనమూ, మన కుటుంబమూ ఎన్నో సమస్యలను ఎదుర్కున్నాం. ఈ సమస్య కూడా అంతే, తీవ్రత ఎంతైనా మనందరం కలసికట్టుగా ఎదుర్కుంటాం. అంతవరకూ సంయమనం పాటిస్తూ సాంఘిక ప్రసార మధ్యమాలలో తెలిసీ తెలియని వార్తలు, వ్యాఖ్యలు, భయాందోళనలను కలిగించే వార్తలను ప్రచారం చేయకుండా ఉండడం ప్రస్తుతం మనం చేయవసింది.