Wednesday, October 12, 2016

ఈ ఏడు రోజులూ...

          ఒక్కోసారి అనుకోకుండా ఏవో జరిగిపోతూ ఉంటాయి. అలాంటివేవో కొన్ని గొప్ప అనుభూతిని ఇచ్చి ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అలాంటిదే ప్రస్తుతం నాకనుభవమైంది. నిజం చెప్పొద్దూ! నాకు భగవంతునిపై భక్తి ఉంది కాని. ఈ పూజలూ, నామ సంకీర్తనల మీద బొత్తిగా నమ్మకం లేదు. అందుకు కారణం అవి నిత్యం చేస్తూ కూడా ప్రవర్తనలో ఎటువంటి స్వచ్చత లేనటువంటి వారిని చూసి ఏర్పరచుకున్న తేలిక భావం. అది పూర్తిగా నా అజ్ఞానమే అని ఇప్పుడర్థం అయింది. సిద్దాంతాలు పాటించే వారికి నేనూహించిన పరిణితి లేదని సిద్ధాంతమే తప్పనుకోవడం అజ్ఞానమే కదండీ. నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానానికి తోడు ఎక్కడ ఏది చదివితే అది నిజం అనుకున్న అపోహా కూడా తోడయ్యింది.

        ఇంతకూ ఈ ఉపోద్ఘాతానికి కారణం ఏమిటంటే భాగవత సప్తాహం వినే అవకాశం లభించింది. వేదవ్యాసుల వారు, ఋషి పుంగవులు, శుక మహర్షుల వారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, శ్రీ రామ చంద్రుల వారు, శ్రీ కృష్ణ పరమాత్మ... వీరందరినీ దర్శించే భాగ్యం కలిగింది. అది ఎలా ఏమిటీ అని చెప్పాలంటే చాలా కథే ఉంది. క్లుప్తంగా శ్రీ తిరుప్పావై కోకిల మంజుల శ్రీ గారు ఈ నవరాత్రులలో మాకా భాగ్యాన్ని కలిగించారు. 

        ఏదో మా కమ్యూనిటీలో ఏర్పాటు చేస్తున్నారు. పైగా ఆర్గనైజర్స్ అంతా బాగా కావలసిన వారు వెళ్ళకపోతే బావుండదు ఒక్కసారి విందాం అనుకుంటూ మొదటి రోజు వెళ్ళిన దాన్ని తరువాత రోజుల్లో సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఆత్రుతగా ఎదురు చూశాను. వేదసారాన్ని, ఉపనిషత్తులలోని అంశాలను, భాగవతాన్ని విన్న తరువాత వాటి గురించి ఎంతో తెలుసుకోవాలన్న జిజ్ఞాస మొదలైంది.

       నేను విన్నదేదో మీకు చెప్పాలనే ఉత్సాహంతో రాయడం మొదలుపెట్టాను కాని, సత్యం మాత్రం నేను మరచిపోకుండా ఉండడం కోసం రాసుకుంటున్నవివి.

మొదటి రోజు:
  • వేదం ఇలా ఉండాలని శాసించి చెప్తోంది. ఇతిహాసాలు ఎలా ఉంటే బావుంటుందో ఉదాహరణలతో వివరించి చెప్తున్నాయి. 
  • ఉపనిషత్తులు ఆత్మ, పరమాత్మల మధ్య సంబంధాన్ని పిట్టకథల రూపంలో వివరిస్తున్నాయి.
  • తపస్సు చేత కృత యుగంలో, యజ్ఞ యాగాదుల వలన త్రేతా యుగంలో, పూజాధికాల వలన ద్వాపర యుగంలో వచ్చే ఫలితం, కలి యుగంలో భగవన్నామ స్మరణతో సాధ్యమౌతుంది. నామస్మరణ చేయడమంటే కేవలం పెదవులతో కాక హృదయంలో భగవంతుని నింపుకుని చేయాలి. 
  • కాలానుగుణంగా ధర్మం మారుతుంది కాని సత్యం శాశ్వతమైనది.
  • కలి స్థానాలు: జూదశాల, పానశాల, విశృంఖల భావాలు కలిగిన కామము, జీవ హింస, అక్రమార్జితము.
రెండవ రోజు
  • పంచభూతాలు మానవ శరీరం మీద ప్రభావితం చూపిస్తాయి.
  • జ్ఞానేంద్రియాలు: చక్షువు, శ్రవణేంద్రియం, ఘ్రాణేంద్రియము, రసనేంద్రియం, స్పర్శే౦ద్రియం. శ్రవణం అన్నింటికంటే ప్రధానమైన ఇంద్రియం. కర్మేంద్రియాలు: కాళ్ళు, చేతులు, మాట్లాడే నాలుక, మల, మూత్ర ద్వారాలు. 
  • ఇంద్రియాలు సుఖానిస్తున్నాయని అనిపిస్తూనే ఉంటుంది కాని అవి దుఃఖానికి కారణాలు. బుద్దితో ఇంద్రియ నిగ్రహం సాధించగలం. మహర్షికి, మనిషికి ఉన్న తేడా ఇంద్రియ నిగ్రహం.
  • మనుషులుగా చేయవలసిన ఉత్తమ క్రియ దానం. 
  • పుణ్యకార్యముల వలన, పరమాత్మ యొక్క నామస్మరణ వలన సంచితములు, ఆగామి కర్మలు తొలగిపోతాయి. పారబ్దకర్మలు మాత్రం అనుభవించి తీరవలసినదే. 
  • పరమాత్మ  అవతారములు ఇరవై ఒకటి. 
మూడవ రోజు
  • వేదవ్యాస మహర్షి వేదాలను శాఖలుగా విధజించారు. మహా భారతమును, శ్రీ మద్భాగవతమును, అష్టాదశ పురాణాలను రచించారు. 
  • శబ్దం యొక్క జీవితం కొంతకాలమే ఉంటుంది. భావము యొక్క జీవితం మరి కొంతకాలం ఉంటుంది. దానిని ధారణ చేస్తే మాత్రమే అది జీవితకాలం ఉంటుంది.
  • భగవంతుని ప్రీతిగా ఆరాధించాలి. జీవనంలో భాగం చేసుకోవాలి. 
  • అసూయ అన్నింటికంటే పెద్ద దుర్గుణం. 
నాలుగవ రోజు
  • కష్టాలను భగవతానుగ్రహములుగా భావించాలి.
  • సంపన్నులవడమంటే ఐశ్వర్యం కూడబెట్టడం కాదు. భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకోవడం.
  • భక్తికి, ముక్తికి గొప్ప ఉదాహరణ శ్రీ కులశేఖర్ ఆళ్వార్.  
  • ఋషులు చేసిన అత్యోత్తమ త్యాగ ఫలితమే వేద సంపద. 
  • వివాహ ధర్మాలు: ధర్మార్ధ, కామ, మోక్షములలో దంపతులిద్దరూ భాగస్వాములు.  
  • ఆలోచన, వచనం, ఆచరణ అన్నీ ఒకే విధంగా ఉండాలి. 
  • భాగవతంలో సృష్టి ప్రాత్కాలం నుండి ప్రపంచంలోని మార్పులు గురించి వివరంగా చెప్పబడి ఉన్నది. చరిత్రకు సంబంధించిన అన్ని అంశములు విశదీకరించి ఉన్నాయి. గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తుంది. అన్ని లోకాల గురించి చెప్పబడియుంది.
  • సర్పాలు, నాగులు రెండూ వేరువేరు.
  • వేద జ్ఞాన సంపద గురించి తెలుసుకోవాలి. 
  • హైందవ ధర్మం: సొంత లాభం కన్నా పర ధర్మం మిన్న.   
  • సత్యం, శాంతి, ఓర్పు, సహనం, శుచి, క్షమ, ప్రేమ ఇవన్నీ ఉన్నచోట భగవంతుడు ఉంటాడు. 
ఐదవ రోజు
  • విషయముల బారి నుండి కాపాడుకోవడం భాగవత శ్రవణం వలన సాధ్యమౌతుంది. తప్పొప్పుల హెచ్చరికలు చేసి మనస్సును శుద్ధి చేస్తుంది.  
  • హరి నామం పాపను ఆలోచనను ఆదిలోనే హరించి వేస్తుంది. 
  • సంకల్పం సరిగ్గా ఉంటే ఇబ్బంది ఎదురైతే భగవంతుడే స్వయంగా వచ్చి ఆ పనిని పూర్తి చేస్తాడు.
  • ఒక విషయాన్నిమనం ఏ భావనతో చూస్తామో మనకు ఆ విషయం అదే భావనతో కనిపిస్తుంది. 
అరవ రోజు 
  • శ్రీక్రియ ఉపదేశం 
  • అంత్యకాల స్మృతిలో భగవన్నామ స్వరణ చేస్తే మోక్షం లభిస్తుంది. అయితే ఆ సమయంలో స్ఫురణకు రావాలంటే మనస్సుకు అటువంటి తర్ఫీదు నివ్వడం వలనే అది సాధ్యమౌతుంది. 
ఏడవ రోజు
  • భక్తి అంటే నమ్మకం, అటువంటి నమ్మకం కలగడం అపురూపమైన వరం.
  • శరణాగతులకు ఎప్పుడూ భగవంతుని అనుగ్రహం ఉంటుంది. 
  • శ్రీమద్భాగవతం చదివేప్పుడు దశమ స్కందంతో మొదలు పెట్టాలి. 
  • కాలక్షేపం ఎప్పుడూ సత్కాలక్షేపమే అయి ఉండాలి.  
         ఈ ఏడు రోజులూ పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేనటువంటిది. ఇంతేనా ఈ బాధ, క్రోధం, అవమానం, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ వదిలి వేయడం ఇంత సుఖంగా ఉంటుందా.... ఆ బరువు దించేయగానే మనసు మహా తేలికైపోయింది. మోక్షమన్నది మరెక్కడో లేదనిపించింది. ఈ స్థితి కొనసాగాలంటే మర్గాలేవో తెలిసినట్లే అనిపించింది. కృష్ణా రామా అంటూ కాలం గడపడం వృద్ధాప్యంలో కాదు. చిన్న వయస్సులోనే ఈ విషయాలు తెలుసుకోగలిగితే జీవితాన్ని సుఖంగా మలచుకోగలం.

      బాగా నచ్చిన అంశం సత్వ గుణంలో కూడా చేస్తున్నటువంటి పొరపాటు. కోరికలో స్వార్ధం ఉంటుంది, చివరకు మోక్షాన్ని కోరుకోవడంతో సహా. ఎటువంటి ప్రలోభానికి లోనవని శ్రీ కులశేఖర్ ఆళ్వార్ నకు శతకోటి ప్రణామాలు. వారు భగవంతుని కోరుకున్నారట "స్వామీ భాగవతుల పాద ధూళి స్పర్శ నిరంతరము నా శిరస్సుపై పడేలా అనుగ్రహహించ"మని. వారికి తిరుపతి గర్భగుడి ద్వారానికి గడపగా ఉండే వరం ఇచ్చారట. ఆ గడపను 'కులశేఖర్ పడి' అంటారుట.

        ఈ కార్యక్రం దిగ్విజయం అవ్వడానికి ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటూ పోయారే తప్ప ఏ ఒక్కరూ కూడా గుర్తింపు కోసం పని చెయ్యగా చూడలేదు. సత్సాంగత్యం  దొరికింది.

ఇంతటి భాగ్యాన్ని కలిగించిన గురువుగారిని పరిచయం చేసుకుందాం.

       శ్రీ తిరుప్పావై కోకిల మంజులశ్రీ అమ్మగారు శ్రీ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు. సుమారుగా 45౦ గోశాలల బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. గోసంరక్షణ కోసం గవర్నమెంట్ తో పోరాడి ఎన్నో GOలు శాంక్షన్ చేయించారు. ఈ గోసంరక్షార్ధం వీరు అవైదిక మతస్తులతో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొనవలసి వచ్చింది. శిధిలావస్థలో వున్న దేవాలయాలను పునరుద్దీకరించే కార్యక్రమాలు కూడా వీరు చేస్తుంటారు. కుంకుమ ఉద్యమాన్ని చేపట్టారు. హిందూ ధర్మశాస్త్రాన్ని గురించిన వీరి ప్రసంగాలు సుమారు వెయ్యికి పైగా టివిలో ప్రసారం అయ్యాయి. వీరు ఈ అమెరికా పర్యటనలో భాగంగా లాస్ ఏంజలస్, డెట్రాయిట్, న్యూజెర్సీ, షార్లెట్ పట్టణాలలో భాగవత సప్తాహం చేశారు. అట్లాంటా సత్యన్నారణ స్వామి ఆలయంలో ఈ వారం చెప్తున్నారు.