Showing posts with label ప్రచురణలు. Show all posts
Showing posts with label ప్రచురణలు. Show all posts

Monday, May 6, 2013

తెలుగు నాడిలో నా కథ 'ప్చ్...నాకంత అదృష్టమా!'

      ఝాన్సీ కాఫీ తాగుతూ కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉంది. ఆకాశం మబ్బుపట్టి ఉందేమో వేసవికాలం అయినా ఆరుగంటలకే చీకట్లు ముసురు కుంటున్నాయి. రోడ్డుమీద అప్పుడో కారు ఇప్పుడో కారు వెళుతున్నాయి. రోజూ సాయంత్రాలు వీధిలో ఆడుకునే పిల్లలెవరూ ఆ సమయంలో కనిపించలేదు. ముందుగదిలో లైట్ వేసి కిటికీతెర వేసేసింది ఝాన్సి. భర్త, పిల్లలు సెలవలకు ఇండియా వెళ్ళడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గర పడడంతో ఝాన్సీకి వెళ్ళడానికి కుదరక ఆమె అమెరికాలోనే ఉండిపోయింది.

     ఆ గదిలో ఒక మూల స్టాండ్ పైనున్న పింగాణి కుండీలోని 'డ్రాగన్ ట్రీ' ఆకులు చివరలు ఎండిపోయి ఉ౦డడం గమనించి మగ్ తో నీళ్ళు తీసుకునివచ్చి పోసింది. అలాగే ఇంట్లో ఉన్న మిగతా మొక్కలకు కూడా నీళ్ళు పోసి వాటి ఆకులమీద నీళ్ళు చల్లి, వాడిపోయిన 'ఆఫ్రికన్ వైలెట్'  పూలను తీసేసింది. నిశ్శబ్దంగా వున్న ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే చెక్కనేల మీద తన అడుగుల చప్పుడు తనకే పెద్దగా వినిపిస్తోంది. ఆ పనవగానే సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది. ఓ పావుగంట చూసిన తరువాత తననెవరో గమనిస్తున్నట్లుగా అనిపించిందామెకు.

       మెల్లగా తల తిప్పి చూస్తే పెరటి వైపునున్న కిటికీలన్నీ తెరచివున్నాయి, బయట లీలగా చెట్లు తప్ప మరేమీ కనిపించలేదు. ఇంట్లో వాళ్ళతో వెళ్ళకుండా ఒంటరిగా ఉండిపోవాల్సిన పరిస్థితులను తిట్టుకుంటూ లేచి వెళ్ళి అన్ని కిటికీలు వేసి, తెరలు దించి టివి చూడాలనిపించక కొడుకు గదిలోకి వెళ్ళి అరమర సర్దడం మొదలు పెట్టింది. అక్కడ పిల్లలిద్దరూ దాచుకున్న 'యూగియో కార్డ్లు', 'కాయిన్ కలెక్షన్' పుస్తకం కనిపించాయి. వాళ్ళ వస్తువులు చూస్తున్న కొద్దీ వాళ్ళ మీద మరీ బెంగగా అనిపించి కూతురి గదిలో ఉన్న కంప్యూటర్ లో పవర్ ఆన్ చేసి పాటలు పెట్టి౦ది. సర్దడం పూర్తవగానే వాల్యూమ్ బాగా పెంచి వంటగదిలోకి వెళ్ళింది. ఇంటికి మధ్యగా పెద్ద హాలు, హాలుకు ఒక పక్కగా మూడు పడగ్గదులు, రెండో వైపున డైనింగ్ హాలు దాని వెనుక వంటగది ఉండే ఆ ఇంట్లో వంటగది వరకూ పాటలు వినిపించాలంటే ఎక్కువ వాల్యూమ్ పెట్టక తప్పదు. ఉదయం చేసిన పప్పు, దొండకాయ వేపుడుతో భోజనం చేస్తూ ఉండగా ఫోన్ మోగింది. పాటల శబ్దంలో అవతల వాళ్ళు చెప్పేది వినిపించక, పాప గదిలోకి పరిగెత్తి కంప్యూటర్ పాజ్ లో పెట్టి ఫోన్ చేసిన రాగిణితో మాట్లాడుతూ భోజనం ముగించేసరికి రాత్రి ఎనిమిదయింది. 


       కిటికీలూ, తలుపులన్నీ వేసివున్నాయో లేదో మరొక్కసారి చూసి, సెల్ ఫోనూ, మంచినీళ్ళ గ్లాసు తీసుకుని సెక్యూరిటీ అలారం ఆన్ చేసి పడగ్గదిలోకి వెళ్ళింది. గ్లాసు, ఫోన్ మంచం పక్కనే ఉన్న నైట్ స్టాండ్ మీద పెట్టి తలుపు గడియవేసి తలుపునోసారి లాగి చూసి౦ది. ఉదయం నుంచి ఆ గదిలో కిటికీలు మూసి వుండడం వల్ల ఉక్కగా అనిపించి కిటికీ తలుపులు తెరువబోయి, తాను ఒంటరిగా ఉన్న విషయం గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకుని ఫాన్ ఆన్ చేసి మంచం మీద వాలి రాత్రి సగం చదివిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది. ఆ నిశ్శబ్దం, ఒంటరితనంలో చదవాలనిపించక పుస్తక౦ మూసి పక్కన పెట్టింది. హోరున గాలి వీస్తున్నట్లు౦ది, బయటనుండి వింత శబ్దాలు మొదలయ్యాయి. కొంచెం సేపు ఆలకించి మంచం దిగి మెల్లగా కిటికీ దగ్గరకు వచ్చి తెర తొలగించి చూసింది. ఆ చీకట్లో పెరట్లో వున్న పెద్ద ఆలివ్ చెట్టు ఊగిపోతూ భయకంరంగా కనిపించింది. 

      అంతవరకూ ఉన్న ఒంటరితనానికి భయం తోడయ్యింది. ఇలా ఒక్కర్తే ఉండడం ఝాన్సీకి అస్సలు అలవాటు లేదు. అందులోనూ వర్షం రాత్రి.., ఇప్పుడు కరంట్ పోతేనో అనుకుని మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకుంది. పక్కన ఇంటి వాళ్ళతో కొద్ది పరిచయం ఉన్నా ఏ రాత్రన్నా అవసర౦ పడితే పిలిచేంత చనువు లేదు. పోనీ ఏ స్నేహితులింటికి వెళదామన్నా వర్షం చాలా ఎక్కువగా ఉంది. ఇంతలో ఝాన్సి భయానికి తగ్గట్టుగా కరంట్ పోయింది. గాలికి పెరట్లో చెట్లు ఊగుతున్న శబ్దం భయంకరంగా వినిపిస్తోంది. కిటికి మీద వర్షం పడే శబ్దంకూడా చీకట్లో భయం గొలిపేలా ఉంది. గదిలో ఫాన్ ఆగిపోవడంతో మరీ ఉక్కగా ఉంది. సుమారుగా అరగంట తరువాత కరెంట్ వచ్చింది. ఝాన్సీకి టీవీ చూస్తూ నిద్రపోయే అలవాటు ఉండడంతో టివి రిమోట్ లో స్లీప్ మోడ్ కి టైమర్ పెట్టి టీవీ చూస్తూ పడుకుంది. కాసేపటికి మాగన్నుగా నిద్ర పట్టింది.

"ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా
ముట్టుకుంటే ముడుసుకు౦టావ్ అంత సిగ్గా
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిసి౦దిలే "


        ఉలిక్కిపడి నిద్ర లేచింది ఝాన్సీ. ఒక్కక్షణం తనెక్కడుందో అర్ధం కాలేదామెకి. తను ఒంటరిగా వున్నదన్న విషయం గుర్తురాగానే వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. "టైం చూస్తే రాత్రి రెండయింది, ఇంట్లో తనొక్కతే ఉంది. మరి పెద్దగా వినిపిస్తున్న ఆ తెలుగు పాట ఎక్కడినుండి వస్తున్నట్టు? పోనీ బయటెక్కడి నుండో వినిపిస్తు౦దా అనుకుంటే ఇంటి పక్క ఇళ్ళవాళ్ళంతా అమెరికన్లు." అలా ఆలోచిస్తూ వెంటనే ఇండియాలో ఉన్న భర్తకు ఫోన్ చేసింది.

"హలో ఏంట్రా ఈ టై౦లో ఫోన్ చేశావ్...ఇంకా పడుకోలేదా?" అడిగాడు విక్రం.
"పడుకున్నాను. ఇప్పుడే మెలుకువ వచ్చింది."
"ఇప్పుడే బయటకు వెళదామనుకు౦టున్నాం. ఇంతలో నువ్వు ఫోన్ చేశావు" ఝాన్సీ గొంతులోని కంగారు గమనించక చెప్పుకుపోతున్నాడు విక్రం.
"మనింట్లో పెద్దగా పాటలు వినిపిస్తున్నాయి. నాకు చాలా భయంగా ఉంది."
"పాటాలా...పాటలేంటి?" అయోమయంగా అడిగాడు.
"అదే నాకూ అర్ధం కావట్లేదు."
"రాత్రి పాటలు పెట్టి మరచిపోయి నిద్ర పోయుంటావ్." 
"నిన్న సాయత్రమెప్పుడో కంప్యూటర్లో పెట్టాను. తరువాత పాజ్ చేశాను. ఎవరూ కదిలించకుండా ఇప్పుడెలా వస్తున్నాయవి?" సందేహం వెలిబుచ్చింది ఝాన్సి.
"కంప్యుటర్ దగ్గరకు వెళ్ళి చూడోసారి."
"అమ్మో నాకు భయం. నేను వెళ్ళను."
"సరే పడుకో అయితే ఉదయాన్నే చూడొచ్చు"

"అసలు మీకు కొంచెమన్నా కంగారు లేదు. అర్ధరాత్రి ఇంత పెద్ద శబ్దంతో పాటలు వస్తుంటే 'ఎవరు పెట్టారా?' అని నేను భయంతో చచ్చిపోతుంటే సింపుల్ గా 'పడుకో పొద్దున్న చూడొచ్చని' చెప్తారా" భయంతో పాటు కోపం కూడా తోడయ్యింది.
"మరి ఎలా? పోనీ సాగర్ వాళ్లను పిలుస్తావా వాళ్ళొస్తారు."
"ఒద్దులెండి, అసలేమయిందో తెలియకుండా మరీ అర్ధరాత్రి ఎలా లేపుతాం. ఉదయం దాకా మీరే ఇలా మాట్లాడుతూ ఉండండి" చెప్పింది ఝాన్సి.
"ఏమిటీ! ఉదయం దాకానా? నాకు ఫరవాలేదు కానీ నీకే సమస్య, రేపు నువ్వు వర్క్ కి వెళ్ళాలి కదా. ఒక్కసారి వెళ్ళి చూడు పాటలు ఎక్కడినుండి వస్తున్నాయో, సెక్యురిటీ అలారం ఆన్ చేసే ఉందిగా భయం లేదులే"

     ఈ కబుర్లలోనే ఓ పావుగంట గడిచింది. పాటల శబ్దానికి పక్క వాళ్ళు లేస్తారేమో అని ఒకపక్క ఝాన్సీకి కంగారుగా ఉంది. ఏమైతే అదయిందని వెళ్ళిచూడడానికే నిశ్చయించుకుని సెల్ ఫోన్ లో '911' నొక్కి చేతిలో పట్టుకుంది. అవసరమై టాక్ బటన్ నొక్కితే పోలీస్ స్టేషన్ లో వాళ్ళు లైన్ లోకి వచ్చి ఇక్కడ జరుగుతున్నది మాటల ద్వారా తెలుసుకుంటారని ఆమె ఉద్దేశం. 


     ఇక్కడ ప్రమాదం జరుగుతుందని తెలిసిన వెంటనే ఐదు నిముషాల్లో పోలీసులొస్తారన్న భరోసాతో "సరే మీరు లైన్ లోనే ఉండండి" అని విక్రం కి చెప్పి 'బహుశా ఇదేనేమో తను చేసే ఆఖరి కాల్' అనుకుంటూ మెల్లగా తలుపు తీసి బయటకు తొంగిచూసింది ఝాన్సి. అనుమాని౦చదగ్గ దృశ్యాలు కాని, భయానక దృశ్యాలు కానీ లేక అంతా మామూలుగా ఉంది. పాటలు పెద్ద శబ్దంతో పాప గదిలోనుండి వినిపిస్తున్నాయి. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా కూతురి గది తలుపు తీసింది. ‘ఏ అగంతకుణ్ణి చూడాల్సివస్తుందో, ఏ పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందో’ అనుకుంటూ లైట్ వేసింది. ఆశ్చర్యం! గదిలో ఎవరూ లేరు కిటికీ కూడా మూసే ఉంది. కంప్యుటర్ నుండి పెద్దగా పాటలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆ శబ్దానికి ఫోన్ లో అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినపడడం లేదు. కంప్యూటర్ దగ్గరకు వెళ్ళి పాటలు ఆపింది ఝాన్సి. 

      "ఇక్కడెవరూ లేరు కాని కంప్యుటర్ నుండే పాటలు వస్తున్నాయి." చెప్పింది. ఝాన్సీ తో సరదాగా మాట్లాడుతున్నాడు కాని విక్రంకి కూడా కంగారుగానే ఉంది. "ఎలా వస్తున్నాయి పాటలు ఇంట్లో ఎవరైనా ఉండి ఉంటారా? పోలీసులను పిలవకుండా తప్పు చేస్తున్నామా" ఇలా పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఝాన్సీకి కింద పడి ఉన్న ఫైర్ అలారం కనిపించింది. "ఏవ౦డీ ఇక్కడ ఫైర్ అలారం కింద పడు౦ది." ఆన్నది.

      ఏం జరిగిందో అర్ధం అయ్యింది విక్రమ్ కి. "నువ్వు సాయంత్రం పాటలు పాజ్ లో పెట్టానన్నావుగా. ఆ తరువాత ఆ ఫైర్ అలారం కీ బోర్డు మీద పడడంతో పాజ్ లో ఉన్న బటన్ ఆన్ అయి పాటలు వచ్చాయి" చెప్పాడు విక్రం. జరిగిన విషయం అర్ధమై సమస్య ఏమీ లేదని తెలిశాక మనసు తేలికపడింది ఝాన్సీకి. ఈ ఫోన్ హడావిడి వల్ల ఇండియాలో ఉన్నఇంట్లో వాళ్ళందరకూ విషయం తెలిసి అందరూ ఝాన్సీతో మాట్లాడారు. అంతకుముందు వరకు భయం కలిగించిన విషయం కాస్తా సరదాగా మారింది. 


      ఏం జరిగి ఉంటుందో ఆలోచించకుండా ఏవేవో ఊహించుకుని తను భయపడి వాళ్ళను భయపెట్టినందుకు సిగ్గుగా అనిపించిది ఝాన్సీకి. రెండు వారాలుగా ఒంటరిగా ఉంటున్నా, నిన్న సాయంత్రం వాతావరణం, పరిస్థితులు కలిగించిన అనుమానం తనలో భయాన్ని పెంచినట్లుగా గుర్తించింది. అయినా కూడా ఎవరినీ పిలిచి ఇబ్బంది పెట్టకుండా కొంతవరకూ ధైర్యాన్ని ప్రదర్శించి వెళ్ళి చూసినందుకు గర్వంగానూ అనిపించిందామెకు. అలా ఆలోచిస్తూ ఆ తెల్లవారుఝామున నిశ్చింతగా నిద్ర పోయింది ఝాన్సి. 

     విక్రం, పిల్లలు ఇండియా నుండి వచ్చిన తరువాత ఒక ఆదివారం ఈ విషయమంతా గుర్తుతెచ్చుకుని నవ్వుకున్నారు. “ఇప్పుడు తలచుకుంటే సరదాగా వుంది కాని, ఆ రాత్రి తలుపు తీసేప్పుడు పేపర్లో చదివినవి, టివిలో చూసిన వార్తలన్నీ గిర్రున తిరిగాయి నా జీవితలో ఆఖరి రోజన్న నిర్ణయానికి కూడా వచ్చేశాను” అంది ఝాన్సి. "ప్చ్ నాకంత అదృష్టమా" అంటూ ఉడికించాడు విక్రం. 

ఈ కథ 'నాటా మాట' లోనూ 'తెలుగు నాడి' లోను ప్రచురి౦చబడింది.

Sunday, April 28, 2013

వాహిని పత్రికలో నా కథ 'మెంతి చెట్లు'

       మార్చి నెలాఖరి రోజులు, ఏటవాలుగా పడుతున్న నీరెండలో రాత్రి చలికి వణికిన చెట్లన్నీ వెచ్చగా చలి కాచుకుంటున్నాయి. విశాలమైన ఆ ఇంటి పెరట్లో పచ్చని తివాచీ పరిచినట్లు గడ్డి మొలిచివుంది. దూరంగా చెక్కతో కట్టిన ప్రహరీకి ఒక పక్క రంగురంగుల గులాబీలు విరబూసి ఉన్నాయి. వాటి పక్కన అప్పుడే నాటిన బంతి, మందారం, కనకాబరం మొక్కలు లేతగా, పసిపాప నవ్వులా నిర్మలంగా వున్నాయి. మరోవైపు చెర్రీ, పీచ్, ఆపిల్ చెట్లు తెలుపు, గులాబీ రంగులు కలగలసిన పువ్వులను అలంకరించుకుని వసంతాగమనానికి తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆ పక్కనే ఎత్తుగా పెరిగిన చెట్టు కొమ్మల్లోoచి నారింజలు సిగ్గుగా చూస్తున్నాయి.

     పెరటిలో దక్షిణపు వైపు మట్టి తొవ్వి నేలను చదును చేస్తున్నాడు నాన్న. బుజ్జి పండు, అక్క చిన్న చెంబుతో నీళ్ళు పట్టి గులాబీ మొక్కలకు పోస్తూ ఇటు అటు పరుగులు పెడుతున్నారు. వాళ్ళిద్దరూ నీళ్ళు మొక్కలకు పోసేలోపు సగం నీళ్ళు ఒంటి మీదే పడుతున్నాయి. ఈలోగా అమ్మ విత్తనాల పొట్లం, చిన్న గిన్నె తీసుకుని పెరట్లో ఈశాన్యం మూలగా ఉన్న పింక్ జాస్మిన్ పందిరి దగ్గరకు వెళ్ళింది. అమ్మ వెనకాలే వెళ్లాడు పండు.

"అమ్మా"
"ఊ..."
"నువ్వేం చేత్తున్నావ్?"
"పువ్వులు చూస్తున్నాను నాన్నా?"
"ఎందుకు?"
"ఎందుకంటే..అందంగా ఉన్నాయి కదా అందుకు"
"ఓ...మలి పచ్చి?" ఆకాశం వైపు చూపిస్తూ అడిగాడు.
"అది కూడా అందంగా ఉంది"
"చైకిలు?" అన్నాడు దూరంగా వున్న తన బుజ్జి సైకిల్ని చూపిస్తూ.
"బుజ్జిపండు సైకిలు కదా అది కూడా చాలా అందంగా ఉంది" పండు నెత్తుకుని ముద్దుపెట్టుకుని చిన్న గిన్నెలోకి పువ్వులు కోయడం మొదలెట్టింది.

"అమ్మా నేనూ కోత్తాను". పువ్వును ఎలా పట్టుకుని కోయాలో చెప్పింది. పండు ఒక్క పువ్వును పట్టుకుని లాగగానే పసిమొగ్గలు కూడా తెగిపోయాయి. అమ్మకసలే పూలంటే ప్రాణం. పండును కిందకు దించి “చిట్టితల్లీ పండును పిలువమ్మా” అని అక్కతో చెప్పింది.
"పండూ ఇలా రా సైకిల్ ఆట ఆడుకుందాం" పిలిచింది అక్క. పండు దగ్గరకు రాగానే " నీ సైకిల్ లాన్ లోకి రాకూడదు, నా సైకిల్ ఫ్లోర్ మీదకు రానివ్వను" అని చెప్పి సైకిల్ మీద గుండ్రంగా తిరగడం మొదలెట్టింది. 


     పండు తన మూడుకాళ్ళ సైకిలు మీద తిరుగుతూ అక్కని చూస్తున్నాడు, అక్కని అలా సైకిలు మీద చూడడం వాడికి చాలా ఇష్టం. పూలు కోయడం అవగానే అమ్మ పూలగిన్నె గట్టు మీద పెట్టి విత్తనాల పొట్లం తీసుకుని నాన్న చదును చేసిన దగ్గరకు వెళ్ళింది. పిల్లలిద్దరూ కూడా అమ్మ వెనకే వెళ్ళారు.

“చిట్టితల్లీ బకెట్తో కొంచెం నీళ్ళు తీసుకురామ్మా” అంటూ అక్కను పురమాయించింది. “నేను తెత్తా..నేను తెత్తా” అ౦టూ చిన్న చెంబులో నీళ్ళు తీసుకుని అక్కకంటే ముందు పరిగెడుతూ అమ్మ దగ్గరకు వచ్చాడు పండు. 

     అమ్మ మట్టిలో ఒక పక్కగా కూర్చుని జాగ్రత్తగా విత్తనాల పొట్లం విప్పి అందులో వున్న గో౦గూర విత్తనాలు వరుసగా చాళ్ళలో చల్లింది. స్క్వాష్, బీన్స్, వంకాయ విత్తనాలను చిన్న చిన్న కుండీలలో వేసింది. గోడవారగా బెండ విత్తనాలు ఒకదానికొకటి అడుగు దూరంలో వేసింది. టమేటో, మిరప విత్తనాలను నాలుగైదు వరుసలలో నారు పోసింది. అమ్మ చేస్తున్న పనిని ఆసక్తిగా గమనించాడు పండు. 

రకరకాల రంగుల్లో, ఆకారాల్లో వున్న వాటిని చూపిస్తూ “అవేంతి?” అనడిగాడు. “విత్తనాలు నాన్నా. అవి పెరిగి పెద్దై బోలెడు కూరగాయలు కాస్తాయి.” చెప్పి౦దమ్మ. 
“ఏం కాయలు?” అడిగాడు పండు.
“బీరకాయలు, వంకాయలు, బీన్స్, టమాటో, మిరపకాయలు....” అని చెప్తూ చల్లిన విత్తనాలపైన మట్టికప్పింది.
పండుకు నమ్మకం కలగలా. ఆ కూరగాయలేమో పచ్చగా, ఎర్రగా అంత పెద్దగా వున్నాయి, ఇవేమో ఇంత బుల్లిగా నల్లగా వున్నాయి. ఒక బీర విత్తనం, కొంచెం మట్టి తీసి అమ్మ చూడకుండా జేబులో వేసుకున్నాడు.
“ఆ చెట్టు కూడా విత్తన౦ వేస్తేనే మొలిచింది కదూ!” మూలగా వున్న పెద్ద ఆలివ్ చెట్టును చూపిస్తూ అడిగింది అక్క.
“ఆ అలానే మొలిచింది.” అక్క చూపించిన వైపుగా చూస్తూ చెప్పి౦ది. బుజ్జిపండు పైకి చూస్తూ వెనక్కి నడిచి చెట్టు పైనున్న చిటారుకొమ్మ కనిపించేవరకూ వెళ్ళాడు.

“ఎవరు వేశారు?”
“అంతకు ముందు ఇక్కడ వున్న వాళ్ళెవరో వేసి ఉండొచ్చు, లేకపోతే గాలికి విత్తనం యెగిరి అక్కడ పడి కూడా మొలిచి ఉండొచ్చు” చెప్పాడు నాన్న.

      పండు చుట్టూ చూసాడు గాలికి కొమ్మలు ఊగుతున్నాయి, ఆకులు అటూ ఇటూ తిరుగుతూ కింద పడుతున్నాయి, కాని ఎక్కడా విత్తనాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. పెరట్లో మరోవైపు ఏవో రాలుతున్నట్లనిపించి అక్కడకు వెళ్ళాడు. తెల్లని ఆపిల్ పూలరెక్కలు గాలికి జలజలా రాలుతున్నాయి. నేలమీద పడకుండా పూల రెక్కలు పట్టుకుంటూ, దొరికిన వాటిని తలమీద వేసుకు౦టూ ఎందుకొచ్చాడో మరచిపోయాడు.

     “పండూ నీళ్ళు పోద్దువురానాన్నా” అమ్మ పిలుపు వినిపించింది. పరిగెత్తుకుంటూ అమ్మదగ్గరకు వెళ్ళాడు. విత్తనాలు నాటిన ప్రదేశంలో పిల్లలతో నీళ్ళు పోయించి౦దమ్మ. నాన్న మొక్కలు నాటిన గుర్తుగా అక్కడ చిన్న జండా పాతాడు. తరువాత అమ్మ, నాన్న ఇద్దరూ మొక్కల దగ్గర నీళ్ళు నిలవడానికి వీలుగా పాదులు చేశారు. వాళ్ళా పని చేస్తున్నంత సేపూ పండు జేబులో చెయ్యి పెట్టి విత్తనం బీరకాయలా మారుతుందేమో చూస్తూనే వున్నాడు.

“ఇక మెంతులు వేద్దామా? అడిగాడు నాన్న.
వంటగది పక్కగా వున్న రెండడుగుల పొడవు అడుగు వెడల్పు వున్న స్థలాన్ని చూపిస్తూ “అక్కడే కదూ?” అడిగిందమ్మ.
“ఆ...అక్కడే పోయిన సారి కూడా చాలా బాగా వచ్చాయి. పైగా కిటికీలో నుండి బాగా కనిపిస్తుంది కూడాను.” చెప్పాడు నాన్న.

     అమ్మ ఒక చిన్న పుల్ల తీసుకుని వచ్చి అక్కడ నేలలో గీతలు గీయడం మొదలెట్టింది. అమ్మ తనలాగా మట్టిలో ఆడుకోవడం చూసి బోలెడు ఆశ్చర్యపోయాడు పండు. మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని ఒంగి అమ్మ వైపు చూస్తూ “ఏం చేత్తున్నావ్?” అడిగాడు.
“నీ పేరు రాస్తున్నాను నాన్నా” .
“పిచ్చమ్మ...ఎవలైనా ‘మాగ్నా డూడిల్’ మీద లాత్తారు కాని మత్తిలో లాత్తాలేమిటి?” అనుకుని “అక్కలెందుకు లాచావు?” అడిగాడు.
“పోయిన సారి అమ్మ ఇలాగే నేలమీద నా పేరు రాస్తే అక్కడ మొక్కలొచ్చి పచ్చగా నా పేరు కనిపించింది గుర్తుందా!“ మోహం వెలిగిపోతుండగా చెప్పిందక్క. 

     పండుకు అక్క చెప్పిన విషయం గుర్తు రాలేదు కాని అక్క మోహంలో సంతోషం చూసి ఏదో మంచి సంగతే అనుకుని గట్టిగా చప్పట్లు కొట్టాడు. అక్కకి కొన్ని మెంతులిచ్చి ఆ చాళ్ళలో వరుసగా దగ్గర దగ్గరగా చల్లించిందమ్మ.

“నేను కూలా ఏత్తాను” అంటున్న పండు చేతికి కొన్ని మెంతులిచ్చి చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా గీతల్లో పడేలా వేయించింది. దానిపైన కొంత మట్టి, నీళ్ళు చల్లి నిలబడి తృప్తిగా చూసుకు౦ది.
పండు దాని చుట్టూ తిరుగుతూ, “భలే భలే ఇప్పులు నా పేలు కూలా మొలుత్తుందా”? అమ్మని అడిగాడు.
“చక్కగా మొలుస్తుంది, నువ్వు ఇక్కడ తొక్కకుండా ఆడుకోవాలి మరి.”
“ఓ...అచ్చలు తొక్కను” చెప్పాడు పండు.

     మధ్యాహ్నం అవడంతో ఎండ తీవ్రత హెచ్చింది. ఉదయం నుండి పనిచేస్తున్నారేమో అమ్మ, నాన్న పిల్లలను తీసుకుని ఇంట్లోకి వెళ్లారు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం నీళ్ళు చల్లుతూ మొలకలు కనిపిస్తాయేమోనని ఎదురుచూస్తున్నారు. ఓ వారం తరువాత మెంతి విత్తనాలు వేసిన దగ్గర నేల పచ్చపచ్చగా కనిపించింది. మరునాటికి అక్కడంతా బుల్లిబుల్లి మొక్కలు మొలిచాయి. పండు అలా పచ్చగా మొలిచిన బుల్లి మొక్కలను ఆశ్చర్యంగా చూశాడు. అక్క ఆ మొక్కలను చూస్తూ ‘బుజ్జిపండు’ అని చదివింది. కొత్త మొక్కలను చూసి బోలెడు సరదా పడిపోయారు అందరూను. ఇంటికి వచ్చినవాళ్ళందరినీ బుజ్జిపండు పెరట్లోకి తీసుకెళ్ళి మె౦తి మొక్కలతో రాసిన తన పేరు చూపించాడు.

      ఓ ఆదివారం సాయంత్రం అమ్మ, నాన్న సినిమా చూస్తున్నారు. పండు, అక్క బ్లాక్స్ పెట్టుకుని ఆడుకుంటున్నారు. ఇంతలో సినిమాలో విమాన౦ వెళ్తున్న శబ్దం వినిపించింది. పండుకు అదంటే బోలెడిష్టం పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న ఒళ్ళోకూర్చున్నాడు. టివిలో రెండు కొండల మధ్య ఆకాశంలో ఎగురుతూ వున్న విమానం కనిపించింది కింద౦తా ఆకుపచ్చని చెట్లు, వాటి మధ్యగా నది కూడా కనిపించాయి. ఆ విమానం వెళ్ళే వరకు చూసి “నాన్నా ఆ చెత్లన్నీ ఇత్తనాలేనా” అడిగాడు.

“అవును నాన్నా, భలే గుర్తు పెట్టుకున్నావే” అంటూ పండుకు ముద్దిచ్చాడు నాన్న.
“నేను పెద్దయ్యాక ఎలోపెన్లో అకాచంలో ఎల్తున్నప్పులు ఫారెత్ లో బుజ్జి పండు అని కనిపిత్తుంది కదా!” అన్నాడు. నాన్నకు అర్ధం కాలేదు. “ఎక్కడ నాన్నా ఏ ఫారెస్ట్ లో?” అని అడిగాడు.
“మనం బోలెడు ఇత్తనాలు ఏచాం కదా అవి పె......ద్దై పైనుంచి చూత్తే ఫారెత్ లాగా అయి అప్పులు బుజ్జిపండు కనిపిత్తుంది.” అంటూ నమ్మకంగా పండు చెప్పిన మాటలకు అమ్మ, అక్క పెద్దగా నవ్వారు. అమ్మ పండును ఎత్తుకుని రెండు బుగ్గలమీద ముద్దులు కురిపించింది.

      ఆ తరువాత ఎప్పుడు మెంతులు చల్లినా అమ్మకు ఆకాశంలో వెళ్తున్న విమానం, కింద అడవిలో ‘బుజ్జిపండు’ బుల్లి బుల్లి ఆకుల మెంతి చెట్లు కనిపించేవి. 

వాహిని పత్రికను ఇక్కడ చదవొచ్చు. 

Tuesday, March 5, 2013

వికసించిన పువ్వు


       అప్పుడే వర్షం పడిందేమో ఆకులన్నీ తడితడిగా పచ్చగా మెరుస్తున్నాయ్. వర్షం బరువుకు వాలిన గులాబీ నుండి నీటిచుక్క నేలమీదకు జారుతో౦ది. చూరు నుండి నీళ్ళు ధారగా పడుతున్న చప్పుడు చిన్నగా వినిపిస్తోంది. ఉండుండి వీస్తున్న గాలికి మేపల్ ఆకులు మెల్లగా కదులుతున్నాయ్. మేఘాల మాటునున్న సూరీడు ఒక్కో కిరణాన్ని గురిచూసి పంపుతున్నట్లుగా ఏటవాలుగా పడుతోంది నీరెండ. వర్షం వెలిసిన తరువాత మాత్రమే కనిపించే అరుదైన వెలుగుతో మెరిసిపోతోందా ప్రదేశం. కిటికీలోంచి ఆ సౌందర్యాన్ని చూస్తూ టీ తాగుతోంది రాధిక.

“వెదర్ చాలా బావుంది కదూ” ఎప్పుడొచ్చాడో ఆమె వెనుక నిలబడి వున్నాడు మోహన్.
 చిన్నగా నవ్వింది. “కాసేపలా బయట కూర్చుందామా?”

       తలుపు తెరిచి బయటకు రాగానే చల్లగాలి ఆహ్లాదంగా పలకరించింది. గోడ వారగా అల్లుకున్న జాజితీగ మెల్లగా ఊగుతోంది. తీగలో అక్కడక్కడా విరిసిన పూలు నక్షత్రాల్లా వున్నాయి. వీధిలో అప్పుడో కారు ఇప్పుడో కారు వెళ్ళడం తప్ప పెద్ద హడావిడేమీ లేదు. ఇద్దరూ వరండాలో ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు.

"ఇంత తీరిగ్గా ఇలా బయట కూర్చుని చాలా రోజులయింది కదూ!”
“ఊ... ఆ గోవర్ధనం చెట్టు చూడండి వెన్నెల పువ్వులను కొప్పులో ముడుచుకున్నట్లు లేదూ.. “   
ఆమె చూపించిన వైపు చూశాడు. ముదురు ఆకుపచ్చని ఆకుల మధ్య తెల్లని పువ్వులు. మాట రానట్లుగా చూస్తూ ఉండిపోయాడు. బ్రతకడానికి జీవించడానికి మధ్య తేడా...
కాళ్ళు రెండూ పైకి పెట్టుకుని సర్దుకుని కూర్చుంటూ అడిగింది “చెప్పండి ఏంటి కబుర్లు?"
"లైఫ్ ఈజ్ గుడ్" పువ్వు మీదనుండి చూపు మరలస్తూ ఆమె వైపు తిరిగాడు.
"ఏమిటీ....." కనుబొమలు ముడిచింది.
"నేను మొదలెట్టిన కొత్త కథ టైటిల్" చిన్నగా నవ్వాడు.
“ఓ...కథా...అయితే ఈసారి మీ కథలో కష్టాలేమీ లేవన్నమాట”
“అవి లేకపోతే ఇక కథే౦ ఉందీ...”
కారు శబ్ద౦ విని పక్కకు చూశాడు. దూరంగా విజయ, కావేరి వీధి మలుపు తిరుగుతూ కనిపించారు.
"మీ ఫ్రెండ్స్ వాక్ చేస్తున్నారు, నువ్వూ వెళ్తావా?"  
"లేదులే ఈ మధ్య విజయ ఎందుకో అదోలా ఉంటోంది. నాతో సరిగా మాట్లాడ్డమే లేదు" చిన్నబోయిన మొహంతో చెప్పింది.
"ఎందుకు.... ఏమైంది?" ఆశ్చర్యపోయాడు మోహన్.

       మోహన్ ఆశ్చర్య పోవడానికి కారణముంది. వాళ్ళా ఇంటికి మారి రెండేళ్ళవుతోంది. విజయ వాళ్ళు ఆ పక్క వీధిలోనే ఉంటారు. పరిచయమైన దగ్గరనుండీ రాధికకు, విజయకు బాగా స్నేహం కుదిరింది. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళుతుంటారు. అటువంటిది ఈ రోజు రాధిక ఇలా చెప్పడం....

ఈ మధ్య నేను వాకింగ్ కి పిలిచిన ప్రతిసారీ బిజీగా ఉన్నానని చెప్తుంది. కొంచెం సేపటి తరువాత వేరెవరితోనైనా వాక్ చేస్తూ కనిపిస్తోంది" చెప్పింది రాధిక. తనూ పక్కకు చూస్తూ ఉండడంతో రాధిక మోహంలో భావమేదీ కనిపించలేదు మోహన్ కి.

“ఏమైందో నువ్వడగలేదా?”
మౌనంగా ఉండిపోయింది. తను ఫోన్ చేసినా  తామిద్దరి మధ్య సంభాషణ రెండు మాటలు తరువాత తడుముకోవలసి వస్తుందన్న విషయన్ని అతనికి చెప్పలేదు. 
"కారణం మెల్లగా తెలుస్తుందిలే, అప్పుడు ఆలోచిద్దాం ఏం చెయ్యాలో." అతనే అన్నాడు.
నేనూ అలాగే అనుకున్నాను, కానీ..వద్దులెండి విషయమేదైనా, నాకు మీ క్లాస్ తప్పదు." అంటూ ఆపేసింది. భర్తకు విషయం చెప్పాలని లేదు రాధికకు, అర్ధం చేసుకోకపోగా అనవసరంగా అలోచిస్తున్నావంటాడతను.
"అలా ఎందుకనుకుంటావ్ సమస్యకు మరో కోణం అనుకోవచ్చుగా”
"చూశారా, విషయం తెలియకుండానే మొదలెట్టారు.అంది కొంచెం కినుకగా.
సారీ సారీ, నువ్వు పూర్తిగా చెప్పేంతవరకూ మాట్లాడను, చెప్పు.” 

      "పోయిన నెలలో ఓ రోజు పక్కవీధిలో కొత్తగా వచ్చిన రేణుకను పరిచయం చేద్దామని అందర్నీ టీకి పిలిచాను. కబుర్ల మధ్యలో కావేరి "ఏమైనా కొత్త పుస్తకాలున్నాయా?" అని అడిగింది. ఈ మధ్య ఇండియా నుండి తెప్పించిన పుస్తకాలు, పత్రికలూ ఇచ్చాను. తనకు తెలుగు భాషన్నా, సాహిత్యమన్నా చాలా ఇష్టమని మీకు తెలుసుగా. ఇవ్వగానే పుస్తకాలు అలా తిరగేస్తూ పత్రికలో బహుమతి వచ్చిన మీ కవిత చదివి చాలా బాగుందని మెచ్చుకుంది. మిగిలిన వాళ్ళు కూడా మీకు అభినందనలు చెప్పమన్నారు. ఆ రోజే మీకా విషయ౦ చెప్పాను గుర్తుందిగా! ఆ తరువాత ఓ రోజు రేణుక ఫోన్ చేసి వాళ్ళింటికేవో కొనాలని పిలిస్తే, విజయ వాళ్ళ చిన్నబాబుకు జ్వరంతో ఉండడంతో తనకు రావడానికి కుదరక నేనొక్కదాన్నే తనతో కలసి షాపింగ్ కి వెళ్ళాను.. ఆ తరువాత కూడా మేమో రెండు సార్లు అలాగే వెళ్ళాము. మరోసారి అందరం కలసినపుడు రేణుక మొక్కల గురించి మాట్లాడుతూ మనింట్లో మొక్కలు చాలా అందంగా ఉన్నాయంది. ఆ తరువాత నుండీ విజయ ప్రవర్తనలో మార్పు గమనిచాను." సుదీర్ఘంగా చెప్పింది రాధిక.

"నువ్వేదో అపోహ పడుతున్నావ్ రాధీ...." అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న మోహన్ని మధ్యలో ఆపేసింది.
"మీరలాగే అంటారని తెలుసు, అందుకే ఈ విషయం మీతో ఇన్నాళ్ళూ చెప్పలేదు. తను కావేరితో ఏమన్నదో తెలుసా... ఆ బహుమతి వచ్చిన మీ కవిత ఏదో ఇంగ్లీష్ కవితకు అనువాదం అని చెప్పిందట."
"అవునా....అలా ఎందుకు చెప్పిందబ్బా" కోపం పాలు కొంచెం ఉన్నా ఆశ్చర్యమే ఎక్కువ కనిపిచింది మోహన్ స్వర౦లో.
“నాకూ అదే అర్ధం కాలేదు.”
"ఏమయినా, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయాలు కావేరి నీతో చెప్పకుండా ఉండాల్సింది." తన ధోరణిలో అన్నాడు మోహన్.

"తనకై తాను చెప్పలేదు. ఒక రోజు విజయ, నన్ను తప్ప అందర్నీ భోజనానికి పిలిచింది, ఆ రోజు నాకు చాలా బాధనిపించి౦ది. నావల్ల తెలియకుండా ఏమైనా పొరపాటు జరిగిందేమో దిద్దుకు౦దామని కావేరితో మాట్లాడాను. అప్పుడు తను చెప్పిన విషయాలు నిన్నాక నాకు బాధకంటే కూడా ఆశ్చర్యమే ఎక్కువ కలిగింది."

"ఏం చెప్పిందట విజయ?" కుతూహలంగా అడిగాడు మోహన్.
"ఏవైతేనేం లెండి, అవన్నీ అప్రస్తుతాలూ, అసత్యాలూనూ. విన్న కావేరికి, నాకూ కూడా తెలుసా విషయ౦."
"మరెందుకోయ్ బాధ?" అనునయంగా అడిగాడు.
"బాధ నన్నేదో అన్నదనికాదు. అసలెందుకలా అని, మేమిద్దరం అంత స్నేహంగా ఉండేవాళ్ళమా కొన్ని విషయాల్లో నేను తనకంటే భిన్నంగా ఉండడం, దానివల్ల అందరూ మనల్ని మెచ్చుకోవడాన్ని చూసి భరించలేకపోయి౦దా.." బాధగా అంది.  

"కొంతమంది మనస్థత్వం అంతే రాధీ, మనమేం చెయ్యలేం. కానీ ఎవరు చేసిన తప్పు వారికి తెలుస్తుంది. ఈ అబద్దాలన్నీ నీటిమీద రాతలే..నిలకడ మీద నిజాలు అందరికీ తెలుస్తాయి."

       "విజయ అన్ని విషయాలూ చక్కగా ఆలోచించగలిగి, ఈ అసూయతో, దాన్ని జయించలేని అసమర్ధత వల్ల అల్లిన అబద్దాలతో, తన వ్యక్తిత్వానికి తనే తీరని కళంకం తెచ్చుకుంది. ఒక్కసారి తను మాట్లాడినవి అబద్దాలని తెలిశాక ఎవరైనా తన మాటలు నమ్ముతారా.. తను తీసుకున్న గోతిలో తనే పడుతుంది కదా అన్నదే నా బాధ౦తానూ”.

"మనసులో అసూయ కలగడం సహజం రాధీ...కాని బుద్ది దాన్ని నియంత్రి౦చగలిగినప్పుడు సమస్య అనేదే తలెత్తదు. మా మామయ్య ఎప్పుడూ ఓ మాట చెపుతుండేవారు."
"ఏమనో..." విషయం మోహన్ తో పంచుకోవడంతో మనసు కొంచెం తేలికపడగా అడిగింది రాధిక.
"ప్రతి వ్యక్తి దగ్గర్నుండి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి" అని చెప్పాడు.
"ఈ విషయంలో ఏం నేర్చుకుంటాం...ఇక్కడ నేర్చుకోకూడనిదే ఉంది కదా" ఖాళీ కప్పును పక్కన పెట్టింది.
"నేర్చుకోవలసి౦ది ఉంది రాధీ, కొంతమందిని చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలి, మరి కొంతమందిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి". గాలికి కదులుతున్న రాధిక ముంగురులు చూస్తూ చెప్పాడు.
"అంటే ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలన్నమాటఅంది నవ్వుతూ.
సరిగ్గా చెప్పావు, అప్పుడే మనసు బుద్ది రెండూ కలసి పనిచేస్తాయి..... 

నిన్నో విషయం అడిగితే బాధ పడావుగా?”  
“ఏమిటో చెప్పండి”
“కావేరి నీతో అబద్దం చెప్పి ఉండొచ్చుగా..”
“మీకెందుకలా అనిపించింది?”
“మన గురించి తనలా చెప్పినప్పుడు కావేరి కూడా దూరంగా ఉండాలి. అలా కాకుండా ఆ ఇద్దరూ మామూలుగా ఉన్నారంటే... ”
“అదా ... కోరి ఎవరూ పక్కవారితో వైరం తెచ్చుకోరు, ప్రమాదకరమైన వ్యక్తులేతే తప్ప. విజయ అంత ప్రమాదకరమైన వ్యక్తి కాదనుకుందేమో...అయినా వాకింగ్ కి వెళ్ళినంత మాత్రాన ఏమవుతుంది?”
“అలా అని కాదు మన విషయంలో అబద్దం ఆడింది కదా..తన విషయంలో కూడా...”
“తెలిసిందిగా...జాగ్రత్త పడుతుంది. ఇంత ఆలోచన ఎందుకూ... మన విషయంలో తనకేదో నచ్చలేదనుకుంటే పోలా...”
“నీకేమీ బాధనిపించదా?”

“ఎందుకనిపించదు...పుట్టిన ఊరికి, దేశానికి చాలా దూరంలో ఒంటరి జీవితం గడుపుతున్నాం. ‘ఒంటరి’ అన్నానని అపార్ధం చేసుకోకండి. మనసులో మాట చెప్పుకోవాలంటే దూరానున్నవారికి ఇక్కడ పరిస్థితి అర్ధం కాదు, పరిచయమైన వాళ్ళతో బంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తాం. అలాంటిది ఇలాంటివి ఎదురైనప్పుడు చాలా బాధగానే ఉంటుంది...” ఇద్దరూ కాసేపు ఆలోచనలో ఉండిపోయారు.

“చిన్ని జీవిత౦... అపోహలు, అపార్ధాలు మనసులో పెట్టుకుంటే ఈ అందమైన ప్రకృతిని ఆస్వాదించగలమా...”  తనలో తాను అనుకున్నట్లుగా అంది రాధిక.

“గోవర్ధనం పూవు తెల్లగా కనపడాలంటే బుద్ది వికసించాలి మరి”  
“గోవర్ధనానికా...?”  
“ఎవరికో తెలియకే అడిగావా?” 
సమాధానం చెప్పకుండా నవ్వేసింది.
"నువ్వు నాకు నచ్చావ్" ఆన్నాడు. 
"మరో కథ టైటిలా?”
కాదనట్లు తల అడ్డంగా ఊపాడు.
“ఇంత అర్ధాంతరంగా నచ్చడానికి కారణమేంటో "
"తను నీ పట్ల సరిగ్గా ప్రవర్తించక పోయినా కూడా కోపం తెచ్చుకోక ఇలా ఆలోచించావు చూడు అందుకే"
"మన పెళ్ళయి పదేళ్లయి౦దిగా.... సహవాస దోషం" అంటూ హాయిగా నవ్వేసింది రాధిక. శృతికలిపాడు మోహన్.
"చలి మొదలైంది...ఇక లోపలకు వెళదామా" అంటూ పైకి లేచింది.
“కథాగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని...” మదిలో మెదిలిన పాటను చిన్నగా పాడుతూ ఆమెననుసరించాడు.

                     *                          *                             * 


 ఈ కథ 'వాకిలి' పత్రిక మార్చి సంచికలో ప్రచురితమైంది.  సంపాదకులకు

 బ్లాగుముఖంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. 


Thursday, July 12, 2012

ఆటా జ్ఞాపికలో నా వ్యాసం 'తెలుగు బ్లాగులు'

      అదో అందమైన పల్లెటూరు... భావపరిమళాలు వెదజల్లే అక్షరసుమాలు, కవితా పూరితమైన చల్లని తెమ్మెరలు, పద్యసాహిత్యపు హరితవనాలు, తీర్చిదిద్దిన రంగవల్లుల వంటి రచనలు, పదచాతుర్యంతో కూడిన సంభాషణల తోరణాలు, ఎల్లవేళలా స్వాగతం పలికే వీధి గుమ్మాలతో అక్కడ నిత్య౦ పండుగ శోభ కళకళ్ళాడుతూ సాక్షాత్కరిస్తుంది. అంతర్జాలంలో కనిపించే అద్భుత౦ ఈ తెలుగు బ్లాగు ప్రపంచం.

    సాహిత్యపు విలువలు వలువలు వీడని సామ్రాజ్యం అది. ‘తెలుగుభాష అంతరించి పోతోంద’ని వాపోతున్నవారందరూ ఒక్కసారి అంతర్జాలంలోకి వచ్చి, నిశ్శబ్దంగా అక్కడ తెలుగువారు చేస్తున్న సాహిత్య సేవ చూడండి. కథలు, కవితలు, పద్యాలు, పుస్తకాలు, సినిమాలు, పాటలు, రాజకీయాలు, సమీక్షలు, సమాచారాలు, కబుర్లు, చెణుకులు, ఛలోక్తులు, చిత్రాలు, వంటలు, చిట్కాలు ఇలా ఎన్నో విశేషాల సమాకలనమే ఈ బ్లాగులు. తెలుగు భాష మీద ఆసక్తి వున్న వారు ఉత్సాహంగా పాల్గొని హర్షాతిరేకంతో వ్రాసుకుంటున్న రచనలు, తెలుగు భాషావైభవాన్ని ఎలుగెత్తి చాటుతున్నాయి.

       మనిషికీ మనిషికీ మధ్య పెరిగిన దూరంలో, వంటరితనపు ఎడారి దారులలో వేసవి వడగాల్పుల ధాటికి వేసారిన వారందరికీ ఈ బ్లాగులు చలివేంద్రాలే. మనసులో మాట పదుగురి ముందు నిర్భయంగా చెప్పుకోగలిగిన స్థైర్యాన్ని, కావలసిన ఊరటనీ అందిస్తాయి. సంతోషాన్ని, బాధనీ పంచుకోవడానికి ఓ వేదికలా నిలిచి, పరిష్కారం చూపిస్తాయి. ఒకరి ఆత్మసంఘర్షణ పదుగురికి ఉపయోగపడే జీవిత పాఠమౌతుంది. ఏ ప్రపంచీకరణ వలన మానవ సంబంధాలకు అంతరాయం వాటిల్లిందో, దానినే ఆయుధంగా చేసుకుని, వేరు వేరు పట్టణాలలో, దేశాలలో, ఖండాలలో వు౦టున్న వ్యక్తులతో స్నేహ సంబంధాలు కొనసాగించుకోవడానికి, ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న మిత్రులతో విశేషాలు పంచుకోవడానికి ఈ బ్లాగులు ఒక వేదికగా ఉపయోగపడుతున్నాయి.

బ్లాగులు

        ప్రాంతీయ సభలు, సమావేశాల వివరాలు, పుస్తక ప్రదర్శనలు, యాత్రా విశేషాలు, ప్రపంచంలోని వింతలు, విడ్డూరాలు, చూడచక్కని ప్రదేశాలు అన్ని౦టి వివరాలు ఇక్కడ దొరుకుతాయి. ఈ విశేషాల గురించి అంతర్జాలంలో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. కానీ, అభిరుచులు కలగలసిన వారు అందించిన వివరాలకు సాటి రావు కదా అవి. పైగా మన సందేహాలకు సమాధానాలు, సూచనలూ దొరికే సౌలభ్యం అక్కడ ఉంటుంది.

      ఈ బ్లాగు ప్రపంచంలో కలుషితమైన కుల రాజకీయాలు, మతోన్మాదాలు లేవనే చెప్పొచ్చు. ఉత్తమ రచన ఎవరు చేసినా సహృదయంతో ప్రోత్సహించేవారే ఎక్కువ శాతం ఉంటారు. ఒక్కోసారి ఈ బ్లాగులోని చర్చలు వ్యక్తిగత దూషణల వరకూ వెళుతుంటాయి కానీ అవి చాలా తక్కువ శాతమని చెప్పొచ్చు. బ్లాగులు మొదలైన కొత్తలో ‘కామెంట్ మోడరేషన్’ లేని కారణంగా, ఈ వ్యాఖ్యల మీద అదుపు వుండేది కాదు. అందువలన ఆ రోజుల్లో ఈ వ్యక్తిగత దూషణలు కొంచెం ఎక్కువ మోదాతులోనే వుండేవని వినికిడి.

     సాధారణంగా బ్లాగు నిర్వహించడానికి blogger.com, wordpress.com లను ఉపయోగిస్తారు. వీటిని వాడడానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు, చాలా సులభంగా కావలసిన రీతిలో బ్లాగును నిర్మించుకోవచ్చు. బ్లాగు పేరు పెట్టడానికి, వ్రాసిన రచన ఏ విభాగానికి సంబంధించిదో తెలుపడానికి, ఏ రోజు, నెల, సంవత్సరం వ్రాశామో నమోదు చేసుకోవడానికి వీలుగా అన్ని సదుపాయాలు ఉంటాయి. రచనలకు అనుబంధ చిత్రాలను ప్రచురించే సౌలభ్యం కూడా వుంటుంది. ఎక్కువ మంది ఆదరించిన రచనలు, కొత్తగా పెట్టిన వ్యాఖ్యలు, వారికున్న ఇతర బ్లాగుల వివరాలు అన్నీ ఒకే దగ్గర చూసే వీలు ఉంటుంది. ఎవరి బ్లాగు వాళ్ళే కాకుండా నచ్చిన ఇతర బ్లాగుల వివరాలు కూడా అదే పేజీలో పొందుపరిచే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇతర బ్లాగర్లు కొత్త రచనలు చేసినప్పుడు ఆ సమాచారం సొంత బ్లాగులో చూసే వీలు వుంటుంది. తమ రచనలను గూగుల్ ప్లస్, ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్ డెన్, ఈమెయిలు ద్వారా ఇతరులతో పంచుకునే సౌలభ్యం కూడా ఉంది.

      వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు వారు, వారి పరిసరాలలోని ప్రజా జీవన విధానం గురించి వ్రాసిన రచనల వలన సమకాలీన సాహిత్యం అవగతమౌతుంది. బ్లాగులో మాండలిక౦లో వ్రాసిన అనుభవాలు, కథలూ గడచి పోయిన బాల్యాన్ని, ఆనాటి అనుబంధాలను తిరిగి కళ్ళ ముందుకు తీసుకొస్తాయి. కవితలు రాయడమే కాక వాటికి తగిన అందమైన బొమ్మలు వేసి అందించే బ్లాగులు కూడా ఉన్నాయి. ఒక సాధారణ విషయాన్ని అసాధారణ శైలిలోవ్రాయగలిగిన బ్లాగరులు కొందరు తమ రచనలను ఏ పత్రికకూ పంపించక బ్లాగులో పెడుతూ ఉంటారు. ఆ రచనలపై, పాఠకుల తక్షణ స్పందనలే వారి రచనలకు స్ఫూర్తి.

     పుస్తక సమీక్షలు, పుస్తక పరిచయాలు తెలిపే బ్లాగులో వ్రాసిన పుస్తక సమీక్షలను చదివి, చదువవలసిన పుస్తకముల జాబితా తయారు చేసుకోవచ్చు. దీనివలన ఎన్నో మంచి పుస్తకాలు చదివే అవాకాశం ఉంటుంది. ఈ బ్లాగులు రచయతల గురించి, రచనల గురించి విస్తృతమైన సమాచారం అందిస్తున్నాయి. ఒక్క రచయితల గురించే కాకుండా చిత్రకారులు, ప్రాచీన కవులు, శిల్పులు, ఆయా రంగాలలో నిష్ణాతులైన వారి పరిచయాలు కూడా లభ్యమౌతాయి.

     చలనచిత్రాలపై వ్రాసిన సమీక్షలు చదవడం వలన గతంలో చూడలేకపోయిన మంచి సినిమాలు చూసే అవకాశం కలుగుతుంది. నేడు విడుదవుతున్న కొన్ని అసభ్య చిత్రాలపై సమీక్షలను ఎటువంటి పక్షపాతం లేకుండా వ్రాసి బ్లాగులో పెట్టడం గమనార్హం. నేటి చిత్రాలలో అశ్లీలతను ప్రతిఘటి౦చే విషయంలో బ్లాగులలో జరిగే చర్చలు చదివిననాడు, అటువంటి చిత్రాలు నిర్మించడానికి, కనీసం ఊహించడానికి కూడా ఎవరూ సాహసించరేమో అనిపిస్తుంది. నాటి ఆణిముత్యాల నుంచి నేటి ఉర్రూతలూగించే పాటల వరకూ అన్నింటి సాహిత్యం ఈ బ్లాగులో చదవొచ్చు. వేటూరి, జంధ్యాల, ఘంటసాల, సావిత్రి మొదలైన సినీప్రముఖుల అభిమానులు కొందరు వారికోసం బ్లాగులు నిర్వహిస్తున్నారు. ఈ బ్లాగులలో వారి నటజీవితానికే కాక నిజ జీవితానికి సంబంధించిన వివరాలూ, వారి జీవితాలలో వారనుభవించిన అటుపోట్లూ చదివి ‘ఎందరో మహానుభావులు’ అనుకోకుండా ఉండలేము.

     నిశ్చలచిత్రాలకు సంబంధిన బ్లాగుల్లో అందమైన ప్రకృతి దృశ్యాలను, అద్భుతమైన విశేషాలను చూడొచ్చు. విరిసిన పువ్వులు, శోభాయమానమైన సాయంస౦ధ్యలు, నదీనదాలు, గడ్డిపరకపై జారుతున్న చినుకు ముత్యాలు పరవశింపచేస్తే, ఎన్నడో చిన్నతనంలో చూసిన పువ్వు, లేచిగురు మావిడి చెట్టు, చేదభావి హఠాత్తుగా మన ఎదురుగా నిలబడి మనల్ని గతస్మృతుల నేపధ్య౦లోకి తీసుకువెళ్ళి, ఎదలో అనుభూతుల పరిమళాలు నింపుతాయి. పాపికొండల నడుమ సూరీడు, ఝుంటి తేనెలు గ్రోలుచున్న తుమ్మెద, ఆకసాన నీలిమేఘ౦, వెన్నెలతో సయ్యాటలాడే కొబ్బరాకు, గూటిలోంచి తొంగిచూసే గువ్వపిట్ట, సందెవేళ వికసించే సన్నజాజి మనసున మల్లెలు పూయిస్తాయి.

     తెలుగు నేర్చుకోవలనుకునే వారికి, పిల్లలకు తెలుగు నేర్పించేవారికి అవసరమైన సమాచారం బ్లాగులలో దొరుకుతుంది. ఈ విషయంలో ఆయా బ్లాగరుల సహాయసహకారాలు కూడా ఉంటుంది. పిల్లల కథలు, బొమ్మల కథలు, శ్రవణ కథలు, పిల్లల పాటలు ఇలా ఉన్న ప్రత్యేకమైన బ్లాగులు ఉన్నాయి. వేమన శతక౦, సుమతీ శతకం, శ్లోకాలు, నీతి కథలు అన్నీ కూడా ఈ బ్లాగుల్లో దొరుకుతాయి.

తెలుగు భాషా ఉపకరణాలు

      కంప్యూటర్ లో తెలుగు వ్రాయడానికి baraha.com, lekhini.org, telugulipi.net, google.com/transliterate లాంటి ఉపకరణాలు ఎన్నో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. బ్లాగ్ స్పాట్ లో తెలుగులో రాసే సౌలభ్యం కూడా ఉంది. ఈ ఉపకరణాలు ద్వారా ఇంగ్లీషులో టైప్ చేసిన అక్షరాలను తెలుగులోకి మార్చుకోవచ్చు. ప్రారంభంలో అలవాటులేని కారణంగా తెలుగు టైప్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించినా త్వరలోనే సులభంగా టైప్ చెయ్యగలుగుతాము. అయితే ఈ సాఫ్ట్ వేర్ ల వలన ఎదురయ్యే ముఖ్య సమస్య ఏమిటంటే తెలుగు టైపింగ్ లోఅక్షరదోషాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. భవిష్యత్తులో ఈ సమస్యలులేని ఉపకరణాలు లభ్యమౌతాయని ఆశిద్దాం.

      బ్లాగు, వ్రాయడం చదవడం మూలంగా మంచి చిత్రాలు, పాటలు, సాహిత్యం పరిచయమౌతుంది. బ్లాగులో వ్యక్తిగత అభిప్రాయాలు, అనుభవాలు పంచుకోవడం వలన అవి చదివిన వారికి, మనలాంటి అభిప్రాయాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారన్న అవగాహన కలుగుతుంది. తద్వారా ఒకే అభిరుచులు కలిగిన వారు స్నేహితులవడం సర్వసాధారణం. తెలుగు చదవడం కోసం ఆన్ లైన్ పత్రికల మీద ఆధారపడిన వాళ్ళకు ఈ బ్లాగులు ఒక వినూత్న కోణాన్ని చూపిస్తాయి. మొదటిసారి ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన వాళ్ళకు ఒక అత్భుత ప్రపంచాన్ని చూస్తున్న భావన రాకమానదు.

వ్యాఖ్యలు

       ఏ పని చేయడానికైనా తగిన ప్రోత్సాహం, సమర్ధవంతంగా చేయగలమన్న ఆత్మవిశ్వాసం కావాలి. మెచ్చుకుంటే పొంగిపోని వాళ్ళు ఉ౦డరేమో...ఈ మెచ్చుకోలు ఔషదంలాగా పనిచేసి వ్రాయడానికి, తద్వారా సృజనాత్మకత పెంచుకోవడానికి తగిన ప్రోత్సాహం ఇస్తుంది. బ్లాగులో వ్రాసిన టపా చదివిన పాఠకులు వ్యాఖ్యల రూపంలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఈ వ్యాఖ్యలు కొన్ని మనసారా నవ్విస్తాయి, కొన్ని ఆలోచింపచేస్తాయి, మరికొన్ని ఓదార్పునిస్తాయి, ఎక్కువ భాగం ప్రోత్సహిస్తాయి. సామాన్యంగా వ్రాయగలిగిన వారెవరైనా, భాష మీద ఆసక్తి ఉంటే బ్లాగు వ్రాయడం మొదలెట్టాక వ్రాయడంలో నిష్ణాతులవుతారు. అక్కడ లభించే ప్రోత్సాహమటువంటిది. చదివిన వారందరూ వ్యాఖ్య పెట్టాలనేం లేదు, కాని ఎంత మంది బ్లాగు చదువుతున్నారో బ్లాగు నిర్వహించేవారు చూసుకోవడానికి వీలుంటుంది. దానివల్ల తాము వ్రాసిన జాబు ఎక్కువమందికి నచ్చిందో లేదో తెలిసిపోతుంది.

     అంతర్జాలం ఎల్లలు లేని ప్రపంచం కావడం వల్ల ఒక్కొక్కసారి విపరీతమైన వ్యాఖ్యలు ఎదురవుతుంటాయి. విమర్శల ఘాటు మితిమీరుతుంది. అదుపులేని స్వేఛ్ఛ ఎవరికీ మంచిది కాదు. అందుచేత వ్యాఖ్యలని నియంత్రించుకోవడం తప్పనిసరి. వ్యాఖ్యలు రాసేటప్పుడు కూడా సంయమనం పాటించడం మంచిది.

బ్లాగు సంకలినిలు

      కొన్ని వందల సంఖ్యలో వున్న బ్లాగులను ఒకచోట చూపించి, పదుగురికీ తెలియజేసేవే సంకలినులు . ఈ సంకలినుల నిర్వాహకులు, తెలుగు భాషాభిమానంతో వీటిని స్వచ్ఛ౦దంగా నిర్వహించడం అబినందనీయం. ఈ సంకలినుల్లో ప్రధానమైనవి koodali.org, maalika.org, jalleda.com, haaram.com , sankalini.org, telugu.samoohamu.com, blogillu.com. బ్లాగు మొదలుపెట్టినప్పుడు బ్లాగు వివరాలను ఈ సంకలినిలలో నమోదు చేసుకోవాలి. బ్లాగులో ఒక టపా ప్రచురించగానే ఆ సమాచారం సంకలినిలో మొదటి పేజీలో చూపిస్తుంది, అక్కడ ఎప్పటికప్పుడు కొత్త సమాచారం లభ్యమౌతుంది. దాదాపుగా అన్ని సంకలినిలలోనూ బ్లాగులలోని తాజా వ్యాఖ్యలను చూసే సౌలభ్యం ఉంది. దీని వలన పాత టపాలు, చూడలేకపోయిన మంచి టపాల సమాచారం తెలుస్తుంది. కొన్ని సంకలినులు తమ అనుబంధ పత్రికలను కూడా నిర్వహిస్తున్నాయి. సంకలినుల్లో ఆసక్తి ఉన్న అంశాలు చదవడానికి వీలుగా బ్లాగులు, వ్యాఖ్యలు, ఫోటో బ్లాగులు, సినిమాలు, సాంకేతికం, వార్తలు, సాహిత్యం లాంటి విభాగాలు విభజించారు. కొన్ని సంకలినుల్లో ఎక్కువ మంది ఆదరించిన టపాల వివరాలు, ఆసక్తి కరమైన అంశాల వివరాలు కూడా లభ్యమౌతాయి. ఉత్తమ తెలుగు బ్లాగులను 100telugublogs.blogspot.com బ్లాగులో చూడొచ్చు.

    నేటి వేగవంతమైన జీవన సరళిలో చిన్న చిన్న ఆనందాలను, స్పందించే అంశాలను వదిలి ఎండమావుల వెంట పరుగులు పెడుతున్నాం. బాల్యంలో ఆడిన ఆటలు, చదివిన చందమామ కథలు, అమ్మ పెట్టిన గోరుముద్దల మాధుర్యం అన్నీ అక్షరాల్లో దాగి వేచిచూస్తున్నాయి. మన మూలాలను గుర్తుచేసే ఎన్నో విషయాలు పుస్తకాల్లో భద్రపరచి ఉన్నాయి. అశ్లీలత, అసభ్యం పెచ్చుపెరిగి పోతున్నాయని వగచే ముందు మన సంస్కృతి, సాంప్రదాయాలను మరొక్కసారి మననం చేసుకుందాం. నవతరానికి మన సంస్కృతిని పరిచయం చేసి ఉత్తమ విలువలు కాపాడదాం, దానికి చదవడం ఒక్కటే మార్గం.

         చదవు ఒక యోగం, చదవగలగడం ఒక భోగం, బ్లాగు చదవడం అందరికీ మోదం.


ఆటా జ్ఞాపికను చదవడానికి ఇక్కడ నొక్కండి. 

Wednesday, July 4, 2012

కౌముదిలో నా కవిత 'ప్రతిఫలం'

నా కవిత 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'జూలై' సంచికలో ప్రచురితమైంది.నా కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ప్రతిఫలం 


సందె మబ్బులు
చీకటి మాటుకు తప్పుకుంటున్నై!
వేచియున్న కలువపై
వెన్నెల పరచుకుంటోంది!

మదిలో ఏ మూలో...
నిశ్శబ్దపు ఒంటరి రాత్రి
జ్ఞాపకాల దొంతర కదిలిన చప్పుడు!

అప్పుడెప్పుడో...
'నీకేం కావాలని' కదూ అడిగావ్!
ఏం అడగాలో ...
ఎలా చెప్పాలో... తెలియని రోజులు
ఒక్క నవ్వు నవ్వేసి ఊరుకున్నా!

ఆ తరువాతెప్పుడో ...
'ఏం తెచ్చానో చూడమ'న్నావ్,
మూసిన గుప్పెట్లో విరిసిన మల్లెలు!

వెన్నెల విహారాలు...
జాజిపూల పరిమళాలు!
వలపు సయ్యాటలు...
సరసాల సరాగాలు!

మోయలేని భారంతో...
మనసు కృంగిన రోజు
కొండంత ఓదార్పైనావు!

అనుభవాలు
పాఠాలయ్యాయి!
జీవితం గోదారి పాయలా
నిండుగా సాగిపోతుంది!

అప్పటి నీ ప్రశ్నకు,
ఇప్పటి నా సమాధానం
అదే చిరునవ్వు!

కాలంతో పాటు కలసిపోనీక
నువ్వు కాపాడిన
'నా నవ్వు'కు
ప్రతిఫలంగా నీకు నేనేమివ్వగలను?


Thursday, May 3, 2012

కౌముదిలో నా కవిత 'వెఱ్ఱి ఆశ '

నా కవిత 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'మే' సంచికలో ప్రచురితమైంది.
నా కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.

           వెఱ్ఱి ఆశ 

అయినా అంత తొందరేంటి నీకు?
కలిసెళ్దాం అనుకున్నాం కదా!
నువ్వొక్కదానివే అలా వెళ్లిపోవడమేనా?

ఎవరేమైతే నీకేం? ఎవరెలాపోతేనేం?
అరె....వెళ్లేముందు కనీసం ఓ మాట...

అయినా ఏ రోజు నువ్వు నా మాట విన్నావు కనుక!
నా కోసం వేచి వుండకన్నానా ...
రాత్రవనీ, అపరాత్రవనీ,
నేనొచ్చేదాకా కళ్ళు వాకిటనే!
తిండీ లేదూ ...నిద్రా లేదూ....

అసలు నువ్వెంత గడుసుదానివంటే...
నా ఇష్టాలేంటో తెలుసుకున్నావు కాని,
కనీసం ఒక్కసారైనా, నీకు నచ్చేవే౦టో చెప్పావా?
నన్ను పసివాడిగా మార్చి ఏమి తెలియకుండా చేశావ్!

నీ కెంత స్వార్ధం లేకపోతే...
సంతోషాన్నంతా మూట కట్టుకుని,
విషాదాన్ని విరజిమ్మివెళ్తావ్ ?

నాకేనా పౌరుషం లేనిది?
నీ తలపులన్నీ ఈ పూటే తుడిచేస్తా....

అదేంటో.... చెరిపేస్తున్నకొద్దీ కనిపిస్తూనే వున్నయ్
ఊట బావిలో నీరులా....
అవి కూడా నీ అంతే మొండివి మరి!

నీ ఉనికితో నా మనసంతా వెల్లవేసినట్టున్నావ్
ఏ వైపు చూసినా నీ రూపమే!

నువ్వు మొన్న కట్టిన పచ్చ చీర
జ్ఞాపకాల అలల్ని రేపుతోంది!

నువ్వు నాటిన మల్లెమొక్క
నిను గానక... బిక్క మొహం వేసింది!

నా సంతోషానికి అవసరమైన మందేదో
చెప్పడం మరిచిపోయావ్,
ఎదుటనున్న కాలం అంతా....
నీ తలపులు మోస్తూ బ్రతకమన్నావా!

తిట్టానని కోపగించుకుని రాకుండా వుండకేం!
మరుజన్మలోనైనా... నన్ను కలుస్తావని వెఱ్ఱి ఆశ!!

Tuesday, April 10, 2012

సంబరం అంబరమైన వేళ

      ఇది నిజమా..నిజంగానేనా, నిజంగా నేనేనా...ఏమిటో కొత్తకొత్తగా... వింతగా... కొండంత ఆనంద౦, ఒకింత ఆశ్చర్యంతో కలసి ఈ చిన్న మదిలో సందడి చేస్తోంది..

     ఈ ఆకాశం ఇంత నీలంగా, నిర్మలంగా ఉందేవిటి...వెండి మబ్బులు ముసిముసి నవ్వులు రువ్వుతూ వెళుతున్నట్లుగా లేవూ...చల్లగాలి మరింత హాయిగా వీస్తోంది. రోజూ చూసే ఈ మందారం ఇవాళ మరింత అందంగా పూసిందే...ఆ రావి చెట్టు ఆకులన్నీ వింత నాట్యం చేస్తున్నట్లుగా ఎలా ఊగుతున్నాయో...గోడమీద కాలెండర్ మీదన్న బోసినవ్వుల పసి పాపలను చూస్తోంటే కలిగిన పరవశం, మది దాటి అంబరాన ఇంద్రధనస్సై మెరిసింది.

     ఆ నాటి ఆ ఆనందం విహంగమై ఎగురి విహ౦గలో వాలింది.

నా కవిత ప్రచురించిన విహంగ సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.



మధురమైన సంగతేదో
ఎదనుచేరి మురిసింది!
ఎన్నడూ ఎరుగనిది
ఏమిటో ఈ భావం!
నన్ను నాకే కొత్తగ చూపే
ఓ వింత యోగం!

నీటిని తనలో నింపుకున్న
నీలిమేఘపు పరవశమా!

చినుకు బరువును మోసే వేళ
ముత్తెపుచిప్ప తన్మయమా!
అంకురాన్ని దాచుకున్న
తొలిబీజపు మైమరుపా!

కొత్త చివురులు తొడుగుతున్న
హరిద్రువపు పులకి౦తా!

మది దాగని భావమొకటి
పెదవిన పువ్వై విరిసింది!

ఒడినిండే సంబరమేదో
అ౦బరమై నిలిచింది!!



Wednesday, February 1, 2012

లలలా..లలలా

ఏమైందీ ఈ వేళ
ఎదలో ఈ సందడేల
మిలమిలమిల మేఘమాల
చిటపట చినుకే ఈవేళ!

      ఇంతకూ ఎందుకీ సంతోషం అంటున్నారా....నేనో కథ రాసే సాహసం చేశాను. ఏదో ఓ రోజు కథ రాయాలి, అది పత్రికలో అచ్చవ్వాలనే కోరిక ఇవాళ తీరింది. నా తొలి కథ 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'ఫిబ్రవరి' సంచికలో ప్రచురితమైంది. నా కథను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా బోలెడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

కనుల ఎదుటే కలగ నిలిచా
కలలు నిజమై జగం మరిచా
మొదటి సారి మెరుపు చూశా
కడలిలాగే ఉరకలేశా!!
                                       
                           మధురక్షణాలు 

         కారు మలుపు తిరిగి, ఇంటిముందుకు వచ్చింది. పచ్చటి లాన్, ఆ చివరగా బంతిపూలు అందంగా తలలూపుతున్నై. కారు గరాజ్ లో పార్క్ చేసి తలుపు తీసి లోపలికి వచ్చింది కృష్ణ. వాజ్ లోని రోజాపూలు తాజాగా ఆహ్లాదంగా వున్నాయి. గోడమీది బాపుబొమ్మ, టీవీ పక్కగా ఉన్న కొంటె కృష్ణుడు, కుండీలోని మనీ ప్లాంట్ ఇవాళ మరీ అందంగా కనిపిస్తున్నాయ్. సరాసరి బెడ్ రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయి తన కిష్టమైన వైట్ స్కర్ట్, పింక్ టాప్ వేసుకు౦ది. అప్పటికి టైం ఆరవుతోంది. “మధు ఇవాళ  ఎప్పుడొస్తాడో” అనుకుంటూ ఫోన్ చేసింది, అవతల నుండి మెస్సేజ్. ఈ లోగా వంట చేద్దామని కిచెన్ లోకి వెళ్లి ‘ఈ వేళ బయట తినేద్దా౦లే’ అనుకుంటూ బయటకు వచ్చింది కృష్ణ.

          సమ్మర్ లాంగ్ ఈవినింగ్, అప్పుడే ఎండ తగ్గుముఖం పడుతోంది. ఉదయం నుండి వెయిట్ చేస్తున్న పిల్లలు సైకిళ్ళు, స్కూటర్ల తో ఒక్కక్కరే బయటకు వస్తున్నారు. క్రిస్టీన్, అమేండా వాకింగ్ కి వెళ్తూ కృష్ణను చూసి విష్ చేశారు.  కుక్క పిల్లతో ఆడుతూ ఉన్న ఎదురింటి జాస్మిన్ ను చూసి పలకరింపుగా నవ్వింది కృష్ణ. ఆ పాప సిగ్గుగా నవ్వి మళ్ళీ ఆటల్లో పడింది. “మూడేళ్ళు౦టాయేమో బొద్దుగా, రింగుల జుట్టుతో ఎంత బావుంటుందో” అనుకుంటూ మొక్కలకు నీళ్ళు పెట్టడానికి పైప్ తీసికుంది. ఈ లోగా సెల్ ఫోన్ మోగింది. 

నెంబరు చూసి “హాయ్ మధూ బయలుదేరావా?” అంది ఉత్సాహ౦గా.
“లేదురా ఇవాళ రిలీజ్ ఉంది లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చెయ్యకు.”
“అదికాదు ఇవాళ...”
“సారీ కృష్ణా, అర్జంట్ పనుంది మళ్ళీ మాట్లాడదాం.” కృష్ణను కట్ చేస్తూ ఫోన్ పెట్టేసాడు మధు. 

          పైప్ కట్టేసి మెల్లగా లోపలికి వెళ్లి సోఫాలో కూర్చుంది. మధ్యాహ్నం ఫోన్ వచ్చి౦దగ్గర్నుండీ మధు కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తోంది కృష్ణ. ఏం చెయ్యాలో తోచక టీవీ చూస్తూ, ఎన్నాళ్ళుగానో ఈ విషయం మధుతో ఎలా చెప్పాలో ఈ సాయంత్రం ఎలా గడపాలో అని వేసుకున్న ప్లాన్స్ ఇలా అప్సెట్...అవ్వడం నిరాశగా నిట్టూర్చింది. ఎలాగూ మధు రావడం లేటవుతు౦దిగా అనుకుంటూ ఫ్రిజ్ లో మిగినకూరలు, రెండు చెపాతీలు  తీసి వేడి చేసి ప్లేటులో పెట్టుకుని టేబుల్ దగ్గర కూర్చుంది. పోనీ అమ్మతో మాట్లాడితేనో, అనుకుంటూ ఫోన్ తీసికుంది.

“హలో అమ్మలూ ఏంటి౦త పొద్దున్నే ఫోన్ చేసావ్?”
“ఏం లేదు మధు ఇంకా రాలేదు... అందుకని” విషయం ఎలా చెప్పాలో తెలియక ఏదో చెప్పేసింది.
“సరే, అలాగయితే నాన్న వెళ్ళాక చెయ్. ఈ పూటసలే  పనితెమలడంలా.”
“అలాగేలే” అంటూ ఫోన్ కట్ చేసింది. ఏమీ తినాలనిపించలేదు. బెడ్రూం లోకి వెళ్లి పడుకుని పుస్తకం తెరిచింది ఏవేవో ఆలోచనలు.

                    *              *           *             *

       నిద్రలేమితో  ఎర్రబడిన కళ్ళు బలవంతంగా తెరుస్తూ టైం చూసింది కృష్ణ. “మైగాడ్ అప్పుడే ఎనిమిదయ్యిందా” అనుకుంటూ లేచింది కృష్ణ. మధు పక్కనే గాఢనిద్రలో ఉన్నాడు. అలసిపోయి నిద్రపోతున్న మధు మొహం పసిపిల్లాడిలా కనిపించింది. మెల్లగా చప్పుడు చేయకుండా రెస్ట్ రూమ్ కి వెళ్లి మొహం కడుక్కుని,  సీరియల్ బౌల్ లో పెట్టుకుని ఈవేళ ‘వర్క్ ఫ్రం హోం’ తీసికోవాలనుకుంటూ మెయిల్  ఓపెన్ చేసింది. ఆఫీసులో ఏదో ప్రాబ్లం తప్పనిసరగా వెళ్ళాలని మెయిల్. 'అన్నీ ఒక్కసారే వస్తాయనుకుంటూ' మధు కోసం కొంచం నూడుల్స్ చేసి అతన్ని లేపకు౦డానే ఆఫీసుకి బయలుదేరింది. 

మధ్యాహ్నమవుతు౦డగా మధు ఫోన్ చేసాడు.
“గుడ్ మార్నింగ్ మధూ”
“నన్ను లేపకు౦డానే ఆఫీసుకి వెళ్లిపోయావేం?”
“పాపం రాత్రంతా వర్క్ చేసి వుంటావ్ కదా! ఎందుకులే అని, నువ్వివాళ ఆఫీసుకెళ్ళాలా?”
“ఇంకో గంటలో ఫ్లైట్ ఉంది. డెన్వర్ వెళ్ళాలిగా మరచిపోయావా?”
“అస్సలు గుర్తే లేదు. నువ్వెళ్ళాల్సిందేనా తప్పదా?” దిగులుగా అడిగింది.
“నువ్వలా అంటే నేనసలు వెళ్ళలేను బేబీ. ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ తప్పకు౦డా వెళ్లి తీరాలి ఎంత త్రీ డేస్ లో వచ్చేస్తాగా.”
“ఓకే మరి, నా మీటింగ్ కి టైం అవుతోంది ఫ్లైట్ ల్యాండ్ అవగానే ఫోన్ చేయి.”
“బై బాబీ, ఐ లవ్ యు.”
“బై”

                                *                *             *             * 

        ఆఫీసు లో పని అయ్యేప్పటికి రాత్రయింది.  ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి కాఫీ తాగి ఈ విషయం ముందుగా అమ్మకు చెప్పాలనుకుంటూ ఫోన్ చేసింది.

“ఎప్పుడు చేస్తావా అని ఎదురు చూస్తున్నా, నిన్న మళ్ళీ ఫోన్ చెయ్యలేదేం?”
“పడుకు౦డి పోయానమ్మా. ఏంటి కబుర్లు?”
“ఎప్పుడూ ఉండేవే. నిన్న మీ పెద్దమ్మఏం చేసిందో తెలుసా?" అంటూ ఇంట్లో ఏదో గొడవ గురించి చెప్పుకుపోతూ ఉంది. ఆ ప్రవాహం ఓ అరగంటక్కానీ ఆగలేదు.
అంతా అయ్యాక కృష్ణకి ఇ౦కేమీ చెప్పాలనిపించలేదు “నువ్వవన్నీ ఏం మనసులో పెట్టుకోకు. సరే అమ్మా నిద్రొస్తుంది, మళ్ళీ మాట్లాడదా౦!” అంటూ ఫోన్ కట్ చేసింది.
ఉదయం నుండి పొంచి ఉన్న ఒంటరితనం మెల్లగా పక్కకు చేరింది. దాన్ని తరిమేయడానికి ఏవో టీవీ ప్రోగ్రామ్స్ తో కాలక్షేపం చేసి ఆ రాత్రిని దాటించింది.

                                 *           *            *            *
         సాయంత్రం ఇంటి దగ్గరకు రాగానే మధు కార్ చూసి మూడు రోజులుగా దాచుకున్న ఉత్సాహం నిలువెల్లా ఆవరించగా ఒక్క ఉదుటన లోపలికి వచ్చింది. మధు విశ్రాంతిగా సోఫాలో  కూర్చుని లాప్ టాప్ లో ఏవో బ్రౌజ్ చేస్తున్నాడు. 

“అదేంటి అప్పుడే వచ్చేశావ్? రేపు కదా నీ ఫ్లైట్?  అంటూ పక్కన కూర్చుంది.
“నువ్వు వెళ్ళాలా? అని దిగులుగా అడిగావుగా, అందుకే త్వరగా వచ్చేసాను” అన్నాడు దగ్గరకు తీసుకుంటూ.
“నీ కోసం ఎంత ఎదురు చూశానో తెలుసా” అంది మధు గుండెల్లో ఒదిగిపోతూ.
ఈ లోగా ఫోన్ మోగింది. మధు ఫోన్ తీసుకుంటూ నంబర్ చూసాడు. “అన్నయ్య ఫోన్.. నువ్వు త్వరగా ఫ్రెష్ అయిరా డిన్నర్ కి బయటకెళదాం.” అన్నాడు మధు.
“జస్ట్ ఫైవ్ మినిట్స్” హుషారుగా బెడ్ రూంలో దూరింది మధు.
రెడీ  అయి తనకిష్టమైన  'ఎస్టీలాడర్' స్ప్రే  చేసికు౦టు౦డగా కంగారుగా మధు గొంతు వినిపించింది.

“డాక్టర్ గారు ఏమన్నారు?”
******
“కంగారేమీ లేదుగా?”
******
“అమ్మెలా ఉంది?”
******
“మేము వెంటనే వచ్చేస్తాము.”
*****
“అలాగే ఓ గంట తరువాత ఫోన్ చేస్తాను.”

విషయం అర్ధం గాక అయోమయంగా చూస్తూ  “ఏమిటి అత్తయ్యగారికి ఏ౦ అయింది?” అడిగింది కృష్ణ.
“అమ్మకి కాదు నాన్నకి రాత్రి ‘స్ట్రోక్’ వచ్చిందంట డాక్టర్ స్టంట్ వెయ్యాల౦టున్నారట. ఇప్పుడు నాన్న ‘ఐసియు’ లో ఉన్నారట.”
“మరి వెంటనే టికెట్స్ చూడు,  నీకు ఆఫీసులో లీవ్ దొరుకుతుందా?”
“లేదు ఇండియా నుండి వర్క్ చెయ్యొచ్చు.” అంటూ టికెట్స్ చూడడం మొదలుపెట్టాడు.
“ఇప్పుడేమన్నా సర్జరీ చెయ్యాలట్నా? అడిగింది కృష్ణ.
 “అక్కర్లేదట అంత ప్రమాదం ఏమీ లేదన్నారట అన్నాడు మధు”
“మధూ మన గ్రీన్ కార్డు ఇప్పుడు స్టేజి ౩ లో వుంది కదా. మనం ఇప్పుడు వెళ్ళాలంటే అడ్వాన్స్ పెరోల్  తీసికోవాలేమో? సందేహం వెలిబుచ్చింది కృష్ణ.
ఒక్కసారిగా నిస్త్రారణ ఆవహి౦చింది, లాప్ టాప్ మూసి పక్కన పెడుతూ, “నాకా విషయమే గుర్తు రాలేదు. ఇప్పుడెలా? తనలో తాననుకున్నట్లు మెల్లగా అన్నాడు మధు.
“డాక్టర్ గారు ఫరవాలేదన్నారుగా.  పైగా మూడు నెల్ల క్రితం మా మామయ్యక్కూడా  ఇలాగే బాగాలేకపోతే స్టంట్ వేశారుగా, ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. రేపుదయం పర్మిషన్ కి అప్లై చేసి వెంటనే వెళదాం. సరేనా” అనునయంగా అంది కృష్ణ.
“అలాగే ఇంక చేసేదేం ఉందీ” అని దిగులుగా కూచున్నాడు.

        మధు ఎంత వద్దన్నా కొంచెం అన్నం కలిపి బలవంతంగా తినిపించింది కృష్ణ. ఆ రాత్రంతా మధు వాళ్ళ నాన్నగారి గురించి, ఆయనతో తనకున్న అనుబంధం గురించి కృష్ణకు చెప్తూనే ఉన్నాడు. పర్మిషన్ కు అప్లై చేస్తే ఓ వారం దాకా రాదని తెలిసింది. ఏం చెయ్యాలో తోచలేదు. అప్పటికీ మధు వాళ్ళ నాన్నగారికి స్టంట్ వెయ్యడం పూర్తయ్యింది. ఆయన మధుతో మాట్లాడి ప్రయాణాన్ని వారించాడు. ఆ తరువాత ఓ వారానికి వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చాక్కాని మధు మామూలు మనిషి కాలేకపోయాడు.

                             *           *            *            *

శనివారం పొద్దున లేస్తూనే, నాన్న ఆరోగ్యం గురించి కనుక్కుని కిచెన్ లోకి వచ్చాడు మధు.
మధు కిచెన్ టేబుల్ దగ్గర కూచుని మౌనంగా బయటకు చూస్తూ ఉంది.
“ఈ మధ్య కృష్ణ ఎందుకో డల్ గా ఉంటోంది. ఏమై ఉంటుంది?” అనుకుంటూ, “బయటకు వెళ్లి చాలా రోజులై౦ది కృష్ణా, ఎక్కడికైనా వెళదామా?” అడిగాడు మధు.
కృష్ణ లేచి ఫ్రిజ్ లో మిల్క్ కాన్ బయటకు తీస్తూ, “ఎక్కడి కెళదాం?” అంది.
‘స్మోకీస్ కి వెళదాం ఫాల్ కలర్స్ చూడొచ్చు’ అన్నాడు కాఫీ పౌడర్ తీస్తూ...
అలాగే అని అర్ధం వచ్చేలా మౌనంగా తలూపింది.
కృష్ణకు సైట్ సీయింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ‘బయటకు వెళ్దాం’ అంటే ఎగిరి గంతేసేది. “ఒంట్లో బాగాలేదా?” అనడిగాడు కృష్ణ.
“బాగానే ఉంది” అంటూ కళ్ళలో తడి కనపడనీయకునా కాఫీ కలిపే నెపంతో తల వంచుకుంది.
"సరే అయితే నేను స్నాక్స్ అవీ పెడతాను" అంటూ లేచి పాంట్రి తలుపు తెరిచాడు మధు. కావలసినవి ఒక్కటొక్కటే బయటకు తీస్తున్నాడు. అప్పుడు కనిపించింది ప్రీనాటల్స్ డబ్బా, ఆశ్చర్యంగా చేతిలోకి తీసికుని, సాలోచనగా కృష్ణ వైపు చూసాడు. కృష్ణ కిటికీలోంచి సూన్యంలోకి చూస్తూ కనిపించింది. జరిగినదేమిటో మధుకు అర్ధమయ్యింది. మెల్లగా వచ్చి కృష్ణ ఎదురుగా నిలబడి దగ్గరకు తీసికున్నాడు. కృష్ణ కళ్ళలో దాచుకున్న తడి మధు ఎదను తడిపేసింది.

                                   *           *            *            *

Wednesday, January 11, 2012

హారం పత్రిక 'సరాగ' లో నా కవిత

      హారం పత్రిక నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో నా కవితకు ద్వితీయ బహుమతి వచ్చింది. ఈ సందర్భంగా హారం పత్రిక సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెలుకు౦టున్నాను. హారం పత్రిక 'సరాగ' ను ఇక్కడ చూడొచ్చు.

చుక్క పొడిచే వేళకైనా...

మంచుతెరను తొలగించుకొని 
భూమిని తాకిందో రవికిరణం!
ఆనందంతో జంటపక్షులు
ప్రభాతగీతం పాడుతున్నాయి! 
రోజులానే!!

నిదురలేచిన నందివర్ధనం 
మనోహరంగా నవ్వుతోంది! 
రెక్కవిచ్చిన మందార౦
సిగ్గురంగును పులుముకుంది! 
ఎప్పట్లానే!!

ఎండవేళ ఆవు, దూడకు
వేపచెట్టు గొడుగయ్యింది!
కొమ్మ మీది కోయిలమ్మ
కొత్త రాగం అందుకుంది!
నిన్నటిలానే!!

పెరటిలోని తులసికోట
దిగులేదో పెట్టుకుంది!
పోయ్యిలోని పిల్లికూన
పక్కకైనా జరగనంది!

చెండులోని మల్లెమొగ్గ 
పరిమళాలు పంచకుంది! 
వీధి గడప ఎవరికోసమో
తొంగి తొంగి చూస్తోంది!

చుక్కపొడిచే వేళకైనా
తలుపు చప్పుడవుతుందా!!

Tuesday, January 3, 2012

కౌముదిలో నా కవిత 'ప్రయాణం'

ఉన్న వూరిని కన్న వాళ్ళని చూసి ఎన్నేళ్లయిందో..
ఉరుకులు పరుగుల నుంచి కాస్తంత ఆటవిడుపు!

కనుచూపు మేరలో ప్రయాణం...
అంగళ్లన్నీ తిరిగి... అవీ ఇవీ పోగేశా౦
అటకమీంచి దుమ్ముదులిపి...పెట్టెలేమో సర్దేశా౦!

ఇంకెంత చుక్క పొడిచే లోపే ఊరు చేరిపోతాం..
అయినవాళ్ళ సందిట్లో వేగిరం వాలిపోతాం!

మురిపాలు, ముచ్చట్లు, కౌగిలింతలు, పలకరింపులు..
పేరు పేరునా పలకరించి... కానుకలేవో ఇచ్చేశాం!

తిరుపతి వెంకన్న, శ్రీశైలం మల్లన్న
మనకోసమే వేచి వున్నారు మరి!

అదిగదిగో బట్టల దుకాణం, ఆ వైపునేమో సూపర్ బజారు,
ఈ పక్కనే నగల కొట్టు, అటు మూలన బోటిక్కు!

తిరిగేశాం...చూశాశాం ...దొరికినవన్నీ కొనేశాం
అవసరముందో లేదో...అక్కడివన్నీ దొరకవుగా!

హడావిడంతా విచ్చు రూపాయలదే...
ఉన్నచోట ఉండక ఒకటే పరుగులు!

ఆవకాయ, నిమ్మకాయ, మాగాయ, వుసిరి,
సోలెడు పసుపు, తవ్వెడు కారం....
పట్టేసాం..దంచేసాం..మూటలన్నీ కట్టేశా౦!

ఇంకెంత పొద్దు వాలే లోగానే..
తట్ట, బుట్ట, పెట్టె, బేడా
నట్టింట చేరినయ్!

అర్ధరాత్రి జేట్లాగ్ భాగ్యంతో..
ఒంటరిగా కూర్చుని తలచుకుంటే..
ఏవీ కన్నవాళ్ళతో గడిపిన నాలుగు క్షణాలు!
ఈ హడావిడిలో విశ్రాంతి ఏ మూల నక్కిందో మరి!!


నా కవిత 'కౌముది'ఇంటర్నెట్ మాసపత్రిక 'జనవరి 'సంచికలో ప్రచురితమైంది.
నా కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.




Wednesday, November 30, 2011

కౌముదిలో నా కవిత 'నిర్వేదం'

చెట్టు మీద పిట్ట ఒకటి జాలిగా చూసింది
ఒంటరి నక్షత్రం బాధగా నిట్టూర్చింది!

ఆనవాలు లేని అలజడేదో...
తొంగి తొంగి చూస్తోంది!

ముక్కలైన రోజులన్నీ...
చీకటి మాటున మెసలుతున్నై!

నిన్న మానిన గాయం
కొత్త మందును కోరుతోంది!

మరచిపోయిన సంగతేదో...
దిగులుకు తోడై వచ్చింది!

అంతులేని విషాదానికి
పాత చిరునామా దొరికింది !

నిలకడలేని ఆలోచన
అంధకారాన్ని ఆశ్రయమడిగింది!

రాలిపోయే ఉల్కను చూసి
ఎగిసే అల విరిగి౦ది!!


నా కవిత 'కౌముది'ఇంటర్నెట్ మాసపత్రిక 'డిసెంబర్ 'సంచికలో ప్రచురితమైంది. నా కవితను ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.

Friday, September 2, 2011

చందమామ సాక్షిగా...

చినుకు... చినుకు... మధ్య కలసి చిందులేశా౦
రావి ఆకుల గలగలలో.. రాలుగాయిలమై తిరిగాం!

వెన్నెల్లో.. చెమ్మ చక్క లాడాం
కోయిలతో... గొంతులు కలిపాం!
భేతాలుడి పొడుపు కధలు విప్పాం
ఇసుక తిన్నెల్లో... గవ్వలెన్నో ఏరాం!

ఎక్కడికేళ్లి పోయింది... ఎప్పుడెళ్లిపోయింది?
పంట చేను గట్టు మీద పైరగాలై పోయిందా..
అమ్మ పెట్టిన గోరింటాకులో.. చందమామై పోయిందా..

కారులొద్దు మేడలొద్దు
మిడిమేలపు పయనమొద్దు!
పొరుగు తెలియని బ్రతుకులొద్దు
కాలంతోటి పరుగులొద్దు!

అయ్యయ్యో
ఇప్పుడెలా...ఎక్కడని వెతకను?
చుక్కల పరదా చాటునా...మబ్బుల పల్లకి లోనా...
విరజాజి పరిమళంలోనా..సెలయేటి గలగలల్లోనా...

మీక్కనిపిస్తే  కాస్త జాడ చెప్పరూ...
ఎక్కడున్నా తెచ్చుకుంటా!
నా బాల్యాన్ని గుండెల్లో దాచుకుంటా!
చందమామ సాక్షిగా...వెన్నెలమ్మ మీదొట్టు!

తొలి ప్రచురణ తెలుగు నాడిలో.....