Showing posts with label స్ఫూర్తి. Show all posts
Showing posts with label స్ఫూర్తి. Show all posts

Tuesday, November 25, 2014

కాళోజీ నారాయణరావు

అవనిపై జరిగేటి అవకతవకల చూసి
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు
పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె
మాయమోసము జూచి మండిపోవును ఒళ్లు!

       ఎవరో  కాళోజీ నారాయణరావు గారట ఆయన కవిత్వమట ఇది. అవనీ, అవకతవకలూ అంటూ అర్ధం లేని కబుర్లు. ఏమైనా అప్పటివాళ్ళకు బ్రతకటం చేతకాదు. ఏదో ఉద్యోగమో, వ్యాపారమో చేసుకున్నామా, తిన్నామా పడుకున్నామా అన్నట్లుండాలి, లేకపోతే ప్రజాసేవ పేరుతో పాపులారిటీ అయినా తెచ్చుకోవాలి గాని ఇలా గుండె కరిగిపోవటాలు, ఒళ్ళు మండిపోవటాలు దేనికంటా?

    అంతేనా, ఇంకా వినండీ "కైత చేత మేల్కొల్పకున్న కాళోజీ కాయము చాలింక'' అని ప్రకటించుకున్నార్ట. ఏదో కవ్వితం అంటే ప్రాసలు, పద ప్రయోగాలు, వెన్నెల్లూ, వెండి కొండలూ అంటూ రాసుకోవాలి. లేకపోతే ఎవరికీ అర్ధం కాని భాషలో ఆ ఘోషేదో వినిపించాలి కానీ,  ఏమిటో దేశభక్తి, వర్గాల పోరాటం, లోకంలో జరుగుతున్న దగాలు, సామాజిక వ్యత్యాసాలు, కర్షకుల ప్రాధాన్యం అంటూ కవిత్వం వ్రాశార్ట ఈ ప్రజాకవి. ఈయన "నా గొడవ" అంటూ వినిపించిన కవిత్వం చూడండి.

నా గొడవ నాది-అక్షరాల జీవనది
నానా భావనా నది- నీనా భావన లేనిది
మన భావన నది - సమ భావన నది
ఎద చించుక పారునది- ఎదలందున చేరునది
నా గొడవ నాది- కాళోజీ అనునది

    నాది నాదే, నీదీ నాదే అనుకోకుండా సమభావన అని ఇలా గొడవ గొడవగా దాదాపు 3000లకు పైగా కవితలు వ్రాశారట. అప్పటి వాళ్ళు ఇలాంటి కవిత్వంతో మేల్కొన్నారేమో కాని మనమైతేనా నాలుగు పేజీలు తిప్పేసి పుస్తకం పక్కన పడెయ్యమూ!

అన్నపు రాసులు ఒక చోట- ఆకలి మంటలు ఒక చోట
హంస తూలిక లొక చోట- అలసిన దేహాలొక చోట
సంపదలన్నీ ఒక చోట- గంపెడు బలగం ఒకచోట
అనుభవమంతా ఒక చోట -అధికారం బది ఒక చోట''

ఏమాటకామాటే చివర వాక్యాన్ని మనం మరో వెయ్యేళ్ళు మార్చకుండా చదువుకోవచ్చు. 

తెలుగు స్పష్టంగా మాట్లాడడమే నామోషీ అనుకుంటుంటే ఈయనొకరు.
"అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా!''
ఇలా తిడితే ఇంకేమైనా ఉందీ! ఎవరైనా మనెదురుగానే వెధవ పని చేస్తున్నా భవిష్యత్తులో వాళ్ళతో మనకు ఏం అవసరం వస్తుందో ఏమిటోనని చూసి చూడనట్లు పోవాలి కానీ ఇలా మాట్లాడితే మన మీద కత్తి కట్టరూ!

    రాజకీయ విప్లవాల ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించి ఆ ఏర్పడిన ప్రభుత్వాలు సమానత్వాన్నీ స్థాపించవచ్చు. కానీ సౌభ్రాతృత్వం లేనిదే ఈ రెండింటివల్ల కలిగే ఫలితం ప్రజలకు చెందదు. దీనికి నాయకుల కృషి సరిపోదు ఇది రచయితల వలెనే సాధ్యమౌతుంది అన్నార్ట పిచ్చి మారాజు. బాగా డబ్బులు సంపాదించినవాళ్ళకు, దేశమంతా స్థలాలు కొన్నవాళ్ళకు విలువిస్తారు వారి మాటే వింటారు కాని, రచయితలకు విలువిచ్చి వారి రచనలు చదివి మారతారటండీ! 

     పైగా కత్తులూ, కఠార్లతో రజాకార్లు స్వైరవిహారం చేస్తున్న రోజుల్లో ఈయన ఆంధ్రమహాసభల్లో, ఆర్యసమాజ్‌ ఉద్యమాల్లో పాల్గొంటూ వరంగల్ కోట మీద కాంగ్రెస్ వాళ్ళతో కలసి జెండా ఎగరవేశార్ట. ఈయన ఉద్యమాలంటూ తిరిగబట్టే పాతికేళ్ళు నిండకుండా జైలు పాలయ్యారు. ఇవన్నీ అనుభవమయ్యే ఇప్పటి పిల్లల్ని సామాజిక బాధ్యత, న్యాయం, ధర్మం అంటూ పనికిమాలిన విషయాల జోలికి పోకుండా ఉద్యోగానికి పనికివచ్చే చదువుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్ళలో పెడుతుంది.  

     ఈయనకు రావి నారాయణరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, పొట్లపల్లి రామారావు, టి.హయగ్రీవాచారి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, గార్లపాటి రాఘవరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, దాశరథి, సినారె, బిరుదురాజు రామరాజు, కన్నాభిరాన్, ఎస్ ఆర్ శంకరన్, సంజీవదేవ్, చలసాని ప్రసాద్, మో, శ్రీశ్రీ, కృష్ణాబాయి, కాళీపట్నం రామారావు, మహాశ్వేతాదేవి, జ్వాలాముఖి, ఆరుద్ర, నగ్నముని, జయశంకర్, నాగిళ్ల రామశాస్త్రి, గద్దర్, వరవరరావు, ఎన్.వేణుగోపాలవీళ్ళంతా స్నేహితులట. ఏవో రెండు మూడు పేర్లు కాస్త తెలిసినట్లుగా ఉన్నాయి కాని ఎవరో మరి వీళ్ళంతా?

   అప్పుడేదో మద్యం నిషేధం అని ఉండేదిట. వినడానికే నవ్వొస్తోంది కదూ! అసలు గ్లాసులు ముందుపెట్టుకునే కదూ తొంభై శాతం నిర్ణయాలు తీసుకునేది! మరి అర్ధం పర్ధం లేని ఈ నిషేధాలేమిటో! ఒకవేళ అవన్నీ బయట నినాదాలిచ్చుకుని ఇంటికెళ్ళి ఓ ఫుల్లు లాగించొద్దూ! పాపం స్నేహితులెవరో కాస్త పుచ్చుకోవయ్యా అంటే "బయట మద్యనిషేధ చట్టం ఉన్నది గనక తాగొద్దు. ఐనా తాగుదామంటవా ఖైరతాబాద్ చౌరస్తాకు బోయి, విశ్వేశ్వరయ్య విగ్రహం దగ్గర నడీ చౌరస్తాల నిలబడి ఈ చట్టాన్ని మేము ఒప్పుకోవడం లేదు, కాబట్టి దీన్ని ఉల్లంఘిస్తున్నం అని తాగుదాం," అన్నార్ట ఈ ఛాందస వాది. మాంసం తింటున్నామని పేగులు మెళ్ళో వేసుకుని తిరుగుతామటండీ! ఇక ఆ స్నేహితులు మరోనాడు ఈయనకు మందిస్తారా అసలు ఇంటికైనా పిలుస్తారా అని. బొత్తిగా లౌక్యం తెలియని మనిషి.

    కాళోజీ గారు న్యాయ శాస్త్రం చదివారట కాని ఏనాడూ రూపాయి సంపాదించకపోతే వీళ్ళ అన్నయ్య రామేశ్వరరావుగారే ఇంటికి కావలసిన మంచీ చెడ్డా చూసుకునేవారట. పాపం రామేశ్వరరావు చనిపోయినప్పుడు కాళోజీ గారు ‘నేను నా ఆరవయేట మా అన్న భుజాల మీదికెక్కినాను, ఆయన మరణించేదాకా దిగలేదు. నేను ఆయన భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. డెబ్బై ఏళ్ల వరకూ ఆయన నన్ను దించకుండా ఉండడం గొప్ప,’ అన్నార్ట . అన్నన్నేళ్ళు మరో కుటుంబాన్ని కూడా పోషించటం అంటే ఆ అన్నగారెంత సత్తెకాలం మనిషో తెలుస్తోంది. 

    ఆయన్ను అంతగొప్ప ఇంతగొప్ప అని పొగిడిన వాళ్ళు మణులూ మాన్యాలు ఇచ్చారనుకుంటున్నారా! అబ్బే సెప్టెంబర్ తొమ్మిదిన అదేనండి అయన పుట్టినరోజును “తెలుగు మాండలిక భాషా దినోత్సవం” గా జరుపుకుంటామన్నార్ట. హన్మకొండలోని నక్కలగుట్ట ప్రాంతానికి 'కాళోజీనగర్' అని పేరు పెట్టార్ట.  

    "ఒక్క సిరా చుక్క వేయి మెదళ్ళ కదలిక" అంటూ కాళోజీ గారో మాట చెప్పారు. మనం చాలా తెలివైన వాళ్ళం కదూ! మెదడ్ని కష్టపెట్టే పన్లు మనకెందుకు? మన వేల చదరపు అడుగుల ఇళ్ళలో సిరా చుక్కల పుస్తకాలు లేకుండా జాగ్రత్త పడుతున్నాం. ఇప్పుడు కూడా ఏవో నాలుగు సినిమా కబుర్లు చదువుదామని వెళ్తేనూ సాక్షిలోనూ, విశాలాంధ్ర లోనూ ఇవి కనిపించాయి. 

   బుజ్జిపండు ఈ మధ్య లైబ్రరీనుండి ఏమిటేమిటో పుస్తకాలు తెస్తున్నాడు. ఏం చదువుతున్నాడో ఏమిటో కాస్త జాగ్రత్తగా గమనించాలి. ఇట్లాంటివి చదివితే ఇంకేమన్నా ఉందీ!


Wednesday, February 19, 2014

ఇంకేమంటాం?

      సమీరలాంటి వారిని ఏమనాలో కూడా అర్ధం కాదు. ఆడవాళ్ళంటే కాస్త సుకుమారంగా, కొంచెం బేలగా, అంతో ఇంతో మొహమాటపడుతూ ఉంటే కదా అందం. అలాంటిదేవీ లేకపోగా అమెరికా వచ్చిన ఏడాదిలోనే ఏవో కోర్సులవీ చేసి ఐటిలో ఉద్యోగం సంపాదించింది. ఇండియాలో ఏదో పెద్ద చదువు చదివిందనుకుంటున్నారేమో! అదేం కాదు బికాం డిగ్రీ చేతబట్టుకుని వచ్చింది. ఉద్యోగం కూడా ఏ ఇంటిపక్కనో చూసుకోకుండా ఊరికిరవై మైళ్ళ దూరంలో వున్న ఆఫీసుకు అప్లయ్ చేసింది. డ్రైవింగ్ అన్నా వచ్చా అంటే అదీ అంతంత మాత్రమే. "పాపం ఆడపిల్ల హైవే లవీ ఎక్కి అంత దూరం ఎలా వెళ్తుంది? కొన్ని రోజులన్నా ఆఫీస్ దగ్గర దింపుదా౦" అని లేకుండా వాళ్ళాయన "నువ్వెళ్ళిపో" అని పెళ్ళాం కట్టిచ్చిన కారేజ్ తీసుకుని చక్కా పోయాడు. ఆ ఫ్రీవే మీద మరొకరైతే ఏం చేసేవారో కాని సమీర కదా ఎంచక్కా ఆఫీస్ కెళ్ళిపోయింది. "ఎలా వెళ్ళావ"ని అడిగితే "వేరే దారిలేదుగా" అని నవ్వుతూ సమాధానం.

       మేమందరం స్టీరింగ్ పట్టుకోవడానికి భయపడి మగమహారాజులు డ్రైవ్ చేస్తుంటే నిశ్చింతగా పక్కన కూర్చుని ఊరు వాడా తిరిగేస్తున్న సమయంలోనే, ఈవిడ డ్రైవ్ చెయ్యడం ఆయన సుఖంగా ముందు సీట్లో కాళ్ళు డాష్ బోర్డ్ మీద పెట్టుక్కూర్చోవడమూను...అంతలోనే అయిపోతే కథేముంది? వినండి.

       ఓ రెండేళ్ళు తిరిగేసరిగి సమీర తల్లి కాబోతుందని తెలిసింది. అంతా మామూలుగా ఉంటే మన౦ వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటాం? నిండు చూలాలు, రేపో మాపో ప్రసవం అయ్యే భార్యను పరాయి దేశంలో ఒంటరిగా వదిలి నాన్నకు హార్ట్ అటాక్ వచ్చిందని సమీర భర్త ఇండియా వెళ్ళాడు. అసలు తప్పంతా సమీరదే, అతనెంత తండ్రి మీద ప్రేమతో వెళ్ళాలనుకున్నా తొలి కాన్పు తనను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దని చెప్పక్కర్లా. అబ్బే అదే౦ లేదు, పైగా బట్టలన్నీ శుభ్రంగా మడతలు పెట్టి సూట్ కేస్ లో సర్ది పెడుతుందా? తీరా పురిటి సమయానికి స్నేహితులెవరో సంతకం చేస్తే ఆసుపత్రిలో చేర్చుకున్నారు. వాళ్ళాయన ఊరినుండి వచ్చేసరికి మగబిడ్డను ప్రసవి౦చిదనుకో౦డి. పరిస్థితి తారుమారుయ్యుంటే ఎవరు దిక్కు? ఏమైనా చెప్పామనుకోండి. "అతనికి వెళ్ళాలని వుంది నేను ఆగమని చెప్తే ఆగుతారా" అని నవ్వేస్తుంది. ఎక్కడా కోపం, దిగులు మచ్చుకైనా కనబడవంటే నమ్ముతారా?

     మరో రెండేళ్ళకు ఇంకో చంటిది. సరే ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు...ఇద్దరు పిల్లలు... ఇహనంతా మామూలుగా ఉందిలే అనుకున్నాం. ఈలోగా ఏమైందో ఏమో వున్న ఉద్యోగం మానేసి కన్స్ట్రక్షన్ బిజినెస్ అంటూ ఇల్లు కట్టించడం మొదలు పెట్టింది. "ఇదేం పని, ఇదేమైనా మన దేశమా? లేక మనకేమైనా మిలియన్స్ ఉన్నాయా? ఇలాంటి పని చేశారు. ఈ ఇల్లు కట్టించడం మనవల్ల అయ్యే పనేనా?" అని ఎన్నో విధాల చెప్పి చూశాం. ఇద్దరిదీ చిరునవ్వే సమాధానం. ఇంటి పనికి సమయం సరిపోవడం లేదని ఉన్న ఉద్యోగం మానేసింది. "ఇప్పుడెలా డబ్బులూ అవీ చాలా కావాలేమో కదా" అంటే "అవే వస్తాయని" ఆయన సమాధానం. ఆ ఇల్లు కాస్తా పూర్తయ్యింది. ఏమాటకామాటే ఇల్లు ఇంద్ర భవనంలా ఉందనుకోండి. ఇక అమ్మేద్దాం అనుకునే సమయానికి అమెరికాలో ఆర్ధిక కాటకం అదేనండీ రెసిషన్. చేసేదేం లేక ఆ ఇంట్లోనే కాపురం పెట్టారు. అప్పుడన్నా మోహంలో ఎక్కడైనా దిగులు విచారం కనిపిస్తాయేమో అని చూశాం. అబ్బే అదే చిరునవ్వు.


     "ఇప్పుడేంటి సమీరా, మళ్ళీ ఉద్యోగంలో చేరుతావా?" అని అడిగితే "ఇద్దరం బిజీగా వుంటే పిల్లలకు కష్టమౌతుంది. మెడికల్ బిల్లింగ్ చేద్దామనుకుంటున్నాను" అని చెప్పింది. ఏ డాక్టర్ ఆఫీస్ లోనే పని చేస్తుంది కాబోలుననుకున్నాం. ఆ కోర్స్ ఏదో చేసి పదివేల డాలర్లు పెట్టి కావాల్సిన సరంజామా తయారు చేసుకుని సొంతంగా ఆఫీస్ మొదలు పెట్టింది. రెండేళ్ళ వరకూ డాక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగింది తిరిగినట్లే ఉందనుకోండి ఒక్క డాక్టరూ కరుణించలా. ఆ దారిలో వెళ్దామనుకున్నకొందరు స్నేహితులు చేతులెత్తేశారు. కాని తను మాత్రం అనుకున్నది సాధించింది. ఇప్పుడు ఇండియాలో కూడా దానికనుబంధంగా మరో ఆఫీస్ తెరిచి౦దిట. "అబ్బా నువ్వు చాలా గోప్పదానివి సుమా " అంటే కనీసం దానికైనా ఒప్పుకోవచ్చుగా "నేనే చెయ్యగలిగానంటే ఎవ్వరైనా చెయ్యగలరని" మనల్నే మునగ చెట్టు ఎక్కించేస్తుంది. ఇలాంటి వారిని ఏమనాల౦టారూ?



Wednesday, April 25, 2012

ఎందరో మహానుభావులు

        మా ఊరిలో కొత్త పత్రిక ప్రచురణ గురించి చెప్పాను కదా.. మేము ప్రచురించిన రెండవ పత్రిక ఇది. తొలి పత్రిక పోయిన ఉగాదికి ప్రచురించాము. ఆ పత్రికావిష్కరణ శ్రీ పెమ్మరాజు వేణుగోపాలరావు గారి చేతుల మీదుగా జరిగింది. ఈ పత్రికలే కాక మరో నాలుగు వార్తాపత్రికలు కూడా చేశాము కాని, వాటిని ముద్రించలేదు.

       పత్రిక ప్రారంభించడం వెనుక కథ చెప్పాలి మీకు. పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నాము కదా, వారికి ఏవిధంగా స్ఫూర్తి నివ్వాలి అని ఆలోచించాము. పిల్లలు పెద్దలను చూసి అనుకరణతో చాలా విషయాలు నేర్చుకుంటారు. మరి పిల్లలు చూస్తుండగా పెద్దలెప్పుడూ తెలుగు చదవడం, రాయడం జరగడం లేదు. 'ఏ విధంగా పెద్దవాళ్ళను తెలుగు చదవడానికి ప్రోత్సహిచాలా' అన్న ఆలోచనలో ఉండగనే మా ఊరిలో పిక్నిక్ జరిగింది. ఆ సమయంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో యాదృచ్చికంగా పత్రిక గురించిన చర్చ వచ్చింది. మా తెలుగు అసోసియేషన్ వారు, ఎవరైనా పత్రిక నడపడానికి స్వచ్ఛందంగా ము౦దుకు వచ్చే పక్షంలో పత్రిక, లేక వార్తా పత్రిక మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అప్పుడు ఈ పత్రిక చేయడానికి శ్రీవారు ముందుకు రావడం జరిగింది. మనం ఏదైనా తలచుకుంటే దైవ సహాయం ఎలా లభ్యమవుతుందో ఆ సంఘటన ద్వారా తెలిసింది. 

      ఒక  పత్రిక రూపుదిద్దుకోవాలంటే ఎన్నిన్ని అంశాలు౦టాయో అనుభవపూర్వకంగా అవగతమయ్యింది. ఏ కథలు కావాలి, ఎన్ని కవితలుండాలి, వ్యాసాలు, పిల్లల కోసం ప్రత్యేకమైన  కథ...ఈ విషయాలన్నీ సమగ్రంగా పరిశీలించి కావలసినవి మా ఊరి ప్రజలు రాసేలా ప్రోత్సహించాం. మొదట్లో ఒకరో ఇద్దరో రాసి పంపించారు. ఇప్పుడు మెల్లగా ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. వాటిని పత్రికలో ఏయే పేజీలలో వచ్చేలా చూడాలనేది రెండో అంశం అదే 'లేఅవుట్' అంటే డిజైన్. మిగిలినది అచ్చుతప్పులు, ఐదారు సార్లు సరిచూసినా కూడా మళ్ళీ మళ్ళీ కనిపించే
అచ్చుతప్పులు మా ఎడిటోరియల్ బోర్డ్ సమర్ధవంతంగా సరిదిద్దారు.

      మన సంస్కృతి, సాంప్రదాయాలకు సంబధించిన ఎన్నో వ్యాసాలు, కథలు, కవితలు, పిల్లల కోసం ప్రత్యేకమైన కథ, ఇలా ఎన్నో అంశాలు ఈ పత్రికలో చోటుచేసుకున్నాయి. ఈ పత్రిక ఇప్పుడు మా ఊరి తెలుగువారి ఇళ్ళల్లో కాఫీ టేబుల్ మీద ఉండడం, వారందరూ కూడా చదవడం జరుగుతోంది. వాహిని పత్రికను
 మీతో పంచుకోవాలని బ్లాగ్ లో పెడుతున్నాను. మీ సలహాలు, సూచనలు పత్రికాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి.

     ఒక పత్రిక వెనుక ఇంత కథ ఉందా అనిపించింది. ఏడాదికి రెండు, మూడు పత్రికలకే ఇంత పని ఉంటే స్వలాభాపేక్ష లేకుండా నెలకో పత్రిక వేస్తున్న సంపాదకుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఇతర దేశాలలోవు౦డి సాహిత్యసేవ చేస్తున్న పత్రికా సంపాదకులకూ, వారికి తమ సహకారాన్నందిస్తున్నకార్యకర్తలకూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.